Adsense

Friday, February 11, 2022

ఫిబ్రవరి 11 శుక్రవారం..రేపు అంతర్వేది నృసింహ కళ్యాణం

ఫిబ్రవరి 11 శుక్రవారం..
రేపు అంతర్వేది నృసింహ కళ్యాణం సందర్భంగా....!!

విష్ణుమూర్తి అవతారాల్లో నృసింహ అవతారం విభిన్నమైనదే కాదు విశిష్టమైనది కూడా,

 సింగం మనిషి, సంగం మృగర కలిసిన అవతారం కనుక ఈ అవతారం అపురూపమైనది కూడా.

 భక్తుని కోసం విభిన్నమైన అవతారాన్ని దాల్చి దుష్ట శిక్షణ చేసి భక్తుని నమ్మకాన్ని నిజం చేసిన స్వామికి అంతర్వేది కూడా ఓ వేదికయింది.

 తూర్పు గోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీనరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుదీరి భక్తులను అనుగ్రహిస్తున్నాడు.

 ప్రతి సంవత్సరం ఇక్కడ మాఘశుద్ధ సప్తమి నుండి మాఘ బహుళ పాడ్యమి వరకు నవాహ్నికంగా స్వామి వారికి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

 అందులో భాగంగా మాఘశుద్ధ దశమినాడు స్వామివారికి కల్యాణోత్సవం వైభవంగా జరిపిస్తారు. ఈ ఉత్సవాలకు అనేక ప్రాంతాలనుండి భక్తులు తరలి వస్తారు. 

స్వామి అమ్మవార్ల కల్యాణం తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఆలయానికి దూరంగా వశిష్టానదికి దగ్గరగా విశాలమైన కాళీ స్థలంలో కళ్యాణమండపం నిర్మించారు. 

ఈ విధంగగా కొన్ని వేలమంది స్వామివారి కళ్యాణం తిలకించే ఏర్పాటు చేసారు.

కళ్యాణం అనంతరం ఏకాదశి రోజున రథోత్సవం నిర్వహిస్తారు. అంతర్వేది త్రికోణాకారపు దీవిలో ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీనరసింహస్వామి కోవెల భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రంగా భాసిల్లుతోంది. 

అతి ప్రాచీనమైన ఈ ఆలయం ప్రస్థావన పురాణాలలో కూడా ఉంది. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది.

 కాశీకి వెళ్ళలేని వారు అంతర్వేది వెళ్ళినా మంచి ఫలితం ఉంటుందని అంటారు. ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.

సూతమహాముని అంతర్వేదిని గురించి శౌనకాది మహర్షులకు చెప్పినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఒకసారి బ్రహ్మ రుద్రయాగం చేయాలని సంకల్పించి యాగానికి వేదికగా ఈ ప్రదేశాన్ని ఎన్నుకుని శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. 

అందుకే ఈ ప్రదేశానికి అంతర్వేది అనే పేరు వచ్చింది అని చెబుతారు. వశిష్టమహర్షి ఇక్కడ యాగం చేసిన కారణంగా ఇది అంతర్వేదిగా ప్రసిద్ధి చెందింది. 

హిరణ్యాక్షుని కుమారుడైన రక్తావలోచనుడు అనే రాక్షసుడు ఈ వశిష్ట గోదావరి ఒడ్డున అనేక సంవత్సరాలు తపస్సు చేసి శివుని అనుగ్రహంతో వరం పొందుతాడు.

ఆ వరం ప్రకారం రక్తావలోచనుని శరీరం నుండి కింద పడిన రక్తపు బిందువుల నుండి మరికొంతమంది అతి బలవంతులైన రక్తావలోచనులు ఉద్భవిస్తారు. 

ఆ వరగర్వంతో యజ్ఞయాగాలు చేసే వారిని, గోవులను హింసించేవాడు. ఒకసారి విశ్వామిత్రుడికి, వశిష్ఠుడికి జరిగిన సమరంలో రక్తావలోచనుడు విశ్వామిత్రుని ఆజ్ఞపై వచ్చి భీభత్సం సృష్టించి, వశిష్ఠుడి నూరుగురు పుత్రులను సంహరించాడు.

 వశిష్ఠ మహర్షి శ్రీమహావిష్ణువుని ప్రార్ధించగా విష్ణుమూర్తి లక్ష్మీసమేతుడై నరహరి అవతారంతో రక్తావలోచనుడుని సంహరించడానికి వస్తాడు. నరహరి ప్రయోగించిన సుదర్శన చక్రంతో రక్తావలోచనుడి శరీరం నుండి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది మంది రాక్షసులు జన్మిస్తారు. 

నరశింహుడు ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్తావలోచనుని శరీరం నుండి పారిన రక్తం నేలపై పడకుండా చేస్తాడు. అది రక్తకుల్య అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్తావలోచనుడిపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సంహరిస్తాడు. 

ఈ రాక్షస సంహారం తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీనృసింహస్వామిగా వెలిశాడని ప్రతీతి.

ఈ రక్తకుల్యలోనే శ్రీమహావిష్ణువు తన చక్రాయుధాన్ని శుభ్రవరచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. 

ఈ రక్తకుల్యలో పవిత్ర స్నానం చేస్తే సర్వపాపాలు హరిస్తాయని విశ్వసిస్తారు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా సమేతుడే లక్ష్మణ, హనుమంతులతో కూడి వశిష్టాశ్రమాన్ని, లక్ష్మీ నరసింహమూర్తిని దర్శించి, సేవించినట్లు ఇక్కడే కొన్ని రోజులు నివసించినట్లు శిలా శాసనాలవల్ల తెలుస్తోంది.

 ద్వాపర యుగంలో పాండవ మధ్యముడు అర్జనుడు తీర్థయాత్రలు చేస్తూ 'అంతర్వేది' దర్శించినట్లు చేమకూర వెంకటకవి తన 'విజయయ విలాసము'లో, శ్రీనాధ కవిసార్వభౌముడు 'హరి విలాసం'లో రచించారు. 

ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం 300 ఏళ్ళకు పూర్వం నిర్మంచినట్టు తెలుస్తోంది. పల్లవులచే నిర్మితమైన తొలి ఆలయం శిథిలమైపోగా మళ్ళీ ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. ఈ ఆలయం మొగల్తూరు రాజ వంశీకుల ఆధీనంలో ఉండేది...స్వస్తి..

No comments: