తెలుగుపథం TELUGUPATHAM
THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Friday, May 2, 2025
ఆలోచనలే ఆయుధం!
వైశాఖ పురాణం - 5 వ రోజు పారాయణం
నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము యితర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు.
ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్ననని పలికెను.
అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన యుదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను.
జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొలిపినవి.
దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన యుదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను.
తన యుదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను.
విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను.
భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని మర్యాదలను రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను.
పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను, ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.
ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.
సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను.
అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు.
అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు. సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు.
శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు.
ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు. వ్యగ్రులై యేకాగ్రతలేనివారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును.
నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు. శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు.
ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు.
అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు.
స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు.
వసంత కాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును.
సులభమైన యే వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును.
కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది.
వసంతకలమున సర్వవస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును, నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును.
దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును.
దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.
పుష్పఫలపూర్ణములగు అడవులను, పర్వతములను లతాతరువులను, జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను, తుష్టి, పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులయాశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో
వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను, శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు, యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను, కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును.
అభ్యాగతుడై, అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును.
దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును.
కావున సోదర మానవులారా! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము.
కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ, దానధర్మములను, భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.
ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు.
తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు, అన్ని వర్ణములవారిని, అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై యింద్రాది సర్వదేవతా పరివేష్టితుడై, చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు
భూలోక సంచారము చేయుచు, శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కరికలను మించి వరముల నిత్తురు.
శ్రీహరి వైశాఖమున మత్తులై, ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని, గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును.
వైశాఖ మాసమున తననుగాని, పరమేశ్వరునిగాని, యితర దైవతములను సజ్జనులను పూజించినను, వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును.
ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానినవారిపై కోపించును. అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును.
వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము.
ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు.
సపరివారముగ వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్సించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ!
తమయేలుబదిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు
సద్బ్రాహ్మణులను, అతిధులను, అభాగ్యతులను, దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు.
సపరివారముగ వచ్చిన మహారాజును దర్సింపక కానుకల నీయక యున్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాసవ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు సిక్షింతురు.
కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును.
అందుచే వైసాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను.
వైశాఖ పురాణం - 4వ రోజు పారాయణం
నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను.
అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది.
వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు.
వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము.
ధనవంతులు - బంగారు, వెండిపాత్రలలోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను.
రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.
వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము.
మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమున గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగా భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును.
ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును.
విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక, తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక, విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును.
ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును.
వైశాఖమున బహిస్నానము నదీ/తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును.
వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును, అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును? పోగొట్టుకొనలేడని భావము.
శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనును. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో నేడు జన్మలలో చేసిన పాపములును పోవును.
జాహ్నవి, వృద్దగంగ, కాళింది, సరస్వతి, కావేరి, నర్మద, కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినది.
అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానమున వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును.
గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును.
ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను.
రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.
కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను, దరిద్రుడైనను, యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు, పండ్లు, వ్రేళ్లు, కూరలు, ఉప్పు, బెల్లము, రేగుపండ్లు, ఆకు, నీరు, మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము.
బ్రహ్మమున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రతదానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును.
దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము.
కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో ఎన్ని అలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము.
అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను, గుణవంతురాలైనను, భర్త కలిగియున్నదైనను, భర్తను ప్రేమించుచు, భర్తృప్రేమను కలిగియున్నను, వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము.
అనగా సర్వశుభలాభములనంది యువతులును వైశాఖవ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము.
శాక సూపాదులు(కూర పప్పు) యెంత యుత్తమములైనను, యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా.
స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను.
సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతమునాచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు.
వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలము అత్యధికము.
వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను, కాముకుడైనను, యింద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.
వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.
మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |
ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||
పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును.
వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |
అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||
గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |
ప్ర గృహ్ణీతమయాదత్తమర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||
ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |
గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||
అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి/పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును.
వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను/చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును.
ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను, పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.
వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు, శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును, స్నానము, దానము చేయనివారును, నరకమునకే పోదురు.
బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.
తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి, నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను, స్నానమాడక నాలుక తన యధీనములో నుండి 'హరి' యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్నా శవము వంటివాడు.
అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని 'శవము' వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును.
పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు.
పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా.
*వైశాఖ పురాణం నాల్గవ అధ్యాయము సంపూర్ణం...
వైశాఖ పురాణం 3వ రోజు పారాయణం
నారదమహర్షి మాటలను వినిన అంబరీష మాహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ!
వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా? మరి యింకనూ ఉన్నవా? అవి యేవి? వాని ఫలితములను గూడ దయయుంచి వివరింపుమని కోరెను.
అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండ జీవింతురు.
ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండ సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యము నందుదురు.
వైశాఖమాసపు యెండలకు బాధపడినవారికి /బ్రాహ్మణశ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చి యిహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు / సద్బ్రాహ్మణుడు ఆశయనముపై శయనించినను కూర్చున్నను దాత తెలిసి తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును.
ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశాఖమాసమున కశిపును(పరుపు లేక వస్త్రము) మంచముపై మంచి ఆచ్చాదనము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చేయువారు చక్రవర్తులై/చక్రవర్తి సమానులై తమ వంశము వారితో బాటు శారీరక, మానసిక బాధలు లేకుండ సుఖశాంతులతో అభివృద్ధి నందుదురు.
ఆయురారోగ్యములను కీర్తిప్రతిష్ఠలను పొందుదురు. నూరు తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తినందును. శ్రోత్రియుడైన సద్బ్రాహ్మణునకు ఆ మంచముపై పరుపుతోబాటు దిండును గూడ దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును, పరుపును, దిండును యిచ్చుటచే ఆ దాత అందరకు అన్నివిధముల ఉపకారము చేయువాడై ప్రతిజన్మయందును,
సుఖవంతుడు, భోగవంతుడు, ధర్మపరాయణుడై అన్నిటా విజయమునందుచు యేడు జన్మల వరకు మహావైభవముగ గడిపి తుదకు ముక్తినందును. తనతోబాటు నేడు తరములవారికిని ముక్తిని కలిగించును.
గడ్డి తుంగ మున్నగువానిచే నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీమహావిష్ణువు సంప్రీతితో తానే దానియందు శయనించును. ఊర్ణ, ఉన్ని, గొఱ్ఱె బొచ్చు నీటియందు పడినను తడవకనుండునో అట్లే పర్యంక శయ్యా దానము చేసినవారు.
సంసారసముద్రములోనున్నను ఆ వికారములంటని స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానమును చేయలేనివారు కట(చాప) దానమును చేయవచ్చును. శక్తియుండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చునట్టి పుణ్యమే అశక్తులై కట/శయ్యాదానము చేసినవారికిని వచ్చును.
పడుకొనిన వారికి నిద్రచే శ్రమ, దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వసుఖములనిచ్చును. రాజా! వైశాఖమాసమున కంబళి దానము చేసినవానికి అపమృత్యువును పోగొట్టి చిరకాలము నిశ్చింతగా సుఖజీవనము కలవానిని గావించును.
ఎండచే పీడింపబడినవానికి వస్త్రమును దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయమునంది తుదకు ముక్తినందును. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును. దుఃఖములు నశించును.
ఉత్తమ బ్రాహ్మణునకు పుష్పముల దానమిచ్చినచో సర్వజనులను వశపరచుకొన్న మహారాజై చిరకాలము సుఖించును. కుమారులు, మనుమలు మున్నగువారితో సర్వసౌఖ్యములనంది ముక్తినందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖమాసమున కర్పూర, తాంబూల దానమిచ్చినచో చక్రవర్తియై మోక్షమునందును.
చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనమును దానమిచ్చినచో సంసార తాపత్రయమునశించి సుఖించును. దుఃఖములు, పాపములు లేకుండ జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధద్రవ్యముల నిచ్చినచో నెట్టి బాధలు లేకుండ జీవించి మోక్షమునందును.
పద్మమాలను గాని అడవిమల్లెల మాలనుగాని దానమిచ్చినచో చక్రవర్తియై సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తినందును. వైశాఖమున మొగలి, మల్లెపువ్వులు దానమిచ్చినచో మధుసూదనుని యనుగ్రహమున సుఖ భోగములనంది ముక్తి నందును.
పోక చెక్కలను, సుగంధద్రవ్యమును, కొబ్బరి కాయలను దానమిచ్చినచో నేడు జన్మలవరకు బ్రాహ్మణుడై జన్మించి వేదపండితుడు, ధనవంతుడై యుండి యేడు తరములవారితో గలసి ముక్తినందును.
సద్బ్రాహ్మణుని యింటిలో విశ్రాంతి మండపమును కట్టించి యిచ్చినచో వాని పుణ్యము యింతయని చెప్పుటకు మాటలకందనిది సుమా. నీడనిచ్చు మండపము, నీడలోనున్న యిసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు, జనులకు ఉపకారము చేసినవారు లోకాధిపతులగుదురు.
మార్గమున తోట, చెరువు, నూయి, మండపము, వీనిని నిర్మింపజేసినవానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము అందువలని భయము లేదు. నూయి, చెరువు, తోట, విశ్రాంతి మండపము,
చలివేంద్రము,పరులకుపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు యివియేడును సప్తసంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలోనే యొకటి చేయకున్నను మానవునకు పుణ్యలోకప్రాప్తి లేదు.
వందలకొలది ధర్మకార్యములను చేసినను సంతానము లేనివానికి పుణ్యలోకప్రాప్తి లేకుండుటచే నతడు పైన చెప్పిన యేడు సంతానములలో యధాశక్తిగ వేనినైనను ఏ ఒకదానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములనందవచ్చును.
పుణ్యపాప వివేకములేని పశువులు , పక్షులు , మృగములు , వృక్షములు సద్ధర్మాచరణ లేకపోవుటచే పుణ్యలోకప్రాప్తినందవు. కాని పుణ్యపాప వివేచనాశక్తి కలిగిన మానవులి సద్ధర్మముల నాచరింపనిచో వారికి పుణ్యలోకములెట్లు కలుగును.
ఉత్తమములైన పోకచెక్కలు , కర్పూరము మున్నగు సుగంధద్రవ్యములు కల తాంబూలమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారి పాపములన్నియు పోవును.
తాంబూల దాత కీర్తిని ధైర్యమును , సంపదను పొందును. నిశ్చయము , రోగియైనవాడు తాంబూల దానము నిచ్చినచో రోగవిముక్తుడగును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తినందును. వైసాఖమాసమున తాపహారకమైన తక్రమును(మజ్జిగ) దానమిచ్చినవాదు విద్యావంతుడు , ధనవంతుడు నగును.
కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చేయదగినది సుమా. వేసవికాలమున ప్రయాణము చేసి అలసినవానికి మజ్జిగ నిచ్చిన మరింత పుణ్యమును కలిగించును. నిమ్మపండ్ల రసము ఉప్పు కలిపిన మజ్జిగయైన దప్పిక కలవానికి హితకరముగ నుండును.
వైశాఖమాసమున దప్పిక తీరుటకై బాటసారులకు సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యమెంతటిదో నేను చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసమున శ్రేష్ఠమైన బియ్యమును దాన మిచ్చినవారు పూర్ణాయుర్దాయమును , అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమునుపొందును.
తేజోరూపమైన గోఘ్ర్తమును(ఆవునేయి) సద్బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు అశ్వమేధయాగము పుణ్యమునంది తుదకు విష్ణుపదమును చేరుదురు.
విష్ణుప్రీతికరమైన వైశాఖమాసమున బెల్లమును దోసకాయను దానమిచ్చినవారు సర్వపాపములను పోగొట్టుకొని శ్వేతద్వీపమున వసింతురు. పగటి యెండకు అలసినవానికి సాయంకాలమున చెరకు గడను బ్రాహ్మణునకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమనంతము.
వైశాఖమాసమున సాయంకాలమున యెండకు అలసిన బ్రాహ్మణునకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమును చేరును. పండ్లను పానకమును దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందమును పొందుదురు.
దాతకు వాని పితృదేవతల ఆశీస్సులు లభించును. వైశాఖమాసమున పానకముతో బాటు మామిడి పండ్లను దానమిచ్చినచో సర్వపాపములు హరించును. పుణ్యలోకప్రాప్తి కలుగును. చైత్రమాసమునందలి అమావాస్యయందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో గయాక్షేత్రమున నూరుమార్లు పితృశ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును.
ఆ పానకమున కస్తూరి కర్పూరము వట్టివేళ్లు మున్నగువానిని కలిపి చైత్రమాసము నందలి అమావాస్యయందు దానమిచ్చినచో వివిధ రీతులలో చేయవలసిన శ్రాద్ధముల నిర్వర్తించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను.
*వైశాఖపురాణం మూడవ అధ్యాయం సంపూర్ణం .
వైశాఖ పురాణం - 2వ రోజు పారాయణం
నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు.
వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు.
వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు.
జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు.
జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు.
నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు.
దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు.
భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు.
శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహీనుడగుటయే కాదు, పశుపక్ష్యాది జన్మలనందుచున్నాడు.
వైశాఖమాస వ్రతమును పాటింపనివాడు చెరువులు త్రవ్వించుట, యజ్ఞయాగాదులను చేయుట మున్నగువానినెన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖమాస వ్రతమును పాటింపనిచో యివి అన్నియు వ్యర్థములగుచున్నవి.
వైశాఖవ్రతమును పాటించువానికి మాధవార్పితములగావించి భక్షించి ఫలాదులకును శ్రీమహావిష్ణు సాయుజ్యము కలుగును. అధికధనవ్యయముచే చేయు వ్రతములెన్నియో యున్నవి.
అట్లే శరీరమునకు క్లేశమును కలిగించు వ్రతములును యెన్నియో యున్నవి. ఆ వ్రతములన్నియు తాత్కాలిక ప్రయోజనములను కలిగించును. అంతియే కాదు, పునర్జన్మను కలిగించును.
అనగా ముక్తి నీయవు. కనుక నియమ పూర్వకమైన వైశాఖమాస ప్రాతఃకాల స్నానము పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును.
అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యము, సర్వతీర్థములయందు స్నానము చేసిన వచ్చు పుణ్యము వైశాఖమాసమున జల దానము చేసినంతనే వచ్చును.
ఆ దానము చేయునట్టి శక్తి లేకున్నచో అట్టి శక్తి కల మరియొకనిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును. హితములును చేకూరును.
దానములన్నిటిని ఒకవైపునను జలదానమును మరొకవైపునను వుంచి తూచినచో జలదానమే గొప్పది యగును.
బాటసారుల దప్పిక తీరుటకై మార్గమున చలివేంద్రము నేర్పరచి జలదానము చేసినచో వాని కులములోని వారందరును పుణ్యలోకములనందుదురు.
చేసినవారు విష్ణులోకము నందుదురు. చలివేంద్రము నేర్పరచుటచే బాటసారులు, సర్వ దేవతలు, పితృదేవతలు అందరును సంతృప్తులు ప్రీతినంది వరముల నిత్తురు. ఇది నిస్సంశయముగ సత్యము సుమా. దప్పికగలవాడు నీటిని కోరును. ఎండ బాధపడినవాడు నీడను కోరును. చెమటపట్టినవాడు విసురుకొనుటకు విసనకఱ్ఱను కోరును.
కావున వైశాఖమాసమున కుటుంబ సహితుడైన బ్రాహ్మణునకు, జలమును(నీరుకల చెంబును), గొడుగును, విసనకఱ్ఱను దానమీయవలెను. నీటితో నిండిన కుంభమును దానమీయవలయును. ఇట్లు దానము చేయనివాడు చాతకపక్షియై(చాతకమను పక్షి భూస్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును.
కావున మబ్బునుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండ ఆకాశముననే త్రాగి యుండును. ఆ నీరే వానికి జీవనాధారమైన ఆహారమని కవులు వర్ణింతురు) జన్మించును.
దప్పిక కలవానికి చల్లని నీటినిచ్చి యాదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యఫలము కలుగును. ఎండకుడస్సిన వానికి విసనకఱ్ఱతో విసిరి యాదరించినవాడు పక్షిరాజై త్రిలోక సంచార లాభము నందును అట్లు జలము నీయనివారు బహువిధములైన వాతరోగములనంది పీడితులగుదురు.
ఎండకుడస్సినవానికి విసురుటకు విసనకఱ్ఱ లేనిచో పైబట్టతో(ఉత్తరీయము) విసిరినవాడు పాపవిముక్తుడై విష్ణుసాయుజ్యము నందును.
పరిసుద్ధమైన మనస్సుతో భక్తితో తాటియాకు విసనకఱ్ఱ నిచ్చినను సర్వపాప విముక్తుడై బ్రహ్మలోకము నందును. అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకఱ్ఱనీయనివాడు నరకలోక బాధలనంది భూలోకమున పాపాత్ముడై జన్మించును.
గొడుగును దానము చేసినచో ఆధిభౌతిక, ఆధీఅత్మిక దుఃఖములు నశించును. విష్ణుప్రియమైన వైశాఖమున గొడుగుదానమీయనివాడు, నిలువ నీడలేనివాడై పిశాచమై బాధపడును.
వైశాఖమాసమున పాదుకలను దానమిచ్చినవాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరును మరియు నిహలోకమున బాధలను పొందడు, సర్వసుఖములనందును. చెప్పులు లేక బాధపడువానికి, చెప్పులులేవని అడిగినవానికి చెప్పులను దానము చేసినవాడు బహుజన్మలలో రాజగును.
నిరాధారులకు, బాటసారులకు ఉపయోగించునట్లుగా అలసట తీర్చునట్లుగా మండపము మున్నగువానిని నిర్మించినవాని పుణ్యపరిమాణమును బ్రహ్మయును చెప్పజాలడు. మధ్యాహ్నకాలమున అతిధిగ వచ్చినవానిని ఆహారమిచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును.
అంబరీషమహారాజా! అన్నదానము వెంటనే తృప్తిని కలిగించు దానములలో అత్యుత్తమము. కావున అన్నదానముతో సమానమైన దానములేదు.
ఆవశ్యకములు కావు. అన్నము మాత్రము యిష్టము ఆవశ్యకము. కాని ఆకలి తీరినచో నివియన్నియు నిష్టములు ఆవశ్యకములు నగును. అనగా అన్నము భార్య మున్నగువారికంటె ముఖ్యమైనది, ప్రశస్తమైనది.
అట్టి అన్నదానము అన్ని దానములకంటె నుత్తమమైనదని భావము. కావున అన్నదానముతో సమానమిన దానము యింతకు ముందులేదు, ముందుకాలమున గూడ నుండబోదు.
వైశాఖమాసమున అలసిన బాటసారికి జలదానము, చత్రదానము, వ్యజనదానము, పాదుకాదానము, అన్నదానము మున్నగునవానిని చేయని వారు పిశాచమై ఆహారము దొరుకక తన మాంసమునే భక్షించునట్టి దురవస్థను పొందుదురు.
కావున అన్నదానము మున్నగువానిని యధాశక్తిగ చేయవలయును. రాజా! అన్నమును పెట్టినవాడు తల్లినిదండ్రిని తన ఆదరణ మున్నగువానిచే మరపించును.
కావున త్రిలోకవాసులందరును, అన్నదానముచే సర్వోత్తమమైన దానమని మెచ్చుచున్నారు. జన్మ నిచ్చిన తల్లిదండ్రులు కేవలము జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే. కన్నందులకు అన్నము పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు.
కాని అన్నదానము చేసి జీవితమును నిలిపినవాడు తల్లిదండ్రులకంటె నిర్వ్యాజమైన ఉత్తమ బంధువు. నిజమైన తల్లియు తండ్రియు అన్నదాతయే.
కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు, సర్వదేవతాస్వరూపుడు, సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున, అన్ని తీర్థములు(వానిలో స్నానము చేసిన పుణ్యము) సర్వదేవతలు(వారిని పూజించిన ఫలము) సర్వధర్మములు(అన్ని ధర్మముల నాచరించిన ఫలము) కలుగునని బావము.
*వైశాఖ పురాణము రెండవ అధ్యాయము సంపూర్ణం...
వైశాఖ మాసం ప్రారంభం.. మొదటి రోజు.. వైశాఖమాస స్నాన సంకల్పము
*శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |*
*ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ||*
*సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం |*
*నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ||*
*వైశాఖః సఫలోమాసః మధుసూదన దైవతః |*
*తీర్థయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధికః ||*
*వైశాఖః సఫలం కుర్యాత్ స్నానపూజాదికం |*
*మాధవానుగ్రహేణైవ సాఫల్యంభవతాత్ సదా ||*
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరరౌ |*
*ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ||*
----------------------------------------
*ఓం మమ ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరతవర్షే , భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా / గంగా /గోదావర్యోః మధ్యదేశే అస్మిన్ (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరానాం మధ్యే శ్రీ .......(సంవత్సరం పేరు చెప్పాలి) నామసంవత్సరే , ఉత్తరాయనే , వసంతఋతౌ , వైశాఖమాసే , ....పక్షే , ....తిథౌ, ......వాసర యుక్తాయాం , శుభనక్షత్ర, శుభయోగ , శుభకరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం, శుభతిథౌ , శ్రీ మాన్ .....(పేరు చెప్పాలి), గోత్రః .........(గోత్రం పేరు చెప్పాలి) నామధేయస్య , ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం , శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం క్షేమ , స్థైర్య , విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం , గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం , ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవ్వన కౌమారవార్ధకేషు , జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్థాను జ్ఞానతో జ్ఞానతశ్చకామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం , సర్వేషాం పాపానాం అప నోద నార్థంచ గంగా గోదావర్యాది సమస్త పుణ్యనదీ స్నానఫల సిద్ధ్యర్థం , కాశీప్రయాగాది సర్వపుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం , సర్వపాపక్షయార్థం , ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం మేషంగతేరవౌ మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే*
---------------------------------------
*సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్థనా శ్లోకము*
----------------------------------------
*గంగాగంగేతియోబ్రూయాత్ యోజనానాంశతైరపి*
*ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి ||*
*పిప్పలాదాత్సముత్పన్నే కృత్యే లోకాభయంకరి*
*మృత్తికాంతే ప్రదాస్యామి ఆహారార్థం ప్రకల్పయ ||*
*అంబత్వద్దర్శనాన్ముక్తిర్నజానే స్నానజంఫలం*
*స్వర్గారోహణ సోపాన మహాపుణ్య తరంగిణి ||*
*విశ్వేశం మాధవండుంఢిం దండపాణీం చ భైరవం*
*వందేకాశీం గుహం గంగాం భవానీం మణికర్ణికాం ||*
*అతితీక్షమహాకాయ కల్పాంత దహనోపమ*
*భైరవాయనమస్తుభ్యం అనుజ్ఞాం దాతుమర్హసి ||*
*త్వంరాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పితా*
*యాచితో దేహిమే తీర్థం సర్వపాపాపనుత్తయే ||*
*యోసౌసర్వగతో విష్ణుః చిత్ స్వరూపీనిరంజనః*
*సేవద్రవ రూపేణ గంగాంభో నాత్రసంశయః ||*
*నందినీ నళినీ సీతా మాలినీ చమహాసగా*
*విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథ గామినీ ||*
*భాగీరథీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ*
*ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే*
*స్నానకాలేపఠేత్ నిత్యం మహా పాతక నాశనం ||*
*సమస్త జగదాధార శంఖచక్ర గదాధర*
*దేవదేహిమమానుజ్ఞాం తవ తీర్థ నిషేవణే ||*
*నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణుమపాంసతే*
*నమోజలధిరూపాయ నదీనాంపతయే నమః ||*
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ*
*ప్రాతఃస్నానం కరిష్యామి నిర్విఘ్నంకురు మాధవ ||*
---------------------------------------
*స్నానం తరువాత ప్రార్థనాశ్లోకాలను చదువుతూ , ప్రవాహానికి యెదురుగా , వాలుగా తీరానికి పరాజ్ముఖముగా కుడిచేతి బొటనవ్రేలుతో నీటిని కదిలించి 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి , తీరానికి చేరి కట్టుబట్టలను పిండుకోవాలి , తరువాత మడి / పొడి బట్టలను కట్టుకొని తమ సాంప్రదాయానుసారం విభూతి వగైరాలని ధరించి సంధ్యావందనం చేసుకోవాలి. తరువాత నదీతీరాన / గృహమున దైవమును అర్చించాలి. స్నానము చేయుచు క్రింది శ్లోకములను చదువుచు శ్రీహరికి - యమునికి అర్ఘ్యమునీయవలెను*
---------------------------------------
*వైశాఖే మేషగే భానౌ ప్రాతఃస్నాన పరాయణః |*
*అర్ఘ్యం తేహం ప్రదాస్వామి గృహాణమధుసూదన ||*
*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*
*ప్రగృహ్ణీత మయాదత్త మర్ఘ్యం సమ్యక్ ప్రసీదధ ||*
*ఋషభః పాపినాంశాస్తాత్వం యమ సమదర్శనః |*
*గృహాణార్ఘ్యం మయాదత్తం యథోక్త ఫలదోభవ ||*
---------------------------------------
*దానమంత్రం*
----------------------------------------
*ఏవం గుణవిశేషణ విశిష్టాయాంశుభతిథౌ* *అహం .....గోత్ర, .....నామధేయ ఓం
------------------------------------
*దాన పరిగ్రహణ మంత్రం*
--------------------------------------
*ఓం ఇదం , ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్థాత్* *అముకం ......గోత్ర , ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య* *ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్థం ఇదం అముకం దానం ఇదమితి* *దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిగృహ్ణామి* *స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును*
-------------------------------------
*నదీస్నానమాచరించే సమయములో చదువవలసిన మంత్రము*
-------------------------------------
*పిప్పలాద సముత్పన్నే కృత్యే లోక భయంకరీ*
*సైకదం తే మయా దత్తం ఆహారార్తం ప్రకల్పితం*
---------------------------------------
*మృత్తికా లేపన మంత్రం*
----------------------------------------
*అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరే మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం*
----------------------------------------
*స్నానమాచరించే సమయములో స్నానానుజ్ఞ మంత్రము*
---------------------------------------
*ఉధృతాపి వరాహేన కృష్ణేన శతబాహునా ఆరుహ్య మమగాత్రాణి సర్వం పాపం ప్రమోచయ పుణ్యందేహి మహాభాగే స్నానానుజ్ఞాం కురుష్వమాం*
---------------------------------------
*నదిలో నాభివరకు దిగినతరువాత పఠించవలసిన మంత్రము*
--------------------------------------
*గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ*
*నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు*
---------------------------------------
*నందినీ నళినీ సీతా మాలినీచ మహాపగా*
*విష్ణు పాదాబ్జ సంభూతాం గంగా త్రిపధగామినీ*
*భాగీరధీ భోగవతీ జాహ్నవీ త్రిదశేశ్వరీ*
*ద్వాదశైతాని నామాని యత్ర యత్ర జలాశయే*
*స్నాన కాలే పటేన్నిత్యం మహాపాతక నాశనం*
----------------------------------------
*స్నానమాచరించే సమయములో తలుచుకోవలసిన నామాలు*
----------------------------------------
*పావని,హ్రదిని,నళిని,సీత,సుచెక్షువు,సింధువు,గంగ,పద్మావతి,భోగవతి,స్వర్ణరేఖ,కౌశికి,దక్ష, పృధివి,సుభగా,విశ్వకాయ,శివామృత,*
*విద్యాధరి,సుప్రసన్న,లోకప్రసాదిని,క్షేమ, వైష్ణవి,శాంతిదా,గోమతి,సతి,సావిత్రి,తులసి, దుర్గ,మహాలక్ష్మి,సరస్వతి,రాధిక,లోపాముద్రా, దితి,రతి,అహల్యా,అదితి,సంఙ్ఞ,స్వధా, స్వాహా,అరుంధతి, శతరూపా,దేవహూతి.*
---------------------------------------
--------------------------------------
*వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం. మాసాలన్నింట్లో వైశాఖమాసం ఉత్తమమైనది. విశేషదానాలకి ఎంతో పుణ్య ప్రదమైన మాసంగా పురాణాలలో చెప్పబడింది. శ్రీ మహా విష్ణువు కు ప్రీతి కరమైన ఈ వైశాఖ మాసం లో తులసి దళాలతో శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో కలిపి పూజించిన వారికి ముక్తి దాయకం. ఈ మాసం లో ఏక భుక్తం , నక్తం అయాచితం గా భుజించడం ఉత్తమం గా చెప్పబడింది. వైశాఖ మాసం దేవతలతో సహా అందరికీ పూజనీయమైనది. యజ్ఞాలకు , తపస్సులకు పూజాదికాలకు , దాన ధర్మాలకు ఎంతో ఎక్కువ ఫలమిచ్చి శాంతినిచ్చి కోరికలను తీరుస్తుంది.ఎవరైతే ఈ మాసం లో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేస్తారో , వారికి ఉత్తమగతులు కలుగుతాయి. ఉదయాన్నే స్నానం చేసి ఎక్కువ నీటి తో రావి చెట్టు మొదళ్ళను తడిపి ప్రదక్షిణాలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు. ఈ మాసం లో శివునికి ధారపాత్ర ద్వారా అభిషేకం జరిగేలా ఏర్పాటు చేయడం శుభ ఫలితాలనిస్తుంది.మన సంస్కృతి ఉత్కృష్టమైనది. మనకు ఈ ప్రకృతి.. అందులోని చరాచరాలన్ని పూజనీయాలే ! అంతేకాకుండా మనం కాలగణనకు ఉపయోగించే తిథులు , నక్షత్రాలు , వారాలు , మాసాలు అన్నీ ఎంతో గొప్పదనాన్ని , ప్రత్యేకతను సంతరించుకున్నటువంటివే. చాంద్రమానం పాటించే మనకు చైత్రం మొదలుకుని ఫాల్గుణం వరకు పన్నెండు నెలలు ఉన్నాయి. ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత , విశిష్టత ఉన్నాయి.కార్తీక మాఘమాసాల తర్వాత అంతటి మహత్యాన్ని స్వంతం చేసుకున్న పుణ్యప్రదమైన మాసం వైశాఖం. ఈ నెలలోనే పూర్ణిమ తిథినాడు విశాఖ నక్షత్రం ఉండడం వల్ల ఈ మాసానికి వైశాఖమాసం అనే పేరు ఏర్పడింది.ఆద్యాత్మికత , పవిత్రత , దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖమాసానికి ప్రత్యేక స్థానం ఉంది.ఇది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాకరమైన నెల. అందువల్లనే వైశాఖమాసానికి మాధవమాసం అని పేరు.అత్యంత పవిత్రమైన మాసంగా పేరు పొందిన వైశాఖమాస మాహత్మ్యంను పూర్వం శ్రీమహావిష్ణువు స్వయంగా శ్రీమహాలక్ష్మికి వివరించినట్టు పురాణాలు పేర్కొంటున్నాయి. అత్యంత పవిత్రమైన మాసంగా చెప్పబడుతూ ఉన్న వైశాఖమాసంలో ప్రతి దినమూ పుణ్యదినమే. అటువంటి ముప్పై పుణ్యదినాలు కలిగిన ఈ మాసంలో ఆచరించాల్సిన విధులు పురాణా గ్రంధాల్లో వివరించబడ్డాయి.ముఖ్యంగా స్నాన , పూజ , దానధర్మాల వంటి వాటిని ఈ నెలలో ఆచరించడం వల్ల మానవుడికి ఇహలోకంలో సౌఖ్యం , పరలోకంలో మోక్షం సిద్ధిస్తాయని పురాణ కథనం.వైశాఖమాసంలో నదీ స్నానం ఉత్తమమైనదిగా చెప్పబడింది. అందుకు అవకాశం లేని స్థితిలో గంగ , గోదావరి వంటి పుణ్యనదులను స్మరించుకుంటూ*
*కాలువల్లోగానీ , చెరువులోగాని , బావుల వద్దగానీ అదీ కుదరకపోతే ఇంట్లోనే స్నానం చేయాలి నీటియందు సకల దేవతలు కొలువుతీరి ఉంటారని పురాణాలు* *చెబుతున్నాయి.వైశాఖమాసంలో సూర్యుడు మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. కనుక ఎండలు అధికంగా ఉండి మానవులను ఇబ్బందులను గురిచేస్తూ ఉంటాయి.*
*కనుక వేడిమినుంచి ఉపసమనం కలిగించేవాటిని దానం ఇవ్వాలనేది శాస్త్రవచనం , నీరు , గొడుగు , విసనకర్ర , పాదరక్షలు వంటివి దానం చేయడం శ్రేష్టం. అట్లే దాహంతో ఉన్నవారికి మంచినీటిని ఇవ్వడం , చలివేంద్రాలను ఏర్పాటు చేయడం వల్ల దేవతానుగ్రహం కలుగుతుంది.*
*సంధ్యావందనాలు ఆచరించడంతో పాటు శ్రీమహావిష్ణువును తులసీదళాలతో పూజించవలెను. శ్రీమహావిష్ణువు వైశాఖమాసం మొదలుకొని మూడునెలలపాటూ ఈ భూమి మీద విహరిస్తూ ఉంటాడు.*
-------------------------------------
*అతనికి అత్యంత ప్రీతికరమైన తులసీదళములతో అర్చించడం వల్ల సంతుష్టుడై సకల సౌభాగ్యాలను, సౌఖ్యాన్ని ప్రసాదిస్తాడని చెప్పబడుతున్నది.*
---------------------------------------
*’వైశాఖే మాధవో, రాధో’*
---------------------------------------
*ఈ మాసంలో విష్ణుస్మరణతో, అభీష్ట దేవతారాధనతో నియమపాలన చేయడం ఇహ పర శ్రేయస్సునిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. వైశాఖమాసాన్ని మహిమాన్వితమైన దివ్యమాసంగా శాస్త్రాలు వర్ణించాయి. ఈ మాసాన ప్రాతః కాలాన లేచి మధుసూదనుని స్మరిస్తూ స్నానం చేయడం విశేష ఫలప్రదం.*
----------------------------------- *ప్రాతః సనియమ స్నాన్యే ప్రీయతాం మధుసూదనః!*
*అదే విధంలో*
---------------------------------------
*"మాధవే మేషగే భానౌ మురారే మధుసూదన*
*ప్రాతః స్నానేన మే నాథ ఫలదోభవ పాపహన్.*
----------------------------------------
*అనే ప్రార్థనతో తీర్థాదులలో చేసిన స్నానం దివ్యఫలాన్నిస్తుంది.*
---------------------------------------
*తులసీ కృష్ణ గౌరాభ్యాం తయాభ్యర్చ్య మధుద్విషమ్!*
*విశేషేణ తు వైశాఖే నరో నారాయణో భవేత్!!*
--------------------------------------
*మాధవం సకలం మాసం తులస్యాయోర్చయే న్నరః!*
*త్రిసంధ్యం మధుహంతారం తస్యనాస్తి పునర్భవః!!*
--------------------------------------
*వైశాఖమాసమంతా శ్రీ మహావిష్ణువును తులసీ దళాలతో అర్చించితే శ్రేష్ఠం.*
------------------------------------
*ప్రాతః స్నానానంతరం అధికజలంతో అశ్వత్థ (రావి) వృక్షపు మూలాన్ని తడిపి ప్రదక్షిణలు చేస్తే పూర్వీకులంతా తరిస్తారు.*
----------------------------------------
*ఈ మాసంలో ఒంటిపూట భోజనం లేదా నక్తం (పగలంతా ఉపవసించి రాత్రి ప్రారంభంలో భుజించడం) ఆచరించడం మంచిది.ఈ మాసంలో చలివేంద్రాలు, పళ్ళరసాలు, మజ్జిగ వంటి పానీయాల శాలలని నిర్వహించడం, విసనకర్రలు, గొడుగులు, పాదరక్షలు దానం చేయడం పుణ్యఫలాన్నిస్తుంది.* --------------------------------------- *వైశాఖ పురాణం ప్రారంభo* ---------------------------------------- *వైశాఖ పురాణము లోని అధ్యాయములు*
------------------------------------- *1 . వైశాఖమాస ప్రశంస*
*2 . వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు - వాటి ఫలితములు*
*3 . వివిధ దానములు - వాటి మహత్యములు*
*4 . వైశాఖ ధర్మ ప్రశoస*
*5 . వైశాఖమాస విశిష్టత౮
*6 . జలదాన మహత్యము - గృహగోధికా కథ*
*7 . వైశాకమాస దానములు*
*8 . పిశాచ మోక్షము*
*9 . సతీదేహ త్యాగము*
*10 . దక్షయజ్ఞనాశము కామదహనము*
*11 . రతి దుఃఖము - దేవతల ఊరడింపు*
*12 . కుమార జననము*
*13 . అశూన్య శయన వ్రతము*
*14 . ఛత్రదాన మహిమ*
*15 . వైశాకవ్రత మహిమ*
*16 . యముని పరాజయము*
*17 . యమదుఃఖ నిరూపణము*
*18 . విష్ణువు యముని ఊరడించుట*
*19 . పిశాచత్వ విముక్తి*
*20 . పాంచాలరాజు రాజ్యప్రాప్తి*
*21. పాంచాలరాజు సాయుజ్యము*
*22 . దంతిల కోహల శాపవిముక్తి*
*23 . కిరాతుని పూరజన్మ*
*24 . వాయుశాపము*
*25 . భాగవత ధర్మములు*
*26 . వాల్మీకి జన్మ*
*27 . కలిధర్మములు - పితృముక్తి*
*28 . అక్షయతృతీయ విశిష్టత*
*29 . శునీ మోక్షప్రాప్తి*
*30 . పుష్కరిణి - ఫలశ్రుతి--------------------------------------- *వైశాఖ పురాణం - 1 వ అధ్యాయము*
----------------------------------------
*వైశాఖమాస ప్రశంస:*
----------------------------------------
*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*
*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*
--------------------------------------
*సూతమహర్షి శౌనకాది మహర్షులనుద్దేశించి యిట్లు పలికెను. మహర్షులారా! వినుడు రాజర్షియగు అంబరీషుడు బ్రహ్మ మానసపుత్రుడగు నారదుని జూచి నమస్కరించి మహర్షీ! మీరు అన్ని మాసముల మహత్త్వమును వివరించిరి. అన్ని మాసముల యందును వైశాఖ మాసము మిక్కిలి యుత్తమమైనది. శ్రీమహావిష్ణువునకు మిక్కిలి ప్రీతి పాత్రమైనదని చెప్పినారు. వైశాఖమాసము శ్రీమహావిష్ణువునకు యిష్టమగుటకు కారణమేమి? ఈ మాసమునందు విష్ణుప్రియములైన ధర్మములేవి? మానవు లాచరింవలసిన దానములను, వాని ఫలములను వివరింపగోరుచున్నాను. పూజ, దానము మున్నగు వానిని యే దైవము నుద్దేశించి చేయవలయును? వాని ఫలమెట్టిది? పూజాద్రవ్యములెట్టివి? మున్నగు విషయములను దయయుంచి వివరింపగోరుచున్నానని సవినయముగ ప్రశ్నించెను.*
----------------------------------------
*నారదుడనేను రాజర్షీ! అంబరీషా! వినుమని యిట్లు పలికెను. పూర్వమొకప్పుడు నేను బ్రహ్మను మాసముల మహిమను మాస ధర్మములను వివరింపగోరితిని. బ్రహ్మయు 'నారదా! శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి మాసధర్మములను చెప్పుచుండగ వింటిని. నీకిప్పుడు శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవికి చెప్పిన విషయమునే చెప్పుదును. మాసములన్నిటిలోను కార్తికము, మాఘము, వైశాఖము ఉత్తమములు. ఆ మూడు మాసములలో వైశాఖమాసము మిక్కిలి ఉత్తమము. వైశాఖము ప్రాణులకు తల్లివలె సదా సర్వాభీష్టములను కలిగించును. ఈ మాసమందాచరించిన స్నానము, పూజ, దానము మున్నగునవి పాపములన్నిటిని నశింపజేయును. ఈ మాసమున చేసిన స్నాన, పూజా, జప, దానాదులను దేవతలు సైతము తలవంచి గౌరవింతురు. విద్యలలో వేదవిద్యవలె, మంత్రములలో ఓంకారమువలె, వృక్షములలో దివ్యవృక్షమైన కల్పవృక్షము వలె, ధేనువులలో కామధేనువువలె, సర్వసర్పములలో శేషునివలె, పక్షులలో గరుత్మంతునివలె, దేవతలలో శ్రీమహావిష్ణువువలె, చతుర్వర్ణములలో బ్రాహ్మణునివలె యిష్టమైన వానిలో ప్రాణమువలె, సౌహార్దములు కలవారిలో భార్యవలె, నదులలో గంగానది వలె, కాంతి కలవారిలో సూర్యుని వలె, ఆయుధములలో చక్రమువలె, ధాతువులలో సువర్ణమువలె, విష్ణుభక్తులలో రుద్రునివలె, రత్నములలో కౌస్తుభమువలె, ధర్మహేతువులగు మాసములలో వైశాఖమాసముత్తమమైనది*
--------------------------------------
*విష్ణుప్రియమగుటచేతనే వైశాఖమాసమును మాధవమాసమనియునందురు. విష్ణుప్రీతిని కలిగించు మాసములలో వైశాఖమాసమునకు సాటియైనదిలేదు. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమున సూర్యోదయమునకు ముందుగ నదీ తటాకాదులలో స్నానమాచరించినచో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో గలసి అతిప్రీతితో వానినుద్దరింపనెంచును. ప్రాణులు అన్నమును తిని సంతోషమునందినట్లు శ్రీమహావిష్ణువు వైశాఖ స్నానమాచరించిన వారి విషయమున సంప్రీతుడగుచున్నాడు. అట్లు వైశాఖ స్నానమాచరించినవారికి అన్ని వరముల నీయ సిద్దమై యున్నాడు. వైశాఖమాసమున ఒకసారి మాత్రమే స్నానమును, పూజను చేసినను, పాప విముక్తుడై విష్ణులోకమును చేరుచున్నాడు. వైశాఖమున వారమునాళ్లు స్నానాదికమును చేసినను ఈ మాత్రమునకే శ్రీహరియనుగ్రహ బలమున, కొన్నివేల అశ్వమేధయాగములను చేసినచో వచ్చునంతటి పుణ్యమునందును. స్నానము చేయు శక్తి లేక, స్నాన సంకల్పము దృఢముగనున్నచో నతడు నూరు అశ్వమేధయాగములు చేసినంత పుణ్యము నందును. సూర్యుడు మేషరాశిలోనుండగా వైశాఖస్నానము నది/ఏరులో చేయవలెనని సంకల్పించిన వాడై అశక్తుడై యున్నను, కొంతదూరమైనను యింటి నుండి ప్రయాణమైన వాడు వైశాఖమున నదీ స్నాన సంకల్పము దృఢముగనున్నచో విష్ణు సాయుజ్యము నందును.*
-------------------------------------
*అంబరీష మహారాజా! సర్వలోకములయందున్న తీర్థ దేవతలు బాహ్యప్రదేశముననున్న జలము నదియైనను, తటాకమైనను, సెలయేరైనను, అందుచేరియుండును. జీవి చేసిన సర్వపాపములను, జీవి అట్టిజలమున పవిత్ర స్నానమాచరించు వరకును, యముని యాజ్ఞననుసరించి జీవి సూక్ష్మ శరీరముననుసరించి రొద చేయుచుండును. జీవి వైశాఖమున అట్టి బాహ్యప్రదేశమున నున్న జలమున స్నానమాచరింపగనే ఆ జలమునధిష్టించి యున్న సర్వతీర్థ దేవతల శక్తి వలన ఆ జీవి చేసిన సర్వపాపములు హరించును. సర్వతీర్థదేవతలు సూర్యోదయమును మొదలుకొని ఆరు ఘడియల వరకు బాహ్య ప్రదేశమునందున్న ఆ నదీ జలమునాశ్రయించి యుండును. ఆ జలమున తామున్న సమయమున స్నానమాచరించిన వారికి హితమును కలిగింతురు. చేయనివారిని శాపాదులచే నశింపచేయుదురు. వారు శ్రీ మహావిష్ణువు ఆజ్ఞననుసరించి యిట్లు చేయుదురు. సూర్యోదయమైన ఆరు ఘడియల తరువాత తీర్థ దేవతలు తమ తమ స్థానములకు పోవుదురు. మరల సూర్యోదయమునకు ముందుగా బాహ్య ప్రదేశమందున్న జలము నావహించి స్నానమాడిన వారి పాపముల నశింప జేయుచుందురు.
*వైశాఖ పురాణం ఒకటవ అధ్యాయము సంపూర్ణము*
Tuesday, April 29, 2025
"కొత్తది కష్టం, గమ్యం మాత్రం అద్భుతం
ఒక్క దానిపైన దృష్టి – రిజల్ట్ గ్యారంటీ!
Monday, April 28, 2025
అలవాట్లు మారాలంటే పరిసరాలు మార్చు!
Saturday, April 26, 2025
"మనసు చెప్పిన మార్గం"
Thursday, April 24, 2025
"సారీ అన్నాను కదా!"
Sunday, April 20, 2025
సుభాషితం
Wednesday, April 16, 2025
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
ఓం శ్రీ మాత్రే నమః
నామ విశేషాలు :....!🙏!*
🌿మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది.
🌸1. ఊరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో వుండేతల్లి "పొలిమేరమ్మ" క్రమముగా "పోలేరమ్మ" అయింది.
🌿2. 'ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము. అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
🌸3. ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోషించే తల్లి 'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు రాకుండా నివారించేదైతే, 'పోచమ్మ' పోషణ కలిగిస్తుంది.
🌿4. ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల (ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేయ+అమ్మ=కట్టమేసేయమ్మ - కాలక్రమములో "కట్టమైసమ్మ" అయింది.
🌸5. స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో అచ్చ (స్వచ్ఛమని) సు+అచ్చ=స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి "అచ్చమ్మ" గా అయ్యింది.
🌿6. సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది. 'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో ఆమెను "మావూళ్ళమ్మ" అని పిలుస్తూంటే క్రమముగా అది "మావుళ్ళమ్మ" అయింది.
🌸7. ప్రజల మనసులో పుట్టి ఏ కోర్కె ఏదైనా అది మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరంచి భక్తులకు అండగా నిలిచే తల్లి "తలుపులమ్మ". 'తలపు' అంటే ఆలోచన. ఆ తలపులను తీర్చే తల్లి "తలపులమ్మ" క్రమముగా ఈమె "తలుపులమ్మ" గా మారింది. ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
🌿8. శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) కారణముగా "అంకగళమ్మ", "అంకాళమ్మ" గా మారిపోయింది.
🌸9. పొలిమేరలో వుండే మరొక తల్లి "శీతలాంబ". ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి. తన గ్రామములోని ప్రజలకు వ్యాదులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత పిచాచ గణాలను గ్రామములోనికి రాకుండా వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈదేవతే.
🌿10. పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి "పుట్టమ్మ". ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో పాలు పోస్తారు.
🌸ఈ తల్లికే "నాగేశ్వరమ్మ" అని కూడా అంటారు. పాప (అంటే పాము)+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి "పాపమ్మ" అని కూడా అంటారు. సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే "సుబ్బ+అమ్మ= "సుబ్బమ్మ" కూడా దైవముగా ఉంది.
🌿11. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటలనూ ఇచ్చే తల్లి "బతుకమ్మ".
🌸12. గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ "కన్నమ్మ"గా ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= "సత్తెమ్మ".
🌿13. అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ "పుల్లమ్మ". ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
🌸14. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే చోటవున్న తల్లి అర్పణ+అమ్మ = "అర్పణలమ్మ" క్రమముగా "అప్పలమ్మ" అయినది.
🌿15. బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ= "అప్పలమ్మ" అన్నారు.
🌸16. అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ అయినదీ పెంటి (బాల)+అమ్మ= "పెంటమ్మ".
🌿17. భోజనాన్ని అందించగల తల్లి అనే అర్థములో బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ= "బోనాలమ్మ".
🌸18. అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి ఈమెను "అయ్యమ్మ" ని కొన్ని చోట్ల పిలుస్తారు.
🌿19. లలితాంబ భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది కాబట్టి గుర్రాల+అమ్మ= "గుర్రాలమ్మ" అయినది.
🌸20. ఊరు పేరుని బట్టి పిల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోలు+అంబ="సోమపోలమాంబ" అన్నారు. సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట.
🌿21. సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైనదని అప్పటినుంచి కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుందని ప్రసిద్ధికెక్కిన తల్లి
🌸తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న "పళ్ళాలమ్మ" "పళ్లమాంబిక". ఇక్కడ వెలసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికా దేవి అవతారంగా భావించి పూజిస్తారు.
🌿 ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకుని భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండటం విశేషం. ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాలలో ఈ అమ్మవారి విగ్రహం ఉండడం విశేషం... 🙏🏻
Source:Whatsapp
Tuesday, April 15, 2025
ఒక్కసారి రెట్రో వాకింగ్ ట్రై చేయండి.. బరువుతగ్గుతారు!
బరువు తగ్గేందుకు వాకింగ్ బెస్ట్ ఆప్షన్. అయితే, మీరు ఎప్పుడైనా రెట్రో వాకింగ్ గురించి విన్నారా? ఈ రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
చాలా మంది బరువు తగ్గడానికి వాకింగ్ ట్రై చేస్తున్నారు. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేకపోతున్నారా? ఒక్కసారి రెట్రో వాకింగ్ ట్రై చేయండి, రోజూ పది నిమిషాలు చాలు
ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, బరువు తగ్గడానికి చాలా మంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే.. మరికొందరు జిమ్లు చుట్టూ తిరుగుతున్నారు. అయితే, చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు.
అయితే బరువు తగ్గేందుకు వాకింగ్ బెస్ట్ ఆప్షన్. అయితే, మీరు ఎప్పుడైనా రెట్రో వాకింగ్ గురించి విన్నారా? ఈ రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చాలా మంది బరువు తగ్గడానికి రెట్రో వాకింగ్ ట్రై చేస్తున్నారు. రోజూ కనీసం 10 నిమిషాల పాటు రెట్రో వాకింగ్ చేస్తే బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అసలు ఇంతకీ రెట్రో వాకింగ్ అంటే అంటి? రోజూ ఇది ట్రై చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రెట్రో వాకింగ్ అంటే ఏంటి?
రెట్రో వాకింగ్ అనేది ఒక వ్యాయామం. సాధారణంగా మనం వాకింగ్ చేసేటప్పుడు ముందుకు నడుస్తుంటాం. అదే రెట్రో వాకింగ్లో వెనుకకు నడుస్తుంటాం. అంటే వెనుకకి నడవడాన్నే రెట్రో వాకింగ్ అంటారు. ఇది కండరాలు, మనస్సు, శరీర అనుసంధానికి చాలా మంచి ఆప్షన్. ఇందులో మీరు నిటారుగా నిలబడి వెనుకకు నడవాలి. కేవలం 10 నుంచి 20 నిమిషాల రెట్రో వాకింగ్ ద్వారా లెక్కలేనన్ని ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రెట్రో వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓ లుక్కేద్దాం.
శరీరం, మెదడు అనుసంధానం
మనం ప్రతిరోజూ నడుస్తాం. దాదాపు అందరూ ముందుకు నడుస్తుంటారు. కాళ్ళు, కండరాలు, మెదడు దానికి అలవాటు పడ్డాయి. ఇలా చేస్తున్నప్పుడు, మన మెదడు పూర్తిగా పనిచేయదు. కానీ మనకు స్వల్ప సంకేతం అందిన వెంటనే కండరాల జ్ఞాపకశక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా మనసుకు శరీరానికి మధ్య ఉన్న సంబంధం సడలింది. మనం అలవాటు లేని తప్పు దిశలో నడిచినప్పుడు, మెదడు కండరాలకు సరైన సంకేతాలను ఇవ్వాలి. దీంతో శరీరానికి, మెదడుకి అనుసంధానం పెరిగింది. అంటే మీకు చాలా కాన్స్ట్రేషన్ పెరుగుతుంది.
ఆస్టియో ఆర్థరైటిస్ నుంచి ఉపశమనం
వయసు పెరిగే కొద్దీ కీళ్ల ఆరోగ్యం బలహీనపడుతుంది. దీనిని ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారిలో కీళ్ల లోపల దృఢత్వం, వాపు ఉంటుంది. దీని వలన నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు నొప్పి వస్తుంది. ఒక పరిశోధన (ref.) ప్రకారం , రెట్రో వాకింగ్ ఈ సమస్య ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్. రెట్రో వాకింగ్ చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
బరువు తగ్గడానికి బెస్ట్ ఆప్షన్
బరువు తగ్గడానికి వాకింగ్ మంచి ఆప్షన్ అని మనకు తెలుసు. అయితే, వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం చాలా ఆలస్యం అవుతుంది. సాధారణ నడక కంటే వెనుకకు నడవడానికి ఎక్కువ శ్రమ అవసరం. దీని కారణంగా, బర్న్ చేసే కేలరీల పరిమాణం కూడా పెరుగుతుంది. బరువు తగ్గడానికి ఇది సాధారణ నడక కంటే మంచిది. బరువు తగ్గే ఫలితాల్ని త్వరగా చూపుతుంది. అందుకే బరువు తగ్గడానికి రెట్రో వాకింగ్ ట్రై చేస్తే మంచిదంటున్నారు నిపుణులు.
మానసిక ప్రశాంతత
రెట్రో వాకింగ్ శరీర అవగాహనను పెంచుతుంది. నిద్ర చక్రం మెరుగుపడుతుంది. మీ ఆలోచించే, నేర్చుకునే, గుర్తుంచుకోగల సామర్థ్యం పెరుగుతుంది. మీరు ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతుంటే ఖచ్చితంగా దీన్ని ప్రయత్నించండి. రెట్రో వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుందని నిపుణులు అంటున్నారు. మీరు రెట్రో వాకింగ్ నేర్చుకున్న తర్వాత, దానికి కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఫలితాలను పెంచుకోవడానికి, ప్రతిరోజూ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. క్రమంగా వేగంగా వెనుకకు నడవడానికి ప్రయత్నించండి. ఆ తరువాత వెనుకకు జాగింగ్ చేయండి.
కండరాలు బలంగా
బ్యాక్వర్డ్ వాకింగ్ అనేది శరీరంలోని కండరాలు, హామ్ స్ట్రింగ్స్, గ్లూట్స్ వంటివి నిమగ్నం చేసే ఒక చర్య. ఇవి సాధారణ నడకలో తరచుగా నిర్లక్ష్యం చేయబడతాయి. రెట్రో వాకింగ్ కండరాలన్నింటినీ బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రెగ్యులర్గా రెట్రో వాకింగ్ చేయడం వల్ల కండరాలు బలంగా మారతాయి.
అపార్టుమెంట్ల ఫ్లోర్ స్పేసుని ఎలా కొలుస్తారు? వారు చెప్పేంత ఫ్లోర్ స్పేసు వాటి లోపల ఉన్నట్లు కనిపింౘదు. కనీసం 25% తేడా ఉన్నట్లు తోస్తుంది. ఎందుకలా?
అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లలోని ఫ్లాట్ ఏరియా వర్ణనకి సంబంధించి 4 terms వాడుకలో వున్నాయి.
- Capet area: ఇది flat లోపలి అన్ని గదుల నేల (floor) వైశాల్యాల మొత్తాన్ని సూచించే అంకె. హాల్, బెడ్ రూమ్స్, కిచెన్, బాత్ రూమ్స్ , స్టోర్ రూమ్స్, బాల్కనీలు మొదలైన వాటన్నిటి floor వైశాల్యాలు కూడితే వచ్చే అంకె ఇది. ఇది మీ ఫ్లాట్ లో మీరు వాస్తవంగా వాడుకోగలిగిన exclusive స్థలం. మన తెలుగు రాష్ట్రాలలో, బిల్డర్లు సాధారణంగా ఈ figure ని చెప్పరు. మహారాష్ట్రలో మాత్రం, ప్రస్తుత చట్టం ప్రకారం ఈ figure ని తప్పనిసరిగా బ్రోచర్ లో ప్రకటించాలి. అంతేగాక flat అమ్మకం, Rate in Rs / sq ft of carpet area ప్రతిపదన మీదే జరగాలి.
- Built up area (కట్టుబడి వైశాల్యం): కార్పెట్ ఏరియాకి, ఫ్లాట్ బౌండరీ గోడల, లోపలి గోడల & స్తంభాల foot prints వైశాల్యాలు కలిపితే వచ్చే ఏరియా. దీన్నికూడా సాధారణం గా బిల్డర్ చెప్పడు. ఇది గోడలతో సహా మీ ఫ్లాట్ యొక్క total foot print (ఆక్రమించిన స్థలం). ఫ్లాట్ లోపలి గోడల సంఖ్య మీద ఆధారపడుంటుంది. Carpet area + (6 to 10) % ఉండచ్చు.
- Super built up area: టవర్ లోని common areas ( వరాండా, staircase, లిఫ్ట్ lobby మొ,,) వైశాల్యాలలో కొంత భాగాన్ని ఫ్లాట్ల ఏరియాల నిష్పత్తి లో మీ ఫ్లాట్ built up ఏరియా కి కలిపితే వచ్చే సంఖ్య. బిల్డర్ సాధారణం చెప్పే సంఖ్య ఇది. ఇది carpet area + (20 to 30) % దాకా ఉంటుంది.
4) undivided land share: అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కట్టిన భూమి వైశాల్యాన్ని, ఫ్లాట్ area నిష్పత్తిలో, మీ flat కి కేటాయించిన భూమి. ఈ figure ఎక్కువుండడం, బిల్డింగ్ చుట్టూ వున్న గ్రీనరీ, క్రీడా సౌకర్యాలు ఎక్కువుండడానికి index. ఇది నిర్దిష్ట (specified) హద్దులు లేని భూవాటా. అపార్మెంట్స్ పాతబడిన తర్వాత, re-development కి ఇచ్చేటప్పుడు, కొత్త వాటిలో మీకొచ్చే వాటాని సూచిస్తుంది.
స్వయంపాకం అంటే ఏమిటి? అది ఎవరికి ఇవ్వాలి?
*స్వంతంగా వండుకొని, తినడానికి కావలసిన సామగ్రిని ఇవ్వడమే స్వయంపాకం.*
*అందులో బియ్యం, కూరగాయలు, పప్పులు, ఉప్పులు, చింతపండు, బెల్లం, నెయ్యి, నూనె మొదలైనవి ఇవ్వాలి.*
*విశిష్ట మాసాలలో, పర్వదినాలలో, అమావాస్య నాడు, సంక్రమణ సమయంలో, ఏకాదశి తెల్లవారి ద్వాదశి నాడు, తల్లిదండ్రుల తిథినాడు, గ్రహణం రోజు ఈ వస్తువులను కనీసం ఒక్కపూట వంటకు సరిపడేలా సమకూర్చి ఒక అరటి ఆకు లేదా విస్తరిలో పెట్టి పురోహితునికి దానం చేయాలి.*
*తిథి రోజు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని వారు బ్రాహ్మణునికి ఈ స్వయంపాకం దానం, దక్షిణ తాంబూలాదులతో సమర్పించాలి. తోటకూర, గుమ్మడిపండు యథాశక్తి ఇవ్వవచ్చు.*
*మన ఇంట్లో భోజనం చేయని సంప్రదాయ కుటుంబాలకు చెందిన వారికి ఈ విధమైన స్వయంపాక దానం ఇస్తారు. నిత్యాగ్ని హోత్రులైన కొందరు స్వయంగా వండుకొని, భగవంతునికి నైవేద్యం సమర్పించి, తదనంతరం భోజనం చేస్తారు.*
ముద్దు ఎక్కడ పుట్టింది..4500 ఏళ్ల క్రితమే లిప్-లాక్ ట్రెండ్!
ప్రేమించే ప్రతి ఒక్కరూ తమ భాగస్వామిని తప్పకుండా ముద్దు పెట్టుకుంటారు. అయితే ప్రపంచంలో మొదటి ముద్దు ఎవరు పెట్టారో ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమికులు ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం వల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది.ప్రేమ కూడా పెరుగుతుంది.
మొదటిసారి ముద్దు ఎవరు పెట్టారు. అది ఎప్పుడు ప్రారంభమైందో చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. దాని గురించి తెలుసుకుందాం.
శృం*గారభరితమైన ముద్దు పాటలు, కవితలు, కథల్లో చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. కళ, సినిమాల్లో కూడా దీనిని చూపిస్తారు. అయితే మొదటిసారి ముద్దు ఎప్పుడు, ఎవరు పెట్టారో ఖచ్చితమైన సమాచారం లేదు. పత్రాల ప్రకారం ముద్దు చరిత్ర 1000 సంవత్సరాల క్రితం నాటిది, అయితే పరిశోధకుల ప్రకారం ప్రాచీన మధ్యప్రాచ్యంలో 4500 సంవత్సరాల క్రితమే పెదవుల ముద్దు సాధారణంగా ఉండేదని చెబుతున్నారు.
మొదటి ముద్దు గురించి వేర్వేరు వాదనలు ఉన్నాయి. కోపెన్హాగన్ విశ్వవిద్యాలయం, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రకారం దీని ప్రారంభం చాలా కాలం క్రితం మెసొపొటేమియాలో జరిగింది. మెసొపొటేమియా నుండి లభించిన వేలాది మట్టి పలకలు నేటికీ ఉన్నాయి. వీటిలో ముద్దు ప్రస్తావనతో ప్రాచీన ప్రపంచంలో శృంగారభరితమైన సాన్నిహిత్యం చూపబడింది.
శాస్త్రవేత్తలు ముద్దు సంబంధాన్ని మెసొపొటేమియాతో ముడిపెట్టి ఉండవచ్చు. అయితే భారతదేశంలో 3500 సంవత్సరాల నాటి చేతివ్రాతల ప్రకారం పెదవుల ముద్దు ప్రారంభం ప్రాచీన మధ్యప్రాచ్యం, భారతదేశంలో జరిగింది. భారతదేశంలో పూర్వం భాగస్వామికి ప్రపోజ్ చేయడానికి ముద్దు ఉపయోగించేవారని వీటి ద్వారా తెలుస్తుంది. తరువాత దీనిని ఆచారాలతో ముడిపెట్టారు. అయితే మెసొపొటేమియాలో లభించిన ఆధారాలు ఈ విషయాన్ని సమర్థించవు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ముద్దు పుట్టిందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇది మొదట ఎక్కడ ప్రారంభమైందో ఖచ్చితంగా చెప్పడం కష్టం.
డ్రమ్లు నీలం రంగుల్లో ఎందుకు ఉంటాయి? ఈ రంగు ప్రత్యేకత ఏమిటి?
భారతదేశంలో ప్లాస్టిక్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అలాగే దాని డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. నీలం రంగు ప్లాస్టిక్ డ్రమ్ములను వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తారు.
అటువంటి పరిస్థితిలో ఈ డ్రమ్ములను ఎలా తయారు చేస్తారు? వాటిలో ఎలాంటి రసాయనాలు ఉపయోగిస్తారు? వీటిని ఏ కంపెనీలు తయారు చేస్తాయి? వాటి ధర ఎంత? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఈ డ్రమ్ దేనితో తయారు చేస్తారు?
ITP ప్యాకేజింగ్ ప్రకారం.. ఈ డ్రమ్ములను HDPE (హై-డెన్సిటీ పాలిథిలిన్) అనే ప్రత్యేక ప్లాస్టిక్తో తయారు చేస్తారు. HDPE అనేది బలమైన, మన్నికైన, రసాయనికంగా స్థిరమైన ప్లాస్టిక్. ఇది చాలా పదార్థాలతో చర్య జరపదు. ఇది ఆహారం, మందులు, రసాయనాలు, ప్రమాదకరమైన వ్యర్థాలను నిల్వ చేయడానికి అనువైనదిగా చేస్తుంది. HDPE డ్రమ్స్ ప్రత్యేక అచ్చు యంత్రాల సహాయంతో తయారు చేస్తారు. దీనితో వాటిని ఏకరీతి, గుండ్రని ఆకారాలలో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చు. ఈ ప్రక్రియ వల్ల వాటి ఖర్చు కూడా తగ్గుతుంది.
రంగు ఎప్పుడూ నీలం రంగులోనే ఎందుకు ఉంటుంది?
ఈ డ్రమ్స్ రంగు నీలం రంగులో ఉంటుంది. ఎందుకంటే ఈ రంగు ఇతర రంగుల కంటే సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాల ప్రభావాల నుండి బాగా రక్షిస్తుంది. నీలం రంగు ఆహార పదార్థాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఈ డ్రమ్స్ దీర్ఘకాలం మన్నిక కలిగి ఉంటాయి. ఈ డ్రమ్లో పర్యావరణానికి తక్కువ హానికరం కలిగిస్తాయి.
ఇది ఎక్కడ ఉపయోగించబడుతుంది?
ఈ డ్రమ్ములను ఎక్కువగా కర్మాగారాలు, గిడ్డంగులు, రసాయన కర్మాగారాలు, ఫార్మా కంపెనీలలో ఉపయోగిస్తారు. వీటిని ద్రవాలు, నూనెలు, రసాయనాలు, ఆహార పదార్థాలు, వ్యర్థాల కోసం ఉపయోగిస్తారు. కొన్ని డ్రమ్లు మూతలు, నాజిల్లు, లైనర్లు వంటి అటాచ్మెంట్లతో కూడా వస్తాయి. వాటిని ఉపయోగించడం మరింత సులభతరం చేస్తుంది.
ధర ఎంత?
భారతదేశంలోని చాలా కంపెనీలు ఇటువంటి డ్రమ్లను తయారు చేస్తాయి. కానీ వాటి తయారీదారులలో ఎక్కువ మంది MSME వర్గంలోకి వస్తారు. అందుకే ధరలు, నాణ్యత కంపెనీ నుండి కంపెనీకి మారవచ్చు. ఉదాహరణకు.. పిరమిడ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ అనే కంపెనీ 50 లీటర్ల సామర్థ్యం గల నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్లను పెద్ద పరిమాణంలో తయారు చేస్తుంది. వాటి ధర డ్రమ్ముకు దాదాపు రూ.250. కానీ కనీసం 100 డ్రమ్స్ ఆర్డర్ చేయాలి. అదే సమయంలో 200 నుండి 250 లీటర్ల సామర్థ్యం కలిగిన నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ములు IndiaMART వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి ధర డ్రమ్ముకు దాదాపు రూ.600.
బీజాక్షరాలు ఎన్ని? వాటి ఆంతర్యం ఏమిటి?
- శరీరమునందు నాదం, అక్షరాలు ఉన్నవని యోగమతము. కనుక ఈ బీజోపాసన వలన ఆయా శరీరావయవములందు మంత్రోద్దారము చేయవచ్చును. ఆయా మంత్రస్థానములను చైతన్యభరితం చేయవచ్చును.
- కవులు తమ తమతమ ఇష్టదేవతామంత్రాలను ముద్రాలంకారంగా బంధించేందుకు ఈ బీజాక్షరాలను వాడతారు.
- మంత్రాకారాలను వీజరూపాలను మంత్రవేత్తలు మామూలు భాషలో ప్రత్యక్షముగాచెప్పరు. మంత్ర దేవతలు పరోక్ష ప్రియలు కనుక మంత్రము లున్న స్వమాతృజార తుల్యముగా గోప్యములు.
- తాంత్రికమయిన బీజాక్షర మంత్రములలో అర్థం తెలియని శ్రీం, అం, శం లాంటి వర్ణములే ఉందును. దానిమ్మపండులో గింజలవలె ఉండే ఈ అక్షర రత్నాలు పరస్పరం బంధం లేనట్లు వెలుగుచుండును. అట్లని నిరర్ధ్థకములు అనరాదు. నిరర్థక్షమయిన మంత్రములు ఏ దేవతలను తృప్తి పజిచును? మంత్రం అంటే ఒక స్తుతి. ఒక ప్రార్థన. అర్థమున్నపుడు ఆ “గుణం” సాధ్యం అవుతుంది. కనుక బీజాక్షర మంత్రాలకు అర్థాలు తప్పనిసరి. వాక్యానికి అర్థం ఉన్నపుడు వాక్యగతమయిన పదాలకు గూడా ఆ అర్థభాగాలు పంచాలి. అలాగే మంత్రం మొత్తం మహావాక్యం అయితే మంత్రగత బీజాలకు అర్థం తప్పక ఉండాలి. కనుక వీజాక్షరాలకు అర్థం తప్పదు.
ఈ క్రింది పట్టికలో వివిధ బీజాక్షరాల అర్థాలను గమనించవచ్చును.
పైన చూపిన బీజాక్షర అర్థములకు ఆధారమైన ప్రమాణ గ్రంథములు :
1) శ్రీ తంత్రాభిధానం
2) మంత్రాభిధానం - 1
3) మంత్రాభిధానం - 2
4) ఏకాక్షర కోశము - (పురుషోత్తమదేవరచితం)
5) భూత యక్ష డామర తంత్రాంతర్గత బీజనిఘంటువు
6) మాతృకా నిఘంటువు - 1 (మహీదాసవిరచితం)
7) మాతృకా నిఘంటువు - 2 (మధ్వాచార్యరచితం)
8) మాతృకా నిఘంటువు - 3
9) వర్ణ నిఘంటువు - రుద్రయామలతంత్రం
10) బీజాభిధానం - భూతడామరతంత్రం
11) మంత్రార్థాభిధానం - వరదాతంత్రం
12) ముద్రానిఘంటువు - వామకేశ్వర తంత్రం
13) బీజాక్షర నిఘంటువు