గౌతమఋషిని చూడగానే ఆమెకు జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమంతయు జ్ఞప్తికి వచ్చినది.
అంత గౌతమముని 'అమ్మాయీ! నీ వెవ్వరిదానవు? నీ నామధాయమేమి? నీ వృత్తాంతము యేమి?' అని ప్రశ్నించెను.
ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియ జేయుటకై యిట్లు చెప్పదొడంగెను
మునిశ్రేష్ఠా! నా వృత్తాంతమును తెలియజేయుదును గాన ఆల్కింపుము.
నా జన్మస్థానము గోదావరి నది సమీపమందున్న ఒక కుగ్రామము, నా తండ్రి పేరు హరిశర్మ, నా పేరు మంజుల. నన్ను నా తండ్రి కావేరితీరవాసియగు జ్ఞానానందుడను వానికిచ్చి పెండ్లి చేసెను.
అతడు దైవభక్తుడు, జ్ఞాని, నిగర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురమునకు వెళ్ళినాను. మరి కొన్నాళ్ళకు మాఘమాసము ప్రవేశించినది.
ఒకనాడు నా భర్త "సఖీ! మాఘమాసము ప్రవేశించినది, యీనెల చాల పవిత్రమైనది, దీని మహత్తు చాలా విలువైనది. నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరమూ మాఘ స్నానములు చేయుచున్నాను.
నీవు నా భార్యవు కావున నీవును యీ మాఘమాసమంతయు యీ కావేరీ నదిలో స్నానమాచరింపుము. ప్రతిదినము ప్రాతఃకాలమున నిద్రలేచి, కాలకృత్యములు తీర్చుకొను సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును.
సూర్యుడు ఉదయించిన వెంటనే నదికిపోయి నదిలో స్నానము చేయుదము. ప్రభత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటమును పెట్టి పువ్వులతోను, మంచి గంధము, అగరు, ధూప దీపములతోను పూజించి స్వామికి ఖండచెక్కర, పటిబెల్లం నైవేద్యమిచ్చి నమస్కరింతము, తరువాత తులసితీర్థము లోనికి పుచ్చుకొందుము.
మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠింతము. దీని వలన మనకు చాలా ఫలము కలుగును. నీ అయిదవతనము చల్లగా వుండును" అని హితబోధ జేసెను.
నేను అతని మాటలు వినిపించుకోక రుసరుసలాడి, అతనిని నీచముగా జూచితిని, నా భర్త చాలా శాంతస్వరూపుడు. అయిననూ నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపము వచ్చి "ఓసీ మూర్ఖురాలా! నా యింటికి వచ్చి నా వంశమును ఉద్ధరిస్తావనుకున్నాను.
ఇంత దైవద్వేషిణివని నాకు తెలియదు. నీవిక నాతో ఉండదగవు. మాఘమాస వ్రతము నీకింత నీచముగా కనిపించినదా, అదియే నీ పాపమునకు నిన్ను శిక్షించును గాని, మగని మాటకు మారాడిన ఫలితముగా కృష్ణానదీతీరమందున్న రావిచెట్టు తొర్రలో మండూకమువై పడిఉందువుగాక" అని నన్ను శపించెను.
"అమ్మాయీ! భయపడకుము, నీకీశాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది. ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి జీవించినావు. నీ భర్తయును యేకాంతముగా చాలకాలము జీవించి హరినామ సంకీర్తనలు చేయుచు మృతుడయ్యెను.
అతడిప్పుడు వైకుంఠములోనున్నాడు. నీవు నీ పతిమాటలు విననందున యెంత కష్టపడినావో తెలిసినదికదా! మాఘమాస ప్రభావము అసామాన్యమైనది. సకల సౌభాగ్యములు, పుత్రసంతతి, ఆరోగ్యము కలుగుటయేగాక మోక్షసాధనము కూడ నీకీ మాఘమాస వ్రతము మించిన మరి యొక వ్రతము లేదు.
విష్ణుమూర్తికి ప్రీతియైనది వ్రతము నీ భర్త దూరదృష్టి కలజ్ఞాని, అతని గుణగణాలకు అందరూ సంతసించెడి వారు నిన్ను పెండ్లి యాడిన తరువాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయుననెడి ఆశతో నుండెడివాడు.
కానీ, నీ వలన అతని ఆశలన్నీ నిరాశలయిపోయినవి. నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చెను. నిన్ను నీళ్ళలో స్నానము చేయమన్నాడు, నీవు చేయనన్నావు. అందువలన నీకు నీరు దొరకకుండా చెట్టుతొర్రలో జీవించుమని శపించాడు.
ఈ దినమున దైవ నిర్ణయముచే నీవు నా సమక్షములో పడినందున నీ భర్త శాపము ప్రకారము మరల నీ నిజరూపమును పొందగలిగినావు అందునా యిది మాఘమాసము కృష్ణానదీ తీరము కాన మాఘమాస వ్రత సమయము నీకన్ని విధములా అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివైరమ్ము.
స్త్రీలుకాని, పురుషులుకాని యీ సమయములో ప్రాతఃకాలమున స్నానము చేసినయెడల విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. ఎవరైనా తెలిసి కాని, తెలియక కాని మాఘశుద్ధ సప్తమి, దశమి, పౌర్ణమి లయందునూ, పాడ్యమి రోజుననూ నదీ స్నానమాచరించినయెడల వారి పాపములు నశించును.
మాఘ సుద్ధ పాడ్యమినాడునూ, అటులనే దశమి, ఏకాదశి, ద్వాదశి దినముల లోనూ స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి, పురాణ కాలక్షేపము చేసినయెడల శ్రీహరి సంతోషించి మనోవాంఛలు సిద్ధించునటుల వరమిచ్చును.
భక్తి శ్రద్ధలతొ మాఘ పురాణము వినిన మోక్ష ప్రాప్తి కలుగును", అని గౌతమ ముని ఆమెతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పెను...🙏💐
నేటి 6 ,వరోజు మాఘ పురాణ పారాయణం సమాప్తం...🚩🌞🙏🌹🎻
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
No comments:
Post a Comment