🌷శ్రీ బాలత్రిపురసుందరిదేవి 🌷
🍯పొంగలి
🥣కావలసినవి
పెసరపప్పు -150 గ్రా
కొత్త బియ్యం -100 గ్రా
మిరియాలు -15
పచ్చిమిరప కాయలు -6
పచ్చి కొబ్బరి -1 కప్
కాచిన నెయ్యి -1/4 కప్
జీడిపప్పు -15
జీలకర్ర-1/2 టేబుల్ స్పూన్
ఆవాలు -1/4 టేబుల్ స్పూన్
ఎండుమిర్చి -3
మినపప్పు , శనగపప్పు -2 టేబుల్ స్పూన్స్
కొత్తిమీర , కరేపాకు -తగినంత
ఉప్పు - రుచిని బట్టి
ఇంగువ -2 చిటికెళ్ళు.
🫕చేయవలసిన విధానము
దళసరి పాత్రలో కాస్త నేయి వేడి చేసి
పెసరపప్పుని దోరగా వేయించండి .బియ్యం కడిగి నీళ్ళన్నీ తీసేసిన తరువాత బియ్యం కూడా బాగా వేయించండి .తెలుపు రంగు పోకూడదు సుమా 5 నిమిషాలు
వేపితే చాలు పెసరపప్పుకూడ కలర్ మార కూడదు.
అదే మూకుడులో మరికాస్త నెయ్యి వేసి
జీడిపప్పులను వేయించి పెట్టండి.సన్నగా తరిగిన పచ్చి మిర్చి, పచ్చికొబ్బరి కోరు, జీలకర్ర ,మిరియాలు వేయించిన బియ్యం
పెసరపప్పు ఇవన్నీ 4 కప్పుల నీళ్ళతో
కుక్కర్లో వుంచి 3 whistles / కూతలు వచ్చాక స్టవ్ కట్టివేయండి.
చల్లారాక అందులో ఆవాలు , మినపప్పు ,
శనగపప్పు , జీలకర్ర , ఎండుమిర్చి ,ఇంగువ, కరేపాకు వేసి తాలింపు పెట్టిమిగిలిన నెయ్యి అంతా పొంగలిలో వేసి ఆ ప్రసాదము ఆతల్లి త్రిపురసుందరీదేవికి నైవేద్యంపెట్టి
భక్తిగా పూజించి ఈ దసరా 10 రోజులు మాకు శక్తినిచ్చి నీకు సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లీ అని ప్రార్ధించాలి .
🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
🌷గాయత్రి దేవి🌷
🍯పులిహోర
🥣కావలసినవి !!
బియ్యం -150 గ్రా
చింతపండు -50 గ్రా
పసుపు-1/2 స్పూన్
ఎండుమిర్చి -5
ఆవాలు -1/2 స్పూన్
మినపప్పు -1 స్పూన్
శనగ పప్పు -2 స్పూన్
వేరు శనగ పప్పు -1/2 కప్పు
కరివేపాకు -2 రెబ్బలు
ఇంగువ -చిటికెడు
నూనె -1/4 కప్పు
ఉప్పు -తగినంత
బెల్లం -కొద్దిగా
🫕చేయవలసిన విధానం
అన్నం వండి చల్లార్చి పసుపు , ఉప్పు , కలిపి పెట్టాలి. చింతపండును అరకప్పు నీళ్ళు పోసి నాన పెట్టి ,చిక్కటి గుజ్జు తీసి పెట్టండి, మూకుడులో కాస్త నూనె వేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి వేసి ఈ చింతపండు గుజ్జు వేసి కాస్తబెల్లం వేసి బాగా వుడికించండి (కావాలంటే పచ్చి మిర్చి వేసుకోవచ్చుగుజ్జులో )
వుడికిన గుజ్జు అన్నంలో కలపండి .
బాణలిలో నూనె వేడి చేసి ముందుగా ఆవాలు ,మినపప్పు , శనగ పప్పు , ఇంగువ , ఎండుమిర్చి , వేసి ఆవాలు చిటపట అన్న తరువాతవేరుశనగ గుళ్ళు వేసి అన్నీ బాగా వేగాక కరేపాకు వేసి , అన్నంలో కలపడమే. కమ్మటి పులిహోర రెడీ అవ్వగానే శ్రీ జగదీశ్వరీ మాతైన ఆ గాయిత్రి దేవికి నైవేద్యం పెట్టి ఆ తల్లి ఆశీస్సులతో అందరూ బాగుండాలని కోరుకొందాము.
🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
🌷అన్నపూర్ణా దేవి🌷
🍯కొబ్బరన్నం
🥣కావలసినవి
బియ్యం -1/2 కిలో
తురిమిన పచ్చికొబ్బరి-1 కప్
పచ్చిమిర్చి - 5
కరేపాకు,కొత్తిమీర, ఉప్పు .
పోపు సామాగ్రి ,ఎండుమిర్చి , ఇంగువ .
జీడి పప్పు -10
నూనె -1/4 కప్
నెయ్యి -1 టేబుల్ స్పూన్
🫕చేయవలసిన పద్ధతి
అన్నం పొడి పొడిగా వండుకొని పచ్చికొబ్బరి కాస్త నేతిలో వేయించి ఈ వేగిన కొబ్బరిని అన్నంలో కలపండి .
అదే మూకుడులో నూనె వేసి పోపుసామాగ్రి వేసి ఎండుమిర్చి , ఇంగువ , వేసి ఆవాలు చిటపట అనగానే పొడవుగా తరిగిన పచ్చిమిరప కాయలు , కరేపాకు, కొత్తిమీర ,
అందులో వేసి వేయించి .. ఈ వేయించినదంతా అన్నంలో కలిపి ఉప్పు, జీడిపప్పుకూడ వేసి పైన కాస్త కొత్తిమీర చల్లండి కమ్మటి కొబ్బరన్నం రెడి .
శ్రీ అన్నపూర్ణా దేవికి నైవేద్యం పెట్టి మనస్పూర్తిగా ప్రార్థించి అమ్మ కృప కు పాత్రులవుదాము.
🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
🌷లలితా దేవి🌷
🍯అల్లం గారెలు
🥣కావలసినవి
మినపప్పు-2 కప్స్
అల్లం -చిన్న ముక్క
పచ్చిమిరప కాయలు -6 సన్నగా తరిగినవి
జీరా - 1/4 స్పూన్
ఉప్పు -రుచికి తగినంత
కరేపాకు , కొత్తమీర తగినంత
నూనె -గారెలు వేయించేందుకు
🫕చేసే విధానం
మినపప్పు బాగా కడిగి 4 ,5 , గంటలు నానపెట్టుకోవాలి.
నానిన మినపప్పును గ్రైండర్లో వేసి , ఉప్పు , కాస్త సోడ , వేసి బాగా గ్రైడ్ చేసుకోండి . ఆ పిండిలో అల్లం,పచ్చిమిరప కాయలు కరివేపాకు, కొత్తిమీర , సన్నగా తరిగి వేసి ఈ మినపిండిని చేతిలో తీసుకొని రౌండుగా అదిమి కాగిన నూనెలో విడవాలి .
సహస్రనామాలతో శ్రీ లలితాదేవి ని ఆరాధించి దోరగా వేగిన వడలను నైవేద్యం పెట్టి ఆశీర్వాదం పొందుదాము.
🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
🌷సరస్వతీ దేవి 🌷
🍯పెరుగన్నం , దద్ధోజనం
🥣కావలసినవి !!
బియ్యం -1/4 కిలో
పాలు -1/2 లీ
చిక్కటి పెరుగు -1/2 లీ
నూనె -1/2 కప్పు
నెయ్యి -1 స్పూన్
కొత్తిమీర , కరివేపాకు
అల్లం చిన్న ముక్క
పచ్చిమిర్చి
పోపు సామాగ్రి
జీడిపప్పు -20
ఉప్పు , ఇంగువ ,ఎండుమిర్చి
🫕చేసే విధానం
ముందు బియ్యం కడిగి అన్నం వండి , కాస్త చల్లారాక కాచినపాలు , పెరుగు , ఉప్పు , వేసి బాగా కలిపి వుంచండి.
సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర , అల్లం ముక్కలు అన్నీరెడీగా వుంచుకొని స్టవ్ పై మూకుడుంచి అందులో నూనె వేసి పోపు కి కావలసినవన్నీ వేసిఎండుమిర్చి ఇంగువ తో పాటు తరిగి వుంచినవన్నీ వేసి బాగా వేగనిచ్చి పెరుగులో కలిపి, కాస్త నేతిలో వేయించిన జీడి పప్పులు వేయండి.
రుచికరమైన దద్ధోజనం అంటే ఆ చదువుల తల్లికి అంత మక్కువ ఆ తల్లి దీవెనలతో అందరూ బాగా చదివి అష్టైశ్వర్యాలతో తులతూగాలని కోరుతూ ప్రార్థించాలి.
🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
🌷శ్రీ మహాలక్ష్మిదేవి🌷
🍯రవ్వ కేసరి
🥣కావలసినవి
రవ్వ -1 కప్
చక్కెర-3/4 కప్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్
కేసరి కలర్ -చిటికెడు.
యాలకులు - 4
ఎండు ద్రాక్ష- 6
జీడిపప్పు -10
మిల్క్ - 1 కప్ ( మిల్క్ మేడ్ 1 )
వాటర్ -1/2 కప్
🫕చేసే విధానం
ముందు గా మూకుడులో కాస్త నెయ్యి వేసి రవ్వ దోరగా వేయించి తీసి ప్లేట్ లోవేసివుంచండి .
మూకుడులో కాస్త నెయ్యి వేసి జీడిపప్పు , ఎండుద్రాక్షవేయించితీసివుంచండి .
నీళ్ళూ ,పాలూ ,కలిపి బాగా
మరగనివ్వాలి.
అందులో కేసరి కలర్ ,చక్కెర, రవ్వ, వేసి నెయ్యి వేస్తూ బాగా కలిపి అందులోద్రాక్షా ,జీడిపప్పు ,మిగిలిన నెయ్యి అంతా వేసి బాగా కలిపి ఘుమ ఘుమగా నేతితో ఆ మహాలక్ష్మికి నైవేద్యం గా పెట్టి సౌభాగ్యం ఇవ్వమని ప్రార్థించండి.
🌷శ్రీ దుర్గా దేవి🌷
🍯కదంబం ప్రసాదం
🥣కావలసినవి
కందిపప్పు -1/2 కప్
బియ్యం -1/2 కప్ ( కొత్తబియ్యం అయితే మరీ రుచిగా వుంటుంది )
వంకాయ-1
సొరకాయ-1/4
దోసకాయ-1
బీన్స్ -తగినన్ని
పోటాటో-1
వేరుశెనగ ( పీనట్ ) -2 పిడికిళ్ళు
మొక్కజొన్నలు-1
క్యారెట్-1/2
టోమాటో-2
కరివేపాకు-తగినంత
కొత్తిమీర
కోరిన పచ్చి కొబ్బరి- 1 చిప్ప
పచ్చి మిర్చి-4
నూనె -తగినంత
నెయ్యి- చిన్న కప్పు
చింతపండు గుజ్జు -తగినంత
బెల్లం ( జాగిరి )-కాస్త
ఉప్పు , పసుపు -తగినంత
సాంబర్ పౌడర్-3 చెంచాలు
పోపు గింజలు ,ఎండుమిర్చి, ఇంగువ .
🫕చేయవలసిన విధానము
ముందుగ కాయగూరలన్ని మీకు కావలసిన సైజులో తరుక్కుని వుంచుకోండి
కుక్కర్లో కందిపప్పు ,బియ్యం ,పీనట్ ,
టోమాటో తప్ప అన్నీ కూరగాయలు వేసి
పసుపు , ఉప్పు ,నీళ్ళు 5 పావులు వేసి రెండు విజిల్స్ వచ్చాక stove off చేయండి .
మూకుడులో కొద్దిగ నూనె వేసి వేడి చేసాక అందులో కొద్దిగ ఆవాలు వేసి అవి చిట్లిన తరువాతపచ్చిమిర్చి ,కరేపాకు ,టొమాటో ,చింతపండు గుజ్జు ,సాంబర్ పౌడర్ , బెల్లం వేసి బాగా వుడికిన తరువాత ఆ గ్రేవి అంతావుడికిన రైస్లోవేసి,కొత్తిమీర ,
కరేపాకు, నెయ్యి వేసిమరోసారి వుడికించండి అంతా బాగావుడికినతరువాత ,ఎండుమిర్చి ,
ఇంగువతో తాలింపు పెట్టికొబ్బరి కలిపి దించండి. దుర్గాదేవికి నెయ్యివేసి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి.
🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
🌷మహిషాసుర మర్ధిని 🌷
🍯బెల్లం అన్నం
🥣కావలసినవి
బియ్యం -100 గ్రా
బెల్లం -150 గ్రా
యాలకులు -5
నెయ్యి -50 గ్రా
జీడిపప్పు -10
🫕చేసే విధానం
ముందుగా బియ్యం కడిగి అరగంట నానని వ్వండి .తరువాత మెత్తగా వుడికించాలి .
అందులో తరిగిన బెల్లం వేసిమొత్తం కరిగేంత వరకు వుడికించాలి. జీడిపప్పులు నేతిలో దోరగా వేయించి ,యాలకుల పొడి మిగితా నెయ్యి మొత్తంఅన్నంలోకలిపి దించేయడమే .
తియ్యని కమ్మని నైవేద్యం సమర్పించుకుని అమ్మ కృప కు పాత్రులవుదాము.
🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
🌷రాజ రాజేశ్వరి దేవి🌷
🍯పరమాన్నం
🥣కావలసినవి
చిక్కటి పాలు -6 కప్స్ ( 1 టిన్ మిల్క్ మేడ్ ) బియ్యం -1 కప్
చక్కెర -1,1/2 కప్స్
ఎండు ద్రాక్ష, జీడిపప్పు -1/4 కప్
ఏలకుల పౌడర్ -1/2 స్పూన్
నెయ్యి -5 టేబుల్ స్పూన్స్
🫕చేసే విధానం
ముందు దట్టమైన వెడల్పాటి పెద్ద గిన్నెలో కాస్త నెయ్యి వేసిఅందులో బియ్యం పోసి పచ్చి వాసన పోయెంత వరకు వేయించండి.
తరువాత పాలు , ఏలకుల పౌడర్ వేసి కుక్కర్ లో 2 విజిల్ వచ్చేంత వరకు వుంచండి. అది పక్కన పెట్టి చిన్న మూకుడు స్టవ్ పై వుంచిఅందులో కాస్త నెయ్యి వేసి ఎండు ద్రాక్ష, జీడిపప్పు దోరగా వేయించి వుంచండి . వుడికిన అన్నానికి చక్కెర వేసి ఒక్క 5 నిముషాలు మళ్ళీ వుడికించి ( అలా వుడికి నప్పుడు బియ్యం పాలు చక్కర కలుసుకొని చిక్కగా కావాలి )
అందులో వేయించిన జీడిపప్పు అవి వేసి బాగా కలిపి కాస్త నెయ్యి వేసి ఆ రాజ రాజేశ్వరిదేవికి నైవేద్యం పెట్టండి.
🍚🍚🍚🍚🍚🍚🍚🍚🍚
🌷ప్రధాన దేవత ను సర్వాభరణములతో అలంకారం.పదవ రోజుఈ తొమ్మిది రోజులూ చేసిన అన్ని ప్రసాదములను నైవేద్యముగా పెట్టాలి .
-సేకరణ, టెలిగ్రామ్ గ్రూప్
No comments:
Post a Comment