Adsense

Monday, November 15, 2021

కుబేరుడిని అనుగ్రహించిన తంజపురీశ్వరుడు


ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా  తంజావూరు వుండేది.

తంజావూరులోని బృహదీశ్వరాలయం నిర్మించడానికి ముందే తంజపురీశ్వరుని ఆలయం ప్రసిధ్ధి చెందింది.

  ఆ ఆలయచరిత్ర ఎంతటి ప్రాచీనమైనదో తెలుసుకుందాము.

బ్రహ్మదేవుని పుత్రుడైన పులస్త్యబ్రహ్మ 
పుత్రుడు విశ్వవసు మహర్షి అయినప్పటికి 
సుమాలి అనే  ఒక దానవుని పుత్రికను  రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వారికి
దానవ  గుణాలు కలిగిన రావణుడు, కుంభకర్ణుడు అనే పుత్రులు శూర్పణఖ
అనే  కుమార్తె  జన్మించారు.

పిదప విభీషణుడు, వైశ్రణవుడు(తరువాత కాలంలో కుబేరుడుగా పిలువబడ్డాడు) జన్మించారు.

రావణుడు, వైశ్రవణుడు పరమేశ్వరుని భక్తులు.
కుంభకర్ణుడు బ్రహ్మదేవుని 
భక్తుడు. విభీషణుడు
మహావిష్ణువు భక్తుడు.

ఒకసారి శ్రీమహాలక్ష్మిదేవి తన వద్దనున్న అష్టసిరుల
రక్షణభారాన్ని  శంఖనిధి, పద్మనిధి అనే  వారికి అప్పగించినది.

కుబేరుడు తను చేసిన తపస్సుకు ఫలితంగా  సకల ఐశ్వర్యాలకు అధిపతి అయి  శంఖనిధిని, పద్మనిధులను తనకు సహాయకులుగా నియమించాడు.

దేవ శిల్పి  విశ్వకర్మ  నిర్మించిన అలకాపురిని తన ముఖ్యపట్టణంగా
చేసుకొని కుబేరుడు తన భాధ్యతలను ధర్మయుతంగా,సక్రమంగా నిర్వర్తించేవాడు. 

సోదరుని ఔన్నత్యాన్ని సహించలేక
రావణుడు దుర్మార్గంగా 
కుబేరుని పుష్పకవిమానాన్ని, సకల ఐశ్వర్యాలను, అతను పాలించే అలకాపురిని ఆక్రమించుకున్నాడు.

కుబేరుడు తాను కోల్పోయిన సంపదలను, పదవిని, తిరిగి పొందడానికి  అనేక శివలయాలకి వెళ్ళి  తపస్సు చేయసాగాడు.

ఆఖరికి కుబేరుడు దర్శించిన శైవక్షేత్రం  తంజైపురి. ఇక్కడ స్వయంభువుగా వెలసిన
పరమేశ్వరుని ప్రార్ధించాడు. కుబేరుని తపస్సుకు మెచ్చిన ఈశ్వరుడు  కుబేరుడు పోగొట్టుకున్న పదవి , సకలఐశ్వర్యాలతో పాటు
ఉత్తర దిక్కుని  పాలించే అధికారాన్నిచ్చి, నవ నిధులను కాపాడే బాధ్యతను  కూడా యిచ్చాడు.
శరణుకోరి వచ్చిన కుబేరునికి అనుగ్రహం ప్రసాదించిన ఈశ్వరునికి 
తంజపురీశ్వరుడు అని  ( శరణమిచ్చిన ఈశ్వరుడు) ఆ స్వామి వెలసిన ఊరు తంజావూరు అని పిలువబడుతన్నది. 
ఈ దేవునికి కుబేరపురీశ్వరుడనే
నామము వున్నది.

తంజావూరు లో బృహదీశ్వరుని ఆలయ నిర్మాణానికి ముందే  ఊరు సరిహద్దులలో ఒక శివాలయం వుండేదని వున్నదని
చారిత్రకాధారాలు తెలుపుతున్నాయి.
కుబేరుడు ఇక్కడికి వచ్చి ఆరాధించిన చిహ్నంగా తంజపురీశ్వరుని సన్నిధికి  ముందు వున్న  ఒక స్ధంభం మీద ఈశ్వరుని  పూజిస్తున్న కుబేరుని శిల్ప ప్రతిమ గోచరిస్తుంది. 

మహావిష్ణువు తారకుని, దండకుని, తంజకదానవులను సంహరించే సమయంలో
చివరగా ఏనుగు రూపం ధరించి పోరాడిన తంజకుని నరసింహ అవతారం ధరించి సంహరించాడు. ఆ దానవుడు ప్రాణాలు వదిలే ముందు  తన పేరుతో ఆ ఊరు పిలువబడాలని కోరుకున్నాడు.

ఈ ఆలయం 1200  సంవత్సరాల ప్రాచీనమైనది.
తంజపురీశ్వరుడు గర్భగుడిలో లింగరూపంలో దర్శనమిస్తున్నాడు.
ప్రాంగణంలో దుర్గాదేవి,
బ్రహ్మదేవుడు,
దక్షిణామూర్తి, నటరాజస్వామి , సమీపమున చండికేశ్వరుని సన్నిధి వున్నవి. 

అమ్మవారు ఆనందవల్లి నిలబడిన భంగిమలో దర్శనం కటాక్షిస్తున్నది. అమ్మవారి సన్నిధి ముందు ద్వారపాలకుల విగ్రహాలు. వెలుపల 
మండపం గోడలపై అష్ట లక్ష్ములు దర్శనమిస్తారు. మహామండపం వెలుపల వున్న  శివలింగ రూప తంజపురీశ్వరుని కుబేరుడు ప్రార్ధిస్తున్న భంగిమ, సమీపమునే లక్ష్మీ దేవి  మూర్తులు కనిపిస్తాయి. 

కుబేరుడు తంజపురీశ్వరుని ప్రార్ధించి   కోల్పోయిన సంపదలను  అన్నిటిని తిరిగి పొందిన రోజు ఆశ్వయుజ మాస అమావాస్య.
దీపావళినాడు ప్రతి సంవత్సరం  కలశ స్ధాపనం చేసి, కుబేరహోమం, లక్ష్మీ హోమం , శివమూల మంత్ర హోమం  చేసి, కుబేర లింగానికి, 
లక్ష్మీకుబేరులకు అభిషేకం చేసి యాగాలు నిర్వహిస్తారు.   

ఈ కార్యంలో  భక్తి శ్రధ్ధలతో  పాల్గొనే భక్తులకు సకల ఐశ్వర్యాలు లభిస్తాయని
ధృఢంగా నమ్ముతారు.

తంంజావూరు - కుంభకోణం మార్గంలో కరన్తాట్టంగుడి ప్రక్కన 
వెణ్ణట్రాంకరై (వెణ్ణారు నది) ఒడ్డున ఈ  ఆలయం నిర్మించబడి వున్నది. 
తంజావూరు బస్ స్టాండ్ నుండి ఈ ఆలయానికి  బస్సులు , ఇతర వాహనాలు వెడతాయి...సేకరణ.

No comments: