ఉత్తరఫల్గుణి నక్షత్రం పౌర్ణమి నాటి చంద్రునితో కలిసి ఉన్నందు వల్ల ఈ మాసానికి ఫాల్గుణమాసం అని పేరు వచ్చింది.
ఉత్తరఫల్గుని నక్షత్రం బుద్ది వికాసాన్ని దైర్య స్థైర్యాలను నూతనోత్తేజాన్ని ఇచ్చే లక్షణాలు ఉన్నదని శాస్త్ర వచనం.
వాతావరణ ప్రభావం తో ఆకులన్నీ రాలి పోయి చెట్లు మోడుబారి పోయే కాలమిది.
*ఫాల్గుణం ... విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం.*
ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది.
అదితి పయోవ్రతం ఆచరించి వామనుణ్ణి పుత్రుడు గా పొందింది.
ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నుండీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
*ఫాల్గుణ శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు.*
ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఫాల్గుణ శుద్ధ నవమి నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.
శుక్ల పాడ్యమి మొదలు ద్వాదశి వరకు పన్నెండు రోజులు భగవంతునికి పాలు మాత్రమే నివేదన చేసి ప్రసాదం గా స్వీకరించాలని చెబుతారు.
ఈ మాసం లో గోదానం, ధాన్య దానం, వస్త్ర దానం చేస్తే పుణ్యప్రదమని ధర్మ శాస్త్రాలు వివరిస్తున్నాయి.
శుక్లపక్ష ఏకాదశి - దీనినే ఆమలక ఏకాదశి అని కూడా అంటారు
ఈ రోజున ఉసిరి చెట్టును పూజించాలని, ఉసిరి ఫలాలను దానం చేయాలని, వాటిని తినాలని పురాణ కథనం.
ఉసిరికి ఎన్నో ఔషద గుణాలున్నాయి, రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. అనేక వ్యాధుల నివారణకు ఉపకరిస్తుంది.
ద్వాదశి -
దీనినే గోవింద ద్వాదశి అని కూడా అంటారు
ఈ రోజున గంగా స్నానం చేయడం వల్ల పాపాలన్నీ తొలగడం తో పాటు విశేష పుణ్య ఫలం లభిస్తుంది.
పౌర్ణమి -
మహా ఫల్గుణి అని డోలికా పూర్ణిమ అని హోలికా పూర్ణిమ అని కూడా అంటారు.
లక్ష్మీనారాయణ వ్రతం చేసి స్వామి ని ఊయలలో ఉంచి ఊపుతారు. కాబట్టి దీనీని డోలికా పూర్ణిమ అంటారు.
ఉత్తర భారతదేశం లో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాదిస్తారు.
ఆ మరునాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు.
పాల్గుణ పౌర్ణమి మరుసటి రోజు నుండే వసంత మాసం ప్రారంభమవుతుంది. ఈ రోజు చందనం తో సహా మామిడి పూతను తిన్నవారు సంవత్సరమంతా సుఖం గా ఉంటారు.
అమావాస్య -
ఈ రోజు సంవత్సరానికి ఆఖరు రోజు అయినా దీనిని కొత్త అమావాస్య అని పిలుస్తారు.
కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభించే రోజు కాబట్ట్టి కొత్త అమావాస్య అని పిలుస్తారు.
ఈ రోజు పితృ దేవతలను స్మరిస్తూ తర్పణాలు, పిండ ప్రధానం, దానాదులు చేయాలని, అలా చేస్తే పితృదేవతల అనుగ్రహం కలుగుతుందని వంశాభివృద్ది జరుగుతుందని ప్రతీతి.
No comments:
Post a Comment