THE COMPLETE BLOG FOR PEOPLE // NEWS, DEVOTIONAL, TECHNOLOGY, LIFE STYLE, SPORTS, ENTERTAINMENT, SCIENCE, ONLINE EARNING, RIDDLES, SILLY QUESTIONS, IMPORTANT DAYS, BEAUTY TIPS, HEALTH
Adsense
Wednesday, October 5, 2022
శమీ వృక్ష దర్శనం, విశేషం
*శ్లో|| శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ |*
*అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ||*
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయబడింది. 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి , వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా , విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము. 'చతుర్వర్గ చింతామణి' అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటినక్షత్రోదయ వేలనే 'విజయం ' అని తెలిపి యున్నది. ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.
*'శమీ పూజ'* చేసుకునే ఈ రోజు మరింత ముఖ్యమైనది. శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. అజ్ఞాతవాసమందున్న పాండవులు వారి వారి ఆయుధములను , వస్త్రములను శమీవృక్షముపై దాచి ఉంచారు. అజ్ఞాతవాసము పూర్తి అవగానే ఆ వృక్ష రూపమును పూజించి ప్రార్ధించి , తిరిగి ఆయుదములను , వస్త్రములను పొంది , శమీవృక్ష రూపమున ఉన్న *'అపరాజిత'* దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు .
*"శ్రీ రాముడు"* ఈ విజయదశమి రోజున ఈ *'అపరాజితా'* దేవిని పూజించి రావణుని సంహరించి , విజయము పొందినాడు. అదేంటంటే , శ్రీరాముడు రావణాసురుని పది తలలనూ చూసి భీతిల్లి , నిద్రించిన శక్తిని (దేవిని) పూజించగా , ఆమె మేల్కొని శ్రీరాముని పూజలందుకొని , శ్రీరామునికి విజయాన్ని కలుగజేసింది. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్ల పాడ్యమి. నాటి నుంచి పదో రోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి , విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి. పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి. ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
*‘‘శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ , అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియవాదినీ. శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా , ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ. కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా , తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే.''*
పైన చెప్పిన మంత్రార్థం ఏమిటో చూద్దాం.
శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుంది. ఇది నాడు అర్జునుని ధనస్సును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.
తెలంగాణాలో ఈ పూజ అనంతంరం పాలపిట్ట దర్శనం కోసం వేచివుంటారు. దానిని చూసిన తరువాతే ఇండ్లకు తిరిగి వస్తారు. వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును *‘బంగారం'* అని చెప్పి పెట్టి , వారి దీవెనలందుకోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక.
హైదరాబాద్ నగరంలో జమ్మికొమ్మ , ఆరె కొమ్మలకు ఉన్న ఆకులను బంగారు , వెండిగా పంచుతూ , శుభాకాంక్షలను తెలుపుకుంటారు. దీనినే *‘సోనా దేనా'* కార్యక్షికమంగా పిలుస్తారు. ప్రధానంగా జమ్మి , ఆరె ఆకులను పరస్పరం పంచుకొని , కౌగిలించుకోవడం ఒక ఆత్మీయ స్పర్షగా ఈ పండగ సందర్భంగా కొనసాగుతున్న ఆచారం. దీనిని జాతి , కుల , మత , లింగ వివక్షలకు అతీతంగా మనసుల్ని , హృదయాల్ని కలిపే సామాజిక ఐక్య తారాగానికి ప్రతీకగా భావిస్తారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment