Adsense

Showing posts with label ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులు. Show all posts
Showing posts with label ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులు. Show all posts

Wednesday, April 10, 2024

ఉగాది నుంచి శ్రీరామ నవమి వరకు వసంత నవరాత్రులు Vasant Navratri from Ugadi to Sri Rama Navami

చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి అంటే *ఉగాది* నుంచి మనకు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

అలాగే ఋతువులలో తొలి ఋతువైన వసంతఋతువు మొదలవుతుంది.

ఈ వసంతఋతువుకు ఎంతో ప్రముఖ్యత ఉంది.
శిశిరంలో ఆకులు రాల్చి సర్వస్వం కోల్పోయిన ప్రకృతికాంత,
నవ పల్లవాలతో చిగిర్చి,
పూల సోయగాలతో కనువిందులు చేస్తూ ,
సుగంథాల సేవలతో ప్రకృతి పురుషునకు మకరందాల విందులు అందించే,
ఈ వసంతఋతువు అంటే గుణరహితుడైన ఆ పరమాత్మనకు కూడా ఇష్టమే.

అందుకే… ‘ఋతూనా కుసుమాతరః’ అని ‘గీత’లో చెప్పాడు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు.

అనంతమైన కాలంలో,
కేవలం ఏడాదికో రెండు నెలలు ఆయుష్షు ఉండే ఈ వసంతఋతువుకు ఎందుకంత ప్రాధాన్యత?

ఈ వసంతఋతువు లోనే దేవదేవుడైన శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడు. అదే శ్రీరామావతారం.

అంతవరకూ రాక్షసుల యుద్ధాలతో విసిగి వేసారిన సర్వలోకాలూ శ్రీరామ జననంతో మంచిరోజులు వచ్చాయని సంతోషించాయి.

పుడుతూనే సకల జీవకోటికీ ఆనందాన్ని కలిగించినవాడు శ్రీరాముడు.

అందుకే, సంవత్సరంలో తొలిపండుగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ *వసంత నవరాత్రులు* సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది.

అయితే, తొమ్మిది రాత్రులే ఎందుకు జరుపుకోవాలి?
పదిరాత్రులు జరుపుకోకూడదా?
ఏమిటీ లెక్క? అనే సందేహం చాలామందికి కలుగుతుంది.

*నవ* అంటే తొమ్మిది అని, క్రొత్త అని రెండు అర్థాలు ఉన్నాయి.

క్రొత్త అంటే,
అంతవరకూ రాక్షస బాధలతో శోకమయంగా గడిపిన రాత్రులు పోయి,
ఆనందమయ నవరాత్రులు వచ్చాయి అని అర్థం.

ఇక తొమ్మిది రాత్రులు ఎందుకుచేయాలంటే,

భగవంతుని ఆరాధనలో ‘భక్తి’ తొమ్మిది రకాలు.

శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం

శ్రవణం – కీర్తనం – స్మరణం – పాదసేవనం – అర్చనం – వందనం – దాస్యం – సఖ్యం – ఆత్మనివేదనం.
ఇవి నవవిధ భక్తిమార్గాలు.

భాగవతోత్తములుగా ప్రసిద్ధి గాంచిన ఎందరో భక్తులు ఈ నవవిధ భక్తిమార్గాలలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని,
పరమాత్మని సన్నిధి చేరుకున్నవారే.

నవరాత్రులు తొమ్మిది రోజులు,
ఒక్కొక్క రోజూ,
ఒక్కొక్క భక్తి మర్గాన్ని ఎంచుకుని,
అలా తొమ్మిది రోజులు,
తొమ్మిది భక్తిమార్గాలతో భగవంతుని సేవించి తరించడానికే,
ఈ నవరాత్రులను ఏర్పాటు చేసారు.
మన ఋషులు.

*వసంత నవరాత్రి మహిమ*

ద్వాఋతూ యమదంష్ట్రాఖ్యౌ నృణాం రోగకరావుభౌ|
శరద్వసంత నామానౌ తస్మాత్‌ దేవీం ప్రపూజయేత్‌||

సంవత్సరచక్రంలో,
వసంత,
శరదృతువులు
రెండూ,
ప్రాణులకు రోగకారకమైనవి.

కోరలతో భయంకరంగా ఉన్న తన నోరు తెరుచుకొని వికటాట్టాహాసం చేస్తూ,
ప్రాణులను మృత్యుదేవత కబళించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.

అలా మృత్యుముఖంలో పడకుండా,
తప్పించుకోదలచిన వారు,
పరమేశ్వరిని సేవించి,
ఆమె అనుగ్రహాన్ని పొందాలి.

అపమృత్యు వినాశినియై ,
సర్వాపద్లినివారిణియై విరాజిల్లే,
ఆ జగన్మాతను ప్రార్థించిన వారు,
ఆ యా ఋతువుల్లో రోగభాధలను , మృత్యుభయాన్ని జయించగలుగుతారని ,

ఇందుకై నవరాత్రులలో పరమేశ్వరిని పూజించాలని వ్యాసుడు జనమేజయునకు నవరాత్రి పూజావిధానాన్ని వివరించాడు.

సంవత్సరారంభంలో చైత్ర శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ వసంత నవరాత్రులు అని,

అర్థ సంవత్సరం గడచిన తర్వాత,
శరదృతువు ఆరంభంలో ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు గల తొమ్మిది రోజులూ,
శరన్నవరాత్రులు అని వ్యవహరింపబడతాయి.

వసంత నవరాత్రులలో శ్రీరామచంద్రుని మనం ఆరాధిస్తాం.

రామచంద్రుడు పురుషరూపంలో ఉన్న లలిలతాదేవి అని సాధకుల విశ్వాసం.

*శ్రీరామో లలితాంబికా*
అని పురాణాలు వివరిస్తున్నాయి.

నేటికీ ఉత్తర భారతదేశంలో రామలీలా మహోత్సవాలు అనే పేరుతో నవరాత్రులలో దేవీపూజలు నిర్వహించే సంప్రదాయం ఆచరణలో ఉన్నది.

శరన్నవరాత్రులలో దేవిని ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం.

మానవునికి మళ్ళీ మళ్ళీ మాతృగర్భంలో నరకయాతనలు రాకుండా ఉండడానికి,

తొమ్మిది నెలలు జీవుడు పడవలసిన బాధలు పునరావృతం కాకుండా ఉండడానికి,

ప్రశాంతస్థితిని అనుభవించడానికి ,

నవరాత్రులలో ఆదిశక్తిని ఆరాధించాలని,
వ్యాసమహర్షి లోకానికి వెల్లడించాడు.

వసంత నవరాత్రులలో,
శరన్నవరాత్రులలో,
పరాశక్తిని ఆరాధించి, అభీష్టసిద్ధిని పొందినవారు ఎందరో ఉన్నారు.

రామచంద్రమూర్తి సీతాన్వేషణ ప్రయత్నంలో ఉండగా,

ఋష్యమూక పర్వతంపై సుగ్రీవునితో స్నేహం కలిగిన తర్వాత,
దేవిని ఆరాధించి సత్ఫలితం పొందాడు.

దుర్భరమైన దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక వైశ్యుడు దారిద్ర్య నివారాణోపాయం చెప్పవలసిందిగా ఒక విప్రుని ప్రార్థించి,

దేవీ నవరాత్రి పూజలను గురించి తెలుసుకొని,
దేవిని ఆరాధించి,
సకల సంపదలనూ పొంది,
దారిద్ర్యం నుండి విముక్తుడయ్యాడు.

అజ్ఞాతవాసం ఆరంభించబోతూ,
పాండవులు విరాటనగరంలో ప్రవేశించే ముందు,
జగన్మాతను సేవించి,
నిర్విఘ్నంగా అజ్ఞాతవాసం నిర్వహించి కృతార్థులయ్యారు.