Adsense

Wednesday, June 15, 2022

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం : అప్పలాయగుంట (చిత్తూరు జిల్లా)


🔅 వైకుంఠనాధుడు శ్రీ మహావిష్ణువు భక్తుల కోసం కలియుగంలో ప్రత్యక్షంగా చిత్తూరు జిల్లా తిరుమలగిరుల్లో స్వయంభువుగా అవతరించి ఆది వరాహ క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడు.

👉 శ్రీనివాసుని వివాహం పద్మావతి దేవితో అంగరంగవైభవంగా జరిగింది. తిరుమల కొండలకు వెళ్లే ముందు స్వామివారు జిల్లాలోని పలుప్రాంతాల్లో నివాసం ఉన్నారు. భక్తుల ప్రార్థనలు ఆలకించి కొన్ని రోజులు భక్తులను అనుగ్రహించేందుకు అక్కడే ఉండేవారు. 
 
🔅 స్థలపురాణం;-

 👉శ్రీ వేంకటేశ్వరుడు నారాయణ వనంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతిని వివాహమాడి తిరుమలకు కాలినడకన బయలుదేరి వెళ్తూ అప్పలాయగుంటలో తపస్సు చేసుకుంటున్న సిద్ధేశ్వర స్వామిని అభయ హస్తంతో ఆశీర్వదించి, ఈ ఆలయంలో కొలువు దీరాడు. తర్వాత ఇక్కడి నుండి కాలినడకన తొండవాడ లోని అగస్తేశ్వరుని దర్శించి తర్వాత సమీపంలోనే ఉన్న శ్రీనివాస మంగా పురంలో ఆరునెలలు ఉండి అక్కడి నుండి శ్రీవారి మెట్టు ద్వారా (నూరు మెట్ల దారి) తిరుమల చేరాడని స్థల పురాణం.

👉తిరుమల శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతిదేవిని పెళ్లి చేసుకుని, పసుపు దుస్తులతోనే తిరుమలకు బయల్దేరి వస్తూ ఈ ప్రాంతంలో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటారు.   అక్కడ అదే సమయంలో సిద్ధేశ్వర యోగి అనే మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా దివ్యదంపతులు కనపడేసరికి వారి పాదాల మీద పడి వారిని అక్కడే ఉండిపొమ్మని ప్రార్థిస్తాడు. స్వామి వారు చిరునవ్వుతో అతని వినతిని మన్నిస్తాడు. అలా ప్రసన్నం చేసుకోగానే వెలసినవాడు కాబట్టి అక్కడి దేవుడిని ప్రసన్న వేంకటేశ్వరస్వామి అంటారు.

🔅 అప్పులయ్య కథ 🔅

👉 పూర్వం ఈ ప్రాంతాన్ని అన్ఱుణ (రుణం లేని) సరోవరం అని పిలిచేవారు. అప్పలాయిగుంట అని పేరు రావడానికి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అప్పులయ్య అనే వ్యక్తి ఉండేవాడు.పేరుకు తగ్గట్టుగానే అతను వూరిలో అందరి దగ్గర అప్పులు చేసేవాడు. ఇది తెలుసుకున్న ఒక వ్యక్తి అతని దగ్గర నుంచి సొమ్మును తీసుకోవాలన్న దురుద్దేశంతో అతని మీద నింద మోపి ఎలాగైనా డబ్బు కాజేయాలనుకుంటాడు. అప్పులయ్య ఎలాగు అందరి దగ్గర అప్పులు చేస్తాడు కాబట్టి అందరు అతను నిజంగానే ఆ వ్యక్తి దగ్గర అప్పు చేశాడనుకుని అతనిని అప్పు చెల్లించమని చెప్తారు. అప్పులయ్య ఎంత చెప్పినా ఎవరు వినరు. దీంతో కోపోద్రిక్తుడైన అప్పులయ్య ఒక రాయి మీద ‘ నేను ఋణం తీసుకోలేదు’ అని రాసి దగ్గరలో ఉన్న ఒక కోనేరులో వేస్తాడు. ఆ రాయి ఆ కోనేటి లో మునిగిపోకుండా తెలుతుంది. దీంతో గ్రామస్థులందరు అప్పులయ్య నిజాయితీ పరుడని నమ్ముతారు. అప్పటి నుంచి ఆ కోనేరును అన్ఱుణ సరోవరం అని పిలిచేవారు. అప్పటి నుంచి ఆ ప్రాంతాన్ని అప్పులయ్యగుంట అనే పిలిచేవారు. కాలక్రమేణా అది అప్పలాయిగుంటగా ప్రసిద్ధి చెందింది.

🔅 ఆలయ చరిత్ర 🔅
👉 ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించినట్టు తెలుస్తోంది. దీని ముఖద్వార గోడ మీద క్రీ.శ. 1585 కాలం నాటి వేంకటపతిరాయల దానశాసనం ఉంది. కాబట్టి ఆలయం అంతకు ముందే నిర్మించి ఉంటారని అభిప్రాయం. ఇక్కడ పూర్వం స్థానికంగా కార్వేటి నగర రాజులు పరిపాలించారు కాబట్టి వారే ఆలయ ఆలనపాలనా చూసుకొంటూ వచ్చారు. తరువాత కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ ఆలయాన్ని 1988 లో స్వాధీనం చేసుకుంది మరియు అన్ని ఆచారాలు వైఖానస అగామ సిద్ధాంతాల ప్రకారం ఉన్నాయి.

👉 ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు, పవిత్రోత్సవం నిర్వహిస్తారు. స్వామి ప్రసన్నవదనంతో అభయహస్తంతో మనకు దర్శనమిస్తారు. రోగాల బారిన పడిన భక్తులు ఇక్కడ ఉన్న భారీ వాయునందనునికి మొక్కితే రోగ విముక్తలవుతారని ప్రశస్తి.

🔅 ఆంజనేయస్వామి దేవాలయం 🔅
👉 ఇక్కడి ఆంజనేయస్వామి చాలా మహిమగలవాడని నమ్ముతారు. దీర్ఘకాలిక వ్యాధులు నివారించడంలో ఇక్కడి హనుమంతుడు దిట్ట. వ్యాధులు తగ్గినవారు దేవాలయంలో ముడుపులు లేదా మొక్కుబడులు చెల్లించుకుంటారు.

👉 ప్రతి నిత్యం ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామివారికి మంగళ వాయిద్యాలతో పూజాభిషేకాలు నిర్వహించి, తర్వాత శ్రీవారికి అభిషేకాలు పూజలు నిర్వహించి, భక్తులకు దర్శన భాగ్యాన్ని కలుగ జేస్తారు. ఇక్కడకు వచ్చే భక్తులు తక్కువ ఉన్నందున ఆలయం ప్రశాంత వాతావరణములో ఉన్నందున భక్తులు సావధానంగా చిత్త శుద్ధితో దైవ దర్శనం చేసుకోవచ్చు.
 కనుక అప్పలాయగుంట వెళ్ళే భక్తులు వ్యాధులను తగ్గించి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆంజనేయ దేవాలయాన్ని చూడడం మరవద్దు !!

👉 అప్పలాయ గుంట తిరుపతికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి నుండి ప్రతి గంటకు బస్సులు ఉంటాయి. తిరుపతి నుండి పరిసరప్రాంతాలలోని ఆలయ సందర్శన బస్సులు కూడా ఇక్కడి వస్తుంటాయి. తిరుపతికి వచ్చిన వారు తప్పక చూడవలసిన ఆలయమిది.

No comments: