Adsense

Wednesday, June 15, 2022

శ్రీ వేదనారాయణస్వామి ఆలయం : నాగలపురం (చిత్తూరు జిల్లా)


🔅 చిత్తూరు జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో వేదనారాయణ స్వామి ఆలయం ఒకటి. ఇది చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది.

👉పంచ ప్రాకారములతో, సప్త ద్వారాలతో, అత్యంత కళాత్మకమైన శిల్ప కళతో, సుందర ఆలయంగా తీర్చిదిద్ది, పునర్మించి అనేక దానములు చేసి తర్వాత శ్రీకృష్ణదేవరాయలు ఈ గ్రామానికి తన తల్లి నాగమాంబ పేరిట నాగమాంబాపురంగా నామకరణం చేశాడు. కాలక్రమంలో ఇది నాగలాపురం అయ్యింది.

👉 విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయంలో ప్రధాన మూర్తి వేదనారాయణ స్వామి పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భాలయానికి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి సమేతంగా వేదనారాయణ స్వామి ఉన్నారు.

👉వేదనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి  పాదాలు మరియు వాటి బదులుగా మత్స్యం ఉంది, ఇది విష్ణువు యొక్క మత్స్య అవతారాన్ని సూచిస్తుంది.

👉 పురాణాల ప్రకారం (మత్స్య పురాణం), శ్రీ వేద నారాయణస్వామి ఆలయ చరిత్ర విశ్వం ఆరంభం నాటిది.

👉 త్రిమూర్తుల్లో విష్ణువు లోకపాలకుడు. దుష్ట శిక్షణా శిష్ట రక్షణ కోసం ఎన్నో అవతారాలను ధరించాడు. వాటిల్లో మొదటిదీ వేదాలకు పునర్జన్మను ప్రసాదించిందీ మత్స్యావతారం. అయితే స్వామి మత్స్యరూపంలోనే స్వయంభూగా వెలసిన క్షేత్రం చిత్తూరులోని నాగలాపురం. ఇక్కడ స్వామి వారు శ్రీదేవీ భూదేవీ సమేతుడై కొలువుదీరి పూజలందుకుంటున్నాడు.

🔅 స్థలపురాణం : 🔅

👉 వేదాలను సంరక్షించడానికి విష్ణుమూర్తి ఎత్తిన అవతారమే మత్స్యావతారం. సోమకాసురడనే రాక్షసుడు.. బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచెను. సముద్ర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. వేదాలు లేకుండా జీవసృష్టి చేయడం కష్టమని భావించిన బ్రహ్మదేవుడు మిగిలిన దేవతలతో కలిసి వైకుంఠపురం చేరుకుంటాడు. జరిగిన విషయాన్ని విన్నవించి, ఈ విపత్తు నుంచి కాపాడమని వేడుకుంటాడు.

👉 అప్పుడు శ్రీమహావిష్ణువు మత్స్యరూపాన్ని దాల్చి సముద్రంలో దాగున్న సోమకాసురుడితో భీకర యుద్ధం చేస్తాడు. కొన్ని సంవత్సరాలు కొనసాగిన ఈ యుద్ధంలో చివరికి సోమకాసురుడిని సంహరించిన విష్ణుమూర్తి వేదాలను బ్రహ్మదేవుడికి తిరిగి అప్పగిస్తాడు.

👉 వేదాపహరణ జరిగిన సమయంలో సోమకాసుర సంహారం కోసం సముద్ర గర్భంలోకి వెళ్లిన స్వామి ఎన్ని రోజులకీ ప్రత్యక్షం కాకపోవడంతో అమ్మవారు కూడా భూలోకానికి పయనమవుతుంది. భూమ్మీద విష్ణుమూర్తి శిలారూపధారుడై ఉన్నాడని తెలుసుకుని, అక్కడికి చేరుకుని స్వామివారికి అభిముఖంగా శిలారూపంలో నిలిచిపోయిందని చెబుతారు. ఆనాటి సంఘటనకు సాక్ష్యంగా నేటికీ ఆలయంలో స్వామివారు పడమరకు అభిముఖంగా దర్శనమిస్తే, వేదవల్లి అమ్మవారు తూర్పునకు అభిముఖంగా దర్శనమిస్తుంది. నారాయణుడు వేదాలను తిరిగి ఇచ్చిన స్థలం కావడంతో ఈ ప్రాంతం వేదపురి, వేదారణ్యక్షేత్రం, హరికంఠాపురంగా ప్రసిద్ధి చెందింది.

🔅 సూర్యపూజోత్సవం 🔅

👉 శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపంలో సముద్రంలో సంవత్సరాల తరబడి యుద్ధం చేసి వచ్చినందున స్వామి దివ్య శరీరానికి వెచ్చదనం కలిగించేందుకు సూర్య భగవానుడు తన కిరణాలను స్వామివారి మీద ప్రసరింపచేడమే సూర్యపూజోత్సవం.

👉 ప్రతి యేడు మార్చి 23, 24, 25 వ తేదీలలో సూర్య పూజోత్సవము మిక్కిలి వైభవంగా జరుగును.
ఉత్సవంలో ప్రధాన రాజగోపురం నుంచి 630 అడుగుల దూరంలో ఉన్న మూలవిరాట్‌పై సూర్యకిరణాలు నేరుగా ప్రసరిస్తాయి. మొదటి రోజు స్వామివారి పాదాలపై, రెండో రోజు నాభిపై, మూడో రోజు స్వామి శిరస్సుపై సూర్యకిరణాలు ప్రసరించి స్వామి దివ్యరూపాన్ని మరింత తేజోవంతం చేస్తాయి.

👉 26, 27, 28 వ తేదీలలో మూడు రోజులు తెప్పోత్సవాలు అత్యంత వైభవంగా జరుగును. అదే విధంగా చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి పది రోజులపాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. గరుడసేవా, రథోత్సవాలను కన్నుల పండగగా జరుపుతారు. 

👉వీటితోపాటు వైకుంఠ ఏకాదశి, రథసప్తమి, ఆండాళ్‌నీరాట్టు ఉత్సవాలు, నవరాత్రులు...ఇలా ప్రతి పర్వదినాన్నీ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.ఈ ఉత్సవాలకు ఇతర రాష్ట్రాలనుండి కూడా భక్తులు తండోప తండాలుగా వచ్చి దర్శనం చేసుకుంటారు.

👉 ప్రతిరోజు ముప్పూటలా నిత్య పూజలు జరుగును. ఈ ఆలయం 24/9/1967 వ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోనికి వచ్చింది. 
ఆ నాటి నుండి నిత్య, వార, వక్ష, మాస, సంవత్సరోత్సవాలు కన్నుల పండుగగా జరుగుచున్నవి

👉 శివకేశవులకు అభేదాన్ని తెలుపుతూ 15వ శతాబ్దంలో చోళరాజు ఈ ఆలయ ప్రాంగణంలోనే వేదనారాయణస్వామితో పాటు దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాడు.

👉 మూల విరాట్టు పాదభాగము మత్స్య రూపంలో ఉండగా, శంఖు, చక్రాలు ధరించిన మూర్తిని దేవేరులతో సహా దర్శించవచ్చు.

👉ఆలయ ద్వారంలో ఉన్న వినాయకుడి విగ్రహం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

👉 తిరుపతికి 68 కి.మీ., మద్రాసుకు 73 కిలోమీటర్ల దూరంలోని నాగలాపురంలో క్షేత్రం ఉంది.

No comments: