33వ జైమిని మహర్షి గురించి తెలుసుకుందాము
🌿బ్రహ్మ హృదయంలోంచి ఒక నాదం పుట్టింది . దాంట్లోంచి ఓంకారం పుట్టింది . ' అకార ఉకార మకారాలు కలిసి ఓంకారం ' . దీన్ని ప్రణవం అన్నారు .
🌸ఈ ప్రణవం వల్ల స్వరం , స్పర్శం , ఊష్మం అంతస్థం అనే లక్షణాలతో అక్షర సముదాయాన్ని కల్పించి నాలుగు నోళ్ళలోంచి నాలుగు వేదాలు చెప్పాడు బ్రహ్మ .
🌿అందులో సామవేదం మన జైమిని మహర్షి నేర్చుకున్నాడు . ఈయన గురువు వ్యాసభగవానుడు . ఒకసారి జైమిని మహర్షి మార్కండేయుడి ఆశ్రమానికి వెళ్ళి మునీంద్రా !
🌸మా గురువుగారు రాసిన మహాభారతంలో తెలియని కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలని వచ్చానన్నాడు .
🌿 మార్కండేయుడు ఇప్పుడు నేను నియమంలో ఉన్నాను , వింధ్య పర్వతం మీద పక్షిరాజులు పింగాక్షుడు , విరాటుడు , వృత్రుడు , సుముఖుడు నలుగురున్నారు .
🌸నువ్వు వాళ్ళని అడిగితే అంతా చెప్తారన్నాడు . ఈ నలుగురు పక్షిరాజులు కందుదుడు మదనికలకి పుట్టిన వాళ్ళు . శమీక మహాముని దగ్గర పెరిగారు .
🌿భారత యుద్ధం తర్వాత భీష్ముడు ధర్మరాజుకి చెప్పిన ధర్మాలన్నీ ఈ నాలుగు పక్షులు విన్నాయి . జైమిని మహర్షి ఆ పక్షుల గురించి వాటికి అంత జ్ఞానం ఎలా వచ్చిందీ చెప్పమని మార్కండేయ మహర్షిని అడిగాడు .
🌸 పూర్వం సుకృశుడికి నలుగురు పిల్లలు . సుకృశుడు సత్యనిష్ఠ కలవాడు . అతణ్ణి పరీక్షించాలని సుకృశుణ్ణి మాంసాహారం పెట్టమని పక్షిరూపంలో వచ్చి అడిగాడు ఇంద్రుడు .
🌿సుకృశుడు తన నలుగురు పిల్లల్ని
ఆ పక్షిరాజుకి ఆహారంగా వెళ్ళమని చెప్పాడు . వాళ్ళు ఇష్టపడలేదు . పక్షులై పుట్టమని శపించి
🌸 మళ్ళీ వాళ్ళ కోరిక మన్నించి , రూపం పక్షిదైనా సమస్త విద్యలు కలిగి , మనుష్య భాషలో మాట్లాడగలిగేలా కరుణించాడు సుకృశుడు .
🌿వాళ్ళే వింధ్యపర్వత ప్రాంతంలో ఉన్నారు . నీ సందేహాలన్ని తీర్చగల సమర్ధులు వెళ్ళిరా అన్నాడు మార్కండేయుడు .
🌸జైమిని వింధ్యపర్వతం మీదకి వెళ్ళి మార్కండేయ మహర్షి చెప్పినట్లు పక్షిరాజుల్ని చూసి నమస్కారం చేసి తను వచ్చిన పని చెప్పాడు .
🌿ఆ పక్షి రాజులు శ్రీనారాయణ వూహ చతుష్టయం , పాంచాలీ పంచక విషయం , ఇంద్రుడే అయిదు విధాలుగా పాండవులుగా పుట్టడం , బలరాముడి తీర్థయాత్ర , హరిశ్చంద్రోపాఖ్యానం , క్రోష్టుకి మార్కండేయుల సంవాదం ఇలాంటివి ఎన్నో చెప్పారు .
🌸దీన్నే ' మార్కండేయ పురాణం ' అంటారు . అన్ని విషయాలు తెలుసుకున్నాక జైమిని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు . సుబాహుడనే రాజు ధర్మపాలన చేస్తూ , హరి భక్తుడుగా ఉండేవాడు .
🌿అతనికి అస్సలు దానగుణం లేదు . ఏమయినా సరే దానం చెయ్యడంలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలియచెయ్యాలనుకుని అతడ్ని కలిశాడు జైమిని మహర్షీ !
🌸ముందు నేనడిగిన ప్రశ్నలకి జవాబు చెప్పండి అన్నాడు సుబాహు . అడగమన్నాడు జైమిని మహర్షి .
🌿సుబాహు అడిగాడు , స్వర్గం వల్ల మేలేమిటి ? కీడేమిటి ? స్వర్గంలో క్రూరులు , దొంగలు , నీచులు , పీనాసివాళ్ళు , కృతఘ్నులు ఇలాంటి వాళ్ళుండరు .
🌸అక్కడ రోగాలు , ముసలితనం , చావు వుండవు . తేజస్సుతో వున్న శరీరాల్తో , ధర్మంగా ఉంటూ చక్కటి భోజనం చేస్తూ సుఖాలు అనుభవిస్తూ వుంటారు .
🌿 పుణ్యం ఖర్చు అయిపోగానే మళ్ళీ మనిషి జన్మకి వచ్చేస్తారు అని చెప్పాడు జైమిని మహర్షి . మరి దానాలు చెయ్యడం పుణ్యం ఖర్చు పెట్టుకోవడం మళ్ళీ మనిషి జన్మ ఎత్తడం ఇవన్నీ ఎందుకని సుబాహుడడిగాడు .
🌸 రాజా ! దానం చేయక తప్పదు . దానం చెయ్యక పోతే ఆకలి , దాహంతో , బాధపడతారు . జ్ఞానం లేకుండా పోతుంది . అందుకే యజ్ఞాలు చేసే వాళ్ళు కూడ దాన ధర్మాలు చేస్తారు .
🌿 ఋషి కూడ తాను తెచ్చుకున్న బిక్షలోంచి ఒక భాగం బ్రాహ్మణుడికీ , ఒక భాగం ఆవుకీ , ఒక భాగం ప్రక్కనున్న వాడికీ పెడతాడు . దానం తప్పకుండా చెయ్యాలి అని జైమిని మహర్షి చెప్పాడు .
🌸ఒకనాడు జనమేజయరాజు జైమిని మహర్షిని మహాత్మా ! ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధం తర్వాత చేసిన అశ్వమేధయాగం గురించి చెప్పమన్నాడు .
🌿వ్యాసమహర్షి అశ్వమేధయాగం చెయ్యడానికి ఆజ్ఞ ఇచ్చింది మొదలు అంతా వివరంగా జనమేజయుడికి చెప్పాడు జైమిని . దాన్నే ' జైమిని భారతం ' అన్నారు .
🌸జైమిని మహర్షి ఒక అపూర్వ జ్యోతిషగ్రంథం , స్మృతి మీమాంస , ఛాందోగ్యానువాదమనే తంత్ర గ్రంథం , జైమినీయ శ్రేతసూత్రం , జైమనీయ గృహ్య సూత్రమనే గ్రంథాలు కూడా రాశాడు ...
🌿ఇదండి
జైమిని మహర్షి గురించి విషయాలు .. స్వస్తి..
No comments:
Post a Comment