Adsense

Wednesday, October 12, 2022

నేడు అచ్చ తెలుగు పండుగ - అట్లతద్దె.....!!

 

🌸గౌరీదేవి శివుని భర్తగా పొందాలనే కృత నిశ్చయంతో ఉందని త్రిలోక సంచారి అయిన నారదుడు తెలుసుకున్నాడు. ఆమె కోరిక ఫలించాలంటే అట్లతద్ది వ్రతం చేయమని నారదుడు సూచించాడు. ఆయన ప్రోద్బలంతో పార్వతీదేవి చేసిన వ్రతమే అట్లతద్ది.

🌿ఇది స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం. కన్నెపిల్లలు పడచువాణ్ణి పతిగా పొందాలనుకుంటే తప్పక ఆచరించవలసిన వ్రతమిది. అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి.

🌸ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దె ఆరట్లు ముద్దపప్పు మూడట్లు" అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వటం పరిపాటి.

🌿సాయం సమయమందు వాయినలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజకు వెళ్ళి, అటునుండి చెరువులలో కాలువలలో దీపాలను వదలి, చెట్లకు ఊయలలు కట్టి ఊగటం చేస్తుంటారు.

🌸త్రిలోక సంచారి అయిన నారదుని ప్రోద్బలముతో గౌరీదేవి శివుని పతిగా పొందగోరి తొలుతగ చేసిన విశిస్టమైన వ్రతమే ఈ అట్లతద్ది. స్రీలు సౌభాగ్యము కోసం చేసుకొనే వ్రతమిది.

🌿చంద్రారాధన ప్రధానమైన పూజ, చంద్రకళల్లో కొలువైవున్నశక్తి అనుగ్రహం చేత స్రీసౌభాగ్యము పెరుగుతుంది. కుటుంబములో సుఖశాంతులు వర్దిల్లుతాయని శాస్త్రవచనం. ఈ పండగలో అమ్మవారికి అట్లు నైవేద్యముగా పెట్టడములో ఒక అంతర్ధానముంది.

🌸నవగ్రహాలలోని కుజుడుకీ అట్లంటే మహాప్రీతి, అట్లను ఆయనకు నైవేద్యముగాపెడితే కుజదోషపరిహారమై సంసారసుఖములో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకము.

🌿రజోదయమునకు కారకుడు కనుక ఋతుచక్రం సరిగావుంచి ఋతు సమస్యలు రానివ్వకుండా కాపాడుతాడు. అందువలన గర్భదారణలోఎటువంటిసమస్యలుండవు. మినుములు పిండి, బియ్యము పిండి కలిపి అట్లను తయారుచేస్తారు.

🌸మినుములు రాహువునకు, బియ్యము చంద్రునకు సంబంధించిన దాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనముగా ఇవ్వాలి.

🌿గర్భస్రావము రాకుండా, సుఖప్రసవం అయ్యేందుకు దోహదపడుతుందికూడా. అందుకే ముత్తయిదువులకు అట్లను వాయనముగా ఇస్తారు.

🌸అట్లతద్దిలోని 'అట్ల'కు ఇంతటి వైద్యవిజ్ఞానము నిక్షిప్తం చేయబడివుంది.అట్లతద్ది పండుగను ఉత్తభారత దేశంలో 'కర్వా ఛౌత్' అనే పేరుతో జరుపుకుంటారు.
       
🌷
గోరింటాకు - 🌷

🌿అట్లతద్దికి ముందురోజున ఆడవారంతా కలిసి గోరింటాకుని పెట్టుకుంటారు. సంవత్సరంలో ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆషాఢమాసం, అట్లతద్ది వంటి సందర్భాలలో గోరింటను తప్పక పెట్టుకోవాలని పెద్దలు ప్రోత్సహిస్తూ ఉంటారు.

🌸ఆయాకాలాలలో ఉండే వాతావరణ పరిస్థితులే దీనికి కారణం. అక్టోబరు లేదా నవంబరు మాసాలలో వచ్చే అట్లతద్ది సమయానికి చలికాలం మొదలైపోతుంది. వాతావరణంలో తగినంత వేడి లేకపోవడం వల్ల రకరకాల చర్మవ్యాధులు దాడి చేసే ప్రమాదం ఉంటుంది.

🌿ముఖ్యంగా ఇంటిపనుల్లో నిమగ్నమై ఉండే ఆడవారు నిరంతరం తడిలో ఉండటం వల్ల వారి వేళ్లు, గోళ్లు నాజూకుదనాన్ని కోల్పోవడమే కాకుండా ఫంగస్‌ బారిన పడే అవకాశం ఉంది. దీనికి విరుగుడు గోరింటాకని ప్రత్యేకించి చెప్పేదేముంది.

🌸అయితే గోరింటాకు పెట్టుకున్న పడుచులు కుదరుగా ఉంటారని చెప్పలేం. ఎప్పుడెప్పుడు దానిని కడిగేసుకుందామా అన్న తొందరలో ఉంటారు. బహుశా వారిని అదుపు చేసేందుకే ‘గోరింట ఎంతబాగా పండితే అంత మంచి మొగుడు వస్తాడు’ అని ఊరిస్తారు కాబోసు.

🌷చల్దులు/చద్దన్నం- 🌷

🌿అట్లతద్ది ఉదయాన్నేలేచి గోంగూర, పెరుగుతో చద్దన్నం తినడంతో వ్రతం మొదలవుతుంది. సాధారణంగా ఏకాదశి వంటి ఉపవాస సమయాలలో ఉదయం లేదా అంతకు ముందు రోజు రాత్రి నుంచే ఉపవాసం మొదలవుతుంది.

🌸కానీ అట్లతద్దినాడు ఆడపిల్లలకు బోలెడు పనయ్యే! అందుకని వారు నీరసించి పోకుండా ఉండేందుకు ఈ ఫలహారం ఉపయోగపడుతుంది. పెరుగు కడుపుని చల్లగా ఉంచితే, ఆ పెరుగు వల్ల ఏర్పడే కఫానికి విరుగుడుగానూ, చలి వాతావరణాన్ని తట్టుకునేందుకూ గోంగూర ఉపయోగపడుతుంది.
                
🌷తాంబూలం- 🌷

🌿ఒకపక్క ఉపవాసం ఉంటూనే తాంబూల సేవనం చేసే ఆచారాన్ని కొంతమంది పాటిస్తారు. దీని వలన ఉపవాసంతో నోరు పొడిబారిపోకుండా ఉంటుంది.

🌸పైగా కడుపులో ఆహారం లేకపోతే చాలామందికి తలనొప్పి వస్తుంటుంది. తాంబూలం తలనొప్పికి దివ్యోషధం అంటుంది ప్రాచీన వైద్యం. ఇక తాంబూలానికి ఒంట్లో కొవ్వుని కరిగించే శక్తి కూడా ఉందట.

🌿తాంబూలాన్ని విలాసవంతులకు పరిమితమైన అలవాటుగా సమాజం భావిస్తుంటుంది. అలాంటి తాంబూలాన్నీ అట్లతద్ది రోజున ఆడవారంతా నిర్భయంగా వేసుకుంటారు.

🌸గోరింటతో ఎర్రగా పండిన చేతులతో, తాంబూలంతో ఎరుపెక్కిన అధరాలతో దేవకన్యలకు తీసిపోకుండా ఉంటారు
.

🌷ఊయలలూగడం- 🌷

🌿పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి ఊయలలూగాలని ఎందుకు అనిపించదు! ఇంట్లో ఆ సౌకర్యం లేకనో, ఉన్నా ఎవరన్నా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అన్న జంకుతోనో అణకువ పేరుతో తమ కోరికని  అణుచుకొని ఉంటారు.

🌸అలాంటి కోరికలకు రెక్కలనిచ్చేదే ఊయలూగే సంప్రదాయం. సాధారణంగా ఈ ఊయలలు ఆరుబయటో, తోటలోనో కడుతూ ఉంటారు. రోజంతా ఎలాంటి జంకూ లేకుండా ఊయలలూగుతూ, పాటలు పాడుకుంటూ ఆడవారంతా సంతోషంగా గడిపేస్తారు.
🌷అట్లు- 🌷

🌿అట్లతద్ది సాయంవేళ బియ్యం, మినప్పప్పు పిండితో అట్లు వేసి పదిమంది ముత్తయిదువలకు పదేసి అట్లను వాయినంగా ఇస్తారు. అట్లు కుజునికి ప్రీతికరం అనీ, ఇలా అట్లని దానం చేయడం వల్ల... వివాహానికీ, సంతానానికీ, ఐదోతనానికీ అవరోధాలు కలిగే కుజదోషాలు సమసిపోతాయనీ పెద్దలు చెబుతుంటారు.

🌸అదేమో కానీ మినుములు మాత్రం శరీరానికి తగినంత వేడినీ, బలాన్నీ అందిస్తాయి. కన్నె పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు, పెళ్లయినవారు సంతానాన్ని పొందేందుకు తగిన సత్తువని పొందేందుకు, గృహిణులు ఇళ్లలో పనులను చేసుకునేందుకు... మినుముల తగిన బలాన్ని అందిస్తాయి.

🌿ఇక అట్లతద్దికి పాడుకునే పాటలు ఇప్పటికీ తెలుగువారి సాహిత్యంలో భాగంగానే ఉన్నాయి. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్, చెమ్మచెక్క చారదేసి మొగ్గ... అట్లు పోయంగా ఆరగించంగా వంటి పాటలని గమనిస్తే ఒకప్పుడు అట్లతద్దిని ఎంత వైభవంగా జరుపుకొనేవారో తెలుస్తుంది.

🌸బాల్య వివాహాలు, ప్రసవ సమయంలో తల్లో బిడ్డో చనిపోవాల్సి రావడం, మగవారి ఆయుర్దాయం కూడా తక్కువగా ఉండటం వంటి సవాలక్ష సమస్యలు ఉన్న కాలంలో...

🌿తమకు ఈడైన భర్త రావాలనీ, పండంటి బిడ్డ కలగాలనీ, పసుపు కుంకుమలు క్షేమంగా ఉండాలనీ ఆడవారు కోరుకోవడం సహజమే కదా! ఇక క్షణం తీరికలేక, తీరిక ఉన్నా కట్టుబాట్లను కాదనలేక ఇంట్లోనే మగ్గిపోయేవారు పండుగ పేరుతో

🌸హాయిగా ఊయలలూగుతూ, ఆటలాడుతూ, పాటలు పాడుకుంటూ గడపడం సదవకాశమే కదా! అందుకే భక్తిపరంగానూ, భౌతికంగానూ వారి కోరికను ఈడేర్చే నోము అట్లతద్ది.

🌿కాలం మారి పట్టణాలు విస్తరించిపోయి, అట్లతద్ది జరుపుకునే తీరికా, ఓపికా ఇప్పుడు లేకపోయినా... తెలుగువారి సంస్కృతికి దర్పణంగా ఈ పండుగ నిలిచిపోయింది.

        🙏🌹 అట్లతద్ది కథ 🌹🙏

🌸పూర్వం ఒకప్పుడు ఒక రాజు కూతురు, మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురు ఎంతో స్నేహంగా కలిసి మెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. ఆరోజు అట్లతద్ది. రాత్రి చంద్రుడు ఉదయించాక చేసే పూజ కోసం వారు సన్నాహాలు చేసుకుంటున్నారు.

🌿పెద్దలంతా రాత్రికి దేవీ పూజ నైవేద్యం కోసం అట్లు వేయడంలో నిమగ్నులయ్యారు. ఇంతలో రాజుగారి కూతురు ఆకలితో సొమ్మసిల్లి పడింది. రాజకుమారుడు తన చెల్లి అవస్థ చూసి ఇంద్రజాలం చేశాడు.

🌸ఒక అద్దంలో తెల్లని వస్తువు చూపించి 'అదిగో చంద్రోదయమైంది. అమ్మా!కొంచెం పండ్లు తిని సేదతీరి పూజ చేసుకో' అన్నాడు. రాజకుమార్తె అన్నగారి మాట విశ్వసించి ఆహారం సేవించి పూజ చేసుకుంది.

🌿అయితే ఈ పూజ నియమం ఏమిటంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి 'చంద్రోదయ ఉమావ్రతం' అని పేరు వచ్చింది. ఆరోజు స్త్రీలు, దేవిని ఆరాధించి తొమ్మిది అట్లు నైవేద్యంగా పెట్టి, తొమ్మిది అట్లు వాయనం ఇచ్చి, తొమ్మిది పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు.

🌸ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. రాజకుమార్తె తన స్నేహితురాళ్ళతో అన్నీ యథావిథిగానే చేసింది. కానీ అన్న చెప్పిన మాట నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేసింది. ఆ రోజుల్లో ఆడపిల్లలకి బాల్యదశలోనే పెళ్లి చేసేవారు.

🌿ఆమెకు ముసలివాడు భర్తగా లభించాడు. “అయ్యో అట్లతద్ది నోము చేస్తే అందమైన భర్త లభిస్తాడన్నారు కదా! నా స్నేహితురాళ్ళకందరికీ మంచి యౌవనవంతులైన భర్తలు లభించారు. నేనేమి అపచారం చేశాను?” అంటూ దుఃఖించి పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించగా వారు ప్రత్యక్షమై" నీ అన్న అజ్ఞానం, నీ పై అతనికుండే ప్రేమవల్లనే వ్రతభంగం జరిగింది.

🌸రేపు ఆశ్వయుజ బహుళ తదియ, నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే నీ భర్త యౌవనవంతుడవుతాడు" అన్నారు. ఆమె ఆ నోము చేసి కథ చెప్పి అక్షింతలు తీసుకుని భర్తమీద వేసేసరికి అతడు యౌవనవంతుడయ్యాడు .

🌿కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరిన వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ తదియనాడు స్త్రీలంతా ఆనందోత్సాహాల్తో అట్లతద్ది జరుపుకుంటారు.

🌸అట్లతద్దికి ముందురోజును భోగి అంటారు. భోగినాడు స్త్రీలంతా చేతులకు, పాదాలకు, గోరింటాకు పెట్టుకుని ఎవరి చేయి బాగా పండిందని ఉత్సాహంగా చూసుకుంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి విశ్వాసం.

🌿ఒక పండుగ వస్తే, అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు.దాని కోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారు చేయటం ఒక పెద్ద కార్యక్రమం. అట్లతద్దినాటి అట్లు తినడానికి ఉవ్విళ్ళూరుతారు...స్వస్తి..

No comments: