Adsense

Monday, March 20, 2023

శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం (పంచ బలరామ ప్రతిష్టలు), గుంప, విజయనగరం జిల్లా

💠 సామాన్యంగా మనం దేవుడికి పళ్లు, కొబ్బరికాయను నైవేద్యంగా ఉంచుతాము. అయితే మరికొందరు కొన్ని తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి పూజిస్తారు. అయితే దేశంలో ఒకే ఒక దేవాలయంలో మాత్రం చేపల పులుసును నైవేద్యంగా అందజేస్తున్నారు.
ఆ దేవాలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు తదితర వివరాలన్నీ మీ కోసం...

💠 సాధారణంగా మనుష్యులు పుట్టిన తర్వాత సంప్రదాయాలు పుట్టాయని చెబుతారు. పురాణ కథనాలను అనుసరించి ఆ భక్త కన్నప్ప తాను తెచ్చిన వేట మాంసాన్ని ఆ పరమశివుడికి నైవేద్యంగా పెట్టిన విషయం మీకు ఇక్కడ గుర్తుకు రావచ్చు. అయితే పరమేశ్వరుడికి భక్తకన్నప్ప ఏ విధంగా అయితే మాంసాన్ని నైవేద్యంగా పెట్టారో ఇప్పటికీ ఈ పరమేశ్వరుడి ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా మాంసం పెట్టడం ఆనవాయితీగా వస్తోంది.

💠 భక్తులు భక్తితో ఏ నైవేద్యాన్ని సమర్పించిన వారి భక్తి భావానికి లొంగే పరమేశ్వరుడు భక్త కన్నప్ప సమర్పించిన మాంసాహారాన్ని కూడా నైవేద్యంగా స్వీకరించారనే విషయం మనకు తెలిసిందే.
అచ్చం ఇలాగే విజయనగరం జిల్లా కొమరాడు మండలం గుంప సంగమేశ్వర ఆలయంలోని స్వామివారికి భక్తులు నైవేద్యంగా చేపలను వండి, చేపల కూరను నైవేద్యంగా స్వామివారికి సమర్పిస్తారు.

💠 అయితే అవి ఆటవిక రోజులు కాబట్టి అలా జరిగింది అని మీరు భావించవచ్చు.
ఈ రాకెట్ యుగంలో కూడా ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరo జిల్లా కామరాడులో ఒక మహిమాన్విత దేవాలయం ఉంది.
దాని పేరే గుంప సోమేశ్వర స్వామి.

🔅 స్థల పురాణం 🔅

💠 సాక్షాత్తూ, బలరాముడు ప్రతిష్ఠించిన దివ్యలింగమది. ద్వాపరనాటి ఆ శైవక్షేత్రాన్ని దర్శించుకుంటే కాశీయాత్ర చేసినంత పుణ్యమని చెబుతారు.
విజయనగరం జిల్లా పార్వతీపురానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలోని గుంప సోమేశ్వరాలయానికి ఎంతో ఆధ్యాత్మిక ప్రశస్తి ఉంది.

💠 కురుక్షేత్రం...అటు...ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పాండవ మధ్యముడికి శ్రీకృష్ణుడు సారథ్యం వహిస్తున్నాడు. ఇటు...దుర్యోధన, దుశ్శాసన, కర్ణాదులు. భీష్మాచార్యుడు సర్వసైన్యాధ్యక్షుడి స్థానంలో బలగాల్ని నడుపుతున్నాడు. కొన్ని అక్షౌహిణుల సైన్యం పోరాడుతోంది. రక్తం ఏరులై ప్రవహిస్తోంది. వీరాధివీరులంతా ఒక్కొక్కరుగా నేలకూలుతున్నారు.

💠ఎన్నో యుద్ధాలతో ఆరితేరిన బలరాముడు అంతటివాడే, కురుక్షేత్ర సంగ్రామాన్ని చూసి చలించిపోయాడు. ఆ హాహాకారాలు వినలేకపోయాడు. మనశ్శాంతి కోసం తీర్థయాత్రలకు బయల్దేరాడు. వివిధ పుణ్యక్షేత్రాల్ని దర్శించుకుంటూ... నేటి విజయనగరం జిల్లాకు వచ్చాడు.
అప్పటికే, సాయంత్రమైంది. సంధ్యావందనానికి సమయం ఆసన్నమైంది. సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వాలంటే - నీళ్లు కావాలి. పరిసరాల్లో ఎక్కడా జలవనరులు కనిపించలేదు. దీంతో హలాయుధంతో నేలను చీల్చి గంగను రప్పించాడు. నాగలి వల్ల ఉద్భవించిన నదీమతల్లి కాబట్టి నాగావళి అన్న పేరొచ్చింది. 'లాంగుల్య' అనీ పిలుస్తారు.
నాగావళి తీరం వెంబడి, బలరాముడు పంచలింగాల్ని ప్రతిష్ఠించినట్టు చెబుతారు.

💠 ఒడిశాలోని పాయకపాడులో పాతాళేశ్వరుడు, శ్రీకాకుళం జిల్లా సంగంలో సంగమేశ్వరుడు, శ్రీకాకుళం సమీపంలో రుద్రకోటేశ్వరుడు, నాగావళి సముద్రంలో కలిసేచోట...కళ్లేపల్లిలో మణినాగేశ్వరుడు, నాగావళి- జంఝావతి సంగమ క్షేత్రంలో గుంప సోమేశ్వరుడు - బలరామ కరార్చిత లింగాలని ఐతిహ్యం.

💠 అక్కడ ప్రతి శివరాత్రి చాలా ఉత్సాహంగా జరుపుకొంటారు. శివరాత్రి రోజు పండ్లు, పలహారాలతో చాలా నిష్టగా పూజలు చేస్తాం. అటు పై భక్తికి జాగారణ కూడా చేస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఆ జంగమయ్యకు పాలు, పండ్లుతో పాటు చేపల కూరను నైవేద్యంగా సమర్పిస్తారు.
ఇదే ఇక్కడి విశేషం.

💠 ఈ దేవాలయంలో మాత్రం పవిత్రమైన పర్వదినాల్లో మాంసాహారాన్ని అందజేస్తారు.
ఈ ఆచారం చాలా ఏళ్ల నుంచి వస్తున్నట్లు స్థానికులు చెబుతారు. వందల ఏళ్ల నుంచి స్థానికులు పవిత్రమైన రోజుల్లోనే కాకుండా తమ ఇంట్లో శుభకార్యాలు జరిగే సమయంలో కూడా ఇటువంటి మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తూ వస్తున్నారు.

💠 శివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్సవాలను నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శివుడికి చేపలు కూర నైవేద్యం సమర్పిస్తారు. చేపలకూర కమ్మగా వండి శివుడికి నైవేద్యంగా పెడితే మనసులోని కోరికలు నెరవేరతాయనేది ఆ ప్రాంతంలోని ప్రజల నమ్మకం. తరతరాలుగా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నారు.
   
💠 ఆంధ్రప్రదేశ్ లో మాంసాహారాన్ని ముఖ్యంగా చేపల కూరను నైవేద్యంగా చెల్లించే ఆలయం ఇదొక్కటే. అయితే కేరళలో కొన్ని దేవాలయాల్లో మాంసాహారాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారం ఉంది. అయితే అక్కడ ప్రధాన దైవం పరమశివుడు కాకపోవడం ఇక్కడ గమనార్హం.

💠 జంఝవతి, నాగావల్లి నదుల మధ్యన గల కొంత ఎత్తైన ఇసుక దిబ్బ పైన గల సోమేశ్వరాలయం సాద-సీదగా దర్శనమిస్తుంది. స్వామి దర్శనముతో పునర్జన్మ ఉండదని భక్తుల నమ్మకం.

💠 విజయనగరం జిల్లా, పార్వతీపురం పట్టణంకు సుమారు 12 Kms. దూరాన శ్రీ గుంప సోమేశ్వరాలయం ఉంది.

No comments: