Adsense

Wednesday, June 15, 2022

శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి వారి దేవస్థానము : గుంతకల్ కసాపురం. (అనంతపురం జిల్లా)


🔅 నెట్టికంటి అనగా ఒక్క కన్ను కలవాడని అర్థం. విగ్రహంలో స్వామి కుడికంటితో భక్తులను చూస్తూ వారి వారి మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. కోరి కొలిచిన వారి బాధలను స్వామి వారు నివారణ మార్గాలను స్వప్నంలో సూచిస్తారు. ఆంజనేయస్వామి విగ్రహంలోని సాటిలేని తేజస్సు, అత్యంతాకర్షణ భక్త జనులను ముగ్ధుల్ని చేస్తున్నాయి. ఆంజనేయ స్వామి విగ్రహం తూర్పు ముఖమై దక్షిణ దిక్కు చూస్తూ భక్త జనుల మొరలు వింటూ వాళ్ళ బాధల్ని తీరుస్తూ ఉన్నట్లుగా ఉంది. స్వామి వారు దివ్యమంగళ సుందర విగ్రహాన్ని అభిషేక సమయంలో నిజరూప దర్శనంలో దర్శించవచ్చు.

👉శ్రీకృష్ణదేవరాయల గురువైన వ్యాసరాయలవారు ఏకకాలంలో కసాపురం, నేమకలు, మూరడి అనే మూడు ఊళ్లల్లో ఏకకాలంలో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్టించారని చెబుతారు.
 కసాపురం, నేమకల్లు, మూరడి అనే ఈ మూడు ఊళ్ళల్లోని ఆంజనేయస్వామి వార్లను శ్రావణమాసం శనివారం రోజున దర్శించుకోవడం అత్యంత విశేషఫలప్రదం అని చెబుతారు. 

👉నెట్టి కంటి ఆంజనేయస్వామి దేవాలయం, అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలోని కసాపురం అనే గ్రామంలో ఉన్నది. కన్నడంలో నెట్టె అంటే నేరుగా అని అర్థం: న్మౌకంటి అంటే నేరుగా చూచే కన్ను కలిగిన అని అర్థం. 

👉ఈ కసాపురంలో స్వామి వారి కుడివైపు రూపం మాత్రమే మనకు దర్శనమిస్తుంది.
 కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండటం వల్ల స్వామి తననే చూస్తున్నట్లు ప్రతివారికీ అనిపిస్తుంది. నేరుగా చూసే స్వామి కనుక నౌళికంటి ఆంజనేయస్వామి అని అంటారు. 
 భక్తులకు ఈయనే "కల్పతరువు", "వరప్రదాత" ప్రతిరోజు వేలాది మంది దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట గ్రహపీడ నివారణ క్షేత్రంగా ఖ్యాతికెక్కింది.

🌀ఆలయ చరిత్ర, ప్రశస్తి 🌀

👉విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీ.శ.1521 లో శ్రీ వ్యాసరాయలవారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవాడు. వ్యాసరాయలవారు చిత్రకారుడు. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఒక రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి రూపం చిత్రించేవాడు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడట.
 ఇది గమనించిన వ్యాస రాయలవారు హనుమంతుని శక్తిని వేరోకచోటికి వెళ్ళనీయకుండా, స్వామివారి ద్వాదశ నామాల బీజాక్షరాలతో ఒక యంత్రం తయారు చేసి, దానిలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూపాన్ని చిత్రించారట. దాంతో స్వామి ఆ యంత్రంలో బంధింపబడి అందులో ఉండిపోయారట.

👉ఇప్పటి కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామి వారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయస్వామి కలలో వచ్చి, "నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు" అని చెప్పాడట. ఆ ప్రాంతం ఎక్కడుందో ఉపదేశించమని వ్యాస రాయలు కోరగా స్వామి వారు ఈ విధంగా అనుగ్రహించాడు -
"దక్షిణం వైపున వెళితే ఒక ఎండిన ఒక వేప చెట్టు కనిపిస్తుంది, దానికి దగ్గరగా వెళితే ఆది చిగురిస్తుంది, అక్కడ భూమిలో తాను ఉంటాను". మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపు ప్రయాణం గావించి చివరకు ఆ ఎండిన వేపచెట్టును కనుగొంటాడు వ్యాస రాయలు. రాయలు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే, ఆ చెట్టు చిగురిస్తుంది. ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటి కన్ను గల ఆంజనేయస్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలవారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించి, ఆలయాన్ని నిర్మిస్తాడు.

👉శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కసాపురం గ్రామానికి దగ్గరలో ఉండడం వలన కసాపురం ఆంజనేయ స్వామి అని కూడా వ్యవహరిస్తారు. 
నెట్టికల్లులో ఆవిర్భవించినందున శ్రీస్వామి వారికి శ్రీనెట్టికంటి ఆంజనేయస్వామి అనే పేరు ప్రసిద్ధమైంది. 
నెట్టికల్లు అంటే మంచి రాయి.అనే అర్థం కూడా ఉంది.

👉 స్వామి వారి అనుగ్రహం ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, కార్తీక, మాఘ మాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు.

👉స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు. పక్క రాష్ట్రమైన కర్నాటక నుండి కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న హనుమాన్ ఆలయాలన్నింటిలోకీ పెద్దది.

👉ఏటా, నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమద్దీక్షలు తీసుకుంటారు.
 హనుమద్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి. 
ఇందులో బస చేయడానికి తగినన్ని సత్రాలు, కాటేజీలు అందుబాటులో ఉన్నాయి.......

No comments: