Adsense

Wednesday, June 15, 2022

శ్రీ రంగనాథ స్వామి దేవాలయం - ఆలూరుకోన (అనంతపురం జిల్లా)


🔅 భూలోకం సుభిక్షంగా ఉండడం కోసం, ప్రజలు ఆనందంగా జీవించడం కోసం, యాగాలనాచరించడమే కర్తవ్యంగా భావించి నిరంతరం భగవంతుడికి ప్రజలకు సేవలు చేసే సంకల్పమున్న మహార్షులు ఎందరో ఉన్నారు. వారి కోవకు చెందిన వారే విశ్వామిత్ర మహర్షి. 

👉ఒకసారి ఒక దట్టమైన వనంలో యాగం చేయడానికి సంకల్పించారు. ప్రజలు సంతోషంగా జీవించడం నచ్చని తాటకి అనే రాక్షక్షి తన  రాక్షసులను పిలిచి యాగాలను ఛిన్నా భిన్నం చేయమని ఆజ్ఞాపించింది. మారీచుడు,సుబాహు  తదితరులు మహర్పులు లోక సంరక్షణార్థం చేసే యాగాలను ప్రతీసారి ధ్వంసం చేసి మునులను ఇక్కట్లు పాలు చేసేవారు.

👉 ఎన్నిమార్లు యాగాన్ని మొదలు పెట్టినా ఏదో ఒక అవాంతరం వాటిల్లి యాగాన్ని లేకపోయారు మహర్షులు. 
ఈ అన్యాయాలకు తాటకి మూలకారకురాలని తెలుసుకున్నాడు విశ్వామిత్రుడు. 
తన దివ్య దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలు తెలుసుకున్నారు. 
వెంటనే అయోధ్యకు వెళ్ళి దశరధమహారాజుని కలుసుకుని తాటకి చేస్తున్న అక్రమాలను అరికట్టడానికి బాలురైన రామలక్ష్మణులను పంపి, లోకాన్ని రక్షించమన్నాడు విశ్వామిత్రుడు. 

👉బాలురైన రామలక్ష్మణులను రాక్షసిని సంహారం చేయడానికి పంపడానికి సంకోచించాడు దశరధమహా రాజు, రాజు వంశ కులకురువైన వశిష్టుడు ధైర్యం చెప్పగా బాలురను విశ్వామిత్రుని వెంట అడవులకు పంపాడు దశరధ మహారాజు.

👉రామలక్ష్మణులు తమ ధనస్సు తీసుకుని విశ్వామిత్రుడి వెంట యాగశాలఉన్న దట్టమైన అడవికి బయల్దేరారు. విశ్వామిత్రుడు మరో మారు యాగాన్ని ప్రారంభించాడు. తాటకి తన అనుచర రాక్షసులతో అక్కడికి వచ్చింది. అసుర సంహారం కోసం వచ్చిన రాముడు యాగాన్ని అపడానికి వచ్చింది ఒక స్త్రీ అని తెలుసుకొని వెనుకంజవేయగా, విశ్వామిత్రుడు భుజం తట్టి రాక్షసిపై విల్లు ఎక్కుపెట్టమని ఆజ్ఞాపించాడు. మహార్షి మాట కాదనలేక బాణము గురి పెట్టాడు రాముడు.

👉రాముని బాణం భారీకాయురాలైన తాటకికి తగిలి నేలకొరిగింది. వైకుంఠనాధుని చేత మరణం వాటిల్లినందువల్ల మోక్షం పొందింది. తాటకి సంహారం గురించి తెలుసుకున్న మిగిలిన అనుచరులు పరుగు లంఘించారు. యాగం మొదలైంది. నిరాటంకంగా సాగింది.

🌀 ఆలయ చరిత్ర 🌀

👉అసుర సంహార దోషపరిహారం కావించడానికి ఒక శివలింగాన్ని ప్రతిష్టించమని చెప్పారు విశ్వామిత్రుడు. తాటకిని సంహరించి, ఆమె ప్రాణాలు వదలిన స్థలంలో శివలింగాన్ని ప్రతిష్ట చేయడానికి నిశ్చయించుకుని తగిన చోటు కోసం వెదికాడు రాముడు.

👉పెన్నానది ఒడ్డున అడుగు పెట్టిన రాముడు ఒక చిన్న ప్రాంతంలో ఉన్న ఒక బుగ్గలో కైలాస నాధుడు స్వయంభువ లింగరూపంలో దర్శనమివ్వడంతో పరమానంద భరితుడయ్యాడు. 
పరుశురాముడు పూజించిన స్వయంభవు లింగం అదే అని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆ లింగాన్ని అక్కడే ప్రతిష్ట చేయమని చెప్పాడు.
 ఆ లింగాన్ని ప్రాణ ప్రతిష్ట చేసి పూజలు భక్తితో చేశాడు రాముడు. అసుర సంహారం వల్ల అదీ ఒక స్త్రీని సంహరించినందువల్ల పొందిన దోషం పరిహారమయ్యింది.
 ఆ తర్వాత అయోధ్యకు వెళ్ళే మార్గంలో విశ్వామిత్రుడి మార్గదర్శకత్వంలో రాముడు జనక మహారాజు కుమార్తె జానకిని స్వయంవరంలో గెలిచి పరిణయమాడాడు శ్రీరాముడు.

👉తాటకికి మోక్షం శ్రీరాముడి పరిణయం ఈ దృశ్యాలన్నిటిని విశ్వామిత్రుడు తన దివ్యదృష్టితో ఏనాడో తెలుసుకున్న విషయాలు. తాటకికి మోక్షప్రాప్తి లభించిన చోటే ఈనాడు తాడిపత్రిగా పరిగణించబడుతుంది. 
ఇక్కడ రాముడు ప్రాణప్రతిష్ఠ చేసి పూజించిన లింగాన్ని రామలింగం అంటారు.

🌀 ఆలయ నిర్మాణం 🌀

👉పురాణకథ ప్రకారం ఈ పుణ్యక్షేత్రం 14వ శతాబ్ధంలో పాలించిన ఎర్రమ్మ తిమ్మరాజు అనే రాజు ఆలయాన్ని నిర్మించాడు.
 ఆ ఆలయంలో తాటకికి మోక్షానిచ్చిన వైకుంఠవాసుడు శ్రీరాముడికి కులదైవమైన శ్రీరంగనాధుని విగ్రహన్ని ప్రతిష్టించారు. 
కొండపై చిన్న ఆలయద్వారం దాకా మనం వాహనాల్లో వెళ్ళగలిగేంత సౌకర్యంగా ఉన్నాయి రహదారులు.

👉తమ కోర్కెలు తీర్చే ఈ దేవుడికి ముడుపులు చెల్లించడానికి ఎందరో భక్తులు అనంతపురం, ధర్మవరం, బళ్ళారి, కదిరి, నుండే కాక ఆంధ్ర రాష్ట్రములో పలు చోట్ల నుండి కూడా వస్తారు. 

🔅 ప్రత్యేక కార్యక్రమాలు :- 

👉ప్రతి సంవత్సరమూ చైత్రంలో బ్రహ్మోత్సవము జరుగుతుంది. 
ధ్వజారోహణ, సింహవాహనము, హనుమాన్‌ వాహనములపై స్వామి వారి ఊరేగింపు పురవీధులలో జరుగుతుంది. 
రధోత్సవము, కళ్యాణోత్సవము మొదలైనవి చాలా ఘనంగా జరుగుతున్నాయి.


🔅 ఎలా వెళ్ళాలి?

👉తాడిపత్రి నుండి ఆరు కి.మీ. దూరంలో ఉన్న ఆలూరు కోన దట్టమైన అడవిలో పక్షులు కిలకిలరావాలు మధ్య ప్రయాణం చేయాలి. సహజమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ కోనను చేరుకోవచ్చు.

No comments: