Adsense

Wednesday, June 15, 2022

బోలికొండ శ్రీ మాణిక్యం రంగనాథ స్వామి ఆలయం : తొండపాడు (అనంతపురం జిల్లా)



🔅 రాయలసీమలోని సుప్రసిద్ధ దేవాలయాలలో బోలికొండ రంగనాథ క్షేత్రం ఒకటి. శేషతల్పంపై శయన ముద్రలో, నయన మనోహరంగా దర్శనమిచ్చే దివ్యమంగళ స్వరూపూడు శ్రీ మాణిక్యం రంగనాథస్వామి. 
ఏడుకొండల వేంకటరమణుని వలే, అత్యంత మహిమాన్వితమైన స్వామిని వేలాదిమంది భక్తులు దర్శించుకుని. భక్తిభావంతో తాదాత్మ్యం చెందుతుంటారు.

👉అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం నుంచి గుత్తి పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారిలో గుత్తి పట్టణానికి సుమారు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో 'తొండపాడు' గ్రామం ఉంది. ఆ గ్రామ ప్రధాన రహదారి ప్రక్కనే ఆలయం దర్శనమిస్తుంది. ఈ ఆలయానికి ఎదురుగావున్న దారిగుండా సుమారు ఒక కిలోమీటరు దూరం కొండ ఎక్కి వెళ్తే కొండపైన “బోలికొండ మాణిక్యం రంగనాథస్వామి” ఆలయం వుంది.

⚜ మహర్షుల కోరిక మేర వెలసిన స్వామి ⚜

👉స్వామివారు కొలువై వున్న కొండకు “శ్వేతగిరి అని పేరు. తెల్లటి రాళ్ళు ఉన్నటువంటి కొండ కనుక దీనికి 'శ్వేతగిరి' అనే పేరు ఏర్పడిందని చెప్తారు. ఆ కొండకే 'బోలికొండ' అని పేరు. కొండపైన తెల్లటి పొడలు వచ్చినట్లుగా (బొల్లి) ఉండడం మూలంగా ఆ కొండకు “బోలికొండ” అనే పేరు ఏర్పడిందని కూడా ప్రచారంలో ఉంది. బోలికొండ మీద కొలువైవున్న రంగనాథస్వామి కనుక “బోలికొండ మాణిక్యం రంగనాథస్వామి” అనే పేరు ఈ స్వామికి వచ్చినట్లు కథనం. 
దీన్ని పల్లికొండ అని కూడా పిలుస్తారు.

👉శ్రీ మహావిష్ణువు ఒకసారి భూలోక విహారం చేస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడట. ఈ ప్రాంతంలోని అరణ్యంలో సంచరించి, ప్రకృతి రమణీయ దృశ్యాలను చూస్తూ ఆ కొండ పైన ఒకచోట విశ్రమించారు. అయితే ఈ ప్రాంతంలోని అడవులలో, అప్పటికే ఋషులు ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. శ్రీ మహావిష్ణువు విశ్రమించిన విషయాన్ని గమనించిన మహర్షులందరూ స్వామిని సమీపించి నమస్కరించి భక్తితో స్వామి వారిని కొలిచారు. మహర్షుల భక్తిని, దీక్షను మెచ్చుకున్న శ్రీమహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమన్నాడు.

👉అందుకు - "స్వామి! అద్భుతమైన ఈ కొండపైన కొలువుదీరి, తమ ముందు ప్రశాంతంగా తపస్సు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించండి. అంతేకాకుండా, ఈ భూలోకంలో ప్రజలు జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కుని అనేక బాధలు పడుతున్నారు. వారికి దగ్గరగా ఈ కొండపై మీరు అవతరిస్తే మిమ్ములను దర్శించుకుని పూజలు చేసి ముక్తిని పొందుతారు. కాబట్టి ప్రజలకు దగ్గరగా ఈ కొండపై అవతరించాలన్నదే మా కోరిక” అని మహర్షులు శ్రీ మహావిష్ణువును కోరారు. మహర్షుల కోరికను అంగీకరించిన శ్రీ మహావిష్ణువు బాలికొండపైన శ్రీ మాణిక్యం రంగనాథస్వామిగా కొలువు దీరినట్లు స్థలపురాణం వల్ల తెలుస్తుంది. 
ఈ స్వామిని భక్తులు బాలికొండ రంగస్వామి, రంగనాయకులు అని కూడా పిలుస్తూ ఉంటారు.

👉కొండపైన గల ఆలయంలో వెలసిన శ్రీరంగనాథస్వామి వారి రూపం స్పష్టంగా కనిపించదు. శ్రీరంగనాథుడు పుట్టుశిలగా వెలసినట్లు చెప్తారు. 

👉దక్షిణాభిముఖంగా ఉన్న మాణిక్యం రంగనాథస్వామి వారి  ఆలయం  ముఖమండపం, గర్భాలయాలను కలిగివుంది. ప్రధాన గర్భాలయంలో శ్రీరంగనాథస్వామి శేషతల్పంపై శయనించి, భక్తులపై తన చల్లని చూపులను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తాడు. స్వామివారి చరణముల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చుని వుంటారు. స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడిని, స్వామివారి ముందు వైపునగల ఉత్సవ విగ్రహాలను దర్శించుకొనవచ్చు. 

👉ఈ రంగనాథస్వామికి “మాణిక్య రంగనాథస్వామి” అని పేరు. పవిత్రమైన హృదయాలతో ఈ స్వామిని సేవిస్తే కోరికలన్నీ తీరుతాయని ఈ ప్రాంత భక్తుల నమ్మకం. ఈ ప్రాంతవాసులు తమ సంతనానికి ఈ స్వామివారి పేరును పెట్టడమే కాకుండా, ఏ శుభకార్యమైనా ఈ స్వామి సన్నిధిలో నిర్వహించుకుంటూ ఉండడం, శ్రీరంగనాథస్వామి వారు భక్తుల పట్ల చూపిస్తున్న కరుణా కటాక్షాల వల్లనే అని స్థానికులు గొప్పగా చెప్పుకుంటారు. భక్తితో ఈ స్వామిని సేవిస్తే పాపాలు నివారించబడి అనంతమైన పుణ్యాలు సిద్ధిస్తాయని, పునర్జన్మ నుండి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.

👉'తాడిపత్రి - గుత్తి' ప్రధాన రహదారిలో వున్న తొండపాడు వద్ద బస్సులు ఆగుతాయి.

No comments: