Adsense

Wednesday, June 15, 2022

శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం : కదిరి (అనంతపురం జిల్లా)



🔅 దేశంలోని ఉన్న ఆలయాలలో కొన్ని నిర్మించినవైతే, మరికొన్ని స్వయంభువుగా వెలశాయని పురాణాల్లో తెలిపారు. 
ఈ స్వయంభువ విగ్రహాల రహస్యాలను వేలాది ఏళ్లుగా తెలుసుకోవడానికి ఎంతోమంది ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్నీ నిష్ఫలమయ్యాయి. వీటిని వెనుక దైవం ఉన్నాడని భావించిన భక్తులు పూజిస్తూ, తమ కోరికలను తీర్చమని వేడుకుంటున్నారు. 

👉మన దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో నరసింహస్వామి ఆలయాలు మనకు దర్శనం కల్పిస్తాయి.
ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో స్వామివారికి ఎన్నో పుణ్య క్షేత్రాలు కొలువై ఉన్నాయి.
ఈ విధంగా ఎన్నో ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినదే కదిరి నరసింహ స్వామి ఆలయం

👉అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఉంది మహిమాన్వితుడిగా పేరుమోసిన నరసింహస్వామి కొలువైన ఆలయం. 

👉ఆలయానికి పశ్చిమాన ఉన్న గోపురం వెనుక భాగంలో ఓ కోనేరు ఉంది. దీన్ని భ్రుగుతీర్థమని పిలుస్తారు.

🌀 పౌరాణిక ప్రాశస్త్యం 🌀

👉అటు మనిషితోగానీ, జంతువు, ఏ ఆయుధంతోనూ మరణం లేకుండా వరం పొందిన హిరణ్యకసిపుడు ఆగడాలకు అంతే లేకుండా పోయింది. విష్ణు భక్తులను హింసిస్తూ, చివరికి తనయుడు ప్రహ్లదుడిని కూడా విడిచిపెట్టలేదు.
నరసింహుడి రూపంలో  వచ్చిన శ్రీమహావిష్ణువు  హిరణ్యకసిపుని  సంహరించారు. ఇది జరిగిన ప్రదేశం అహోబిలం . 

👉హిరణ్యకశిప సంహారం తర్వాత కూడా స్వామి ఆగ్రహం చల్లారకపోవడంతో ఘీంకారం చేస్తూ కదిరికి రెండు కిలోమీటర్ల దూరంలోని ఓ పర్వతానికి చేరుకున్నాడు. దీన్ని గమనించి దేవతలు ప్రహ్లాదుడితో సహా ఈ పర్వతం పైకి వచ్చి స్వామిని శాంతిపజేయడానికి అనేక స్త్రోత్రాలను పఠించారు. దీంతో నరసింహుడు శాంతించాడు, దేవతలు స్త్రోత్రాలను పఠించడం వల్లే ఈ పర్వతానికి స్త్రోత్రాద్రి అని పేరు వచ్చింది.

🔅 ఈ కదిరి ఆలయంలో కొలువై ఉన్న స్వామివారి పేరే కాటమరాయుడు.
అసలు ఈ ఆలయంలో ఉన్న స్వామివారికి
కాటమరాయుడు అని పిలవడానికి గల కారణం ఏమిటి? 

👉కాటమ అంటే అడవి, రాయుడు అంటే అధిపతి. అడవికి అధిపతి సింహం. సింహం శిరస్సు ఉన్నందునే ఖాద్రి నరసింహుడికి కాటమరాయుడు అని పేరు వచ్చింది. 
' బేట్రాయి సామిదేవుడా! నన్నే లినోడు! బేట్రాయి సామి దేవుడా! కదిరి నరసింహుడా! కాటీమరాయడా!' అనే జానపదులు,చెలగి కదిరిలో శ్రీ వేంకటాద్రిమీద యెలగేటి చక్కటి రమణశ్రీ అన్న కీర్తనల్లోని నృసింహస్వామి ప్రాశస్తాన్ని కళ్ళారా చూడాలంటే ఈ ఆలయాన్ని సందర్శించాల్సిందే.
    
👉ఇక్కడి ఆలయంలోని నృసింహస్వామి, అమృతవల్లి, తాయారు, ప్రహ్లాదులతో కలిసి దర్శనమిస్తారు. 

👉 'ఖ' అంటే విష్ణుపాదము. 'అద్రి' అనగా కొండ. అందుకే ఈ పట్టణానికి ' ఖద్రి' అనే పేరు వచ్చి కాలక్రమేణా కదిరిగా రూపాంతరం చెందిందని చెబుతారు. ఇప్పటికీ కదిరి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై కనిపించే పాదాల గుర్తులను విష్ణుపాదాలుగా విశ్వసిస్తారు. వేదారణ్యమైన ఈ ప్రాంతంలో 'ఖదిర (సంద్ర) వృక్షాలు అధికంగా ఉండడంతో ఈ పట్టణానికి కదిరి అని పేరు వచ్చిందని ప్రచారంలో ఉంది.

👉చారిత్రిక, పురాణ ప్రాముఖ్యత కలిగిన ఈ క్షేత్రంలో మూలవిరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు. 

👉ఏటా ఫాల్గుణ మాసంలో బహుళ పంచమినాడు ఇక్కడ జరిగే రథోత్సవం సందర్శకుల్ని విశేషంగా ఆకర్షిస్తుంది.
రథోత్సవం సమయంలో స్వామివారి రథంపై దవనం, మిరియాలు, పండ్లు చల్లుతుంటారు. కిందపడిన వీటిని ఏరుకొని తింటే సర్వరోగాలూ నయమవుతాయని భక్తుల విశ్వాసం. బ్రహ్మెత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఫాల్గుణ బహుళ పౌర్ణమిని కదిరి పున్నమిగా జరుపుతారు. ఆ రోజు భక్తులు ఉపవాసముంటారు. 
ఈ పున్నమి రోజు స్వామివారికి ఎంతో ఇష్టమైన దవనము సమర్పించడం ద్వారా స్వామివారు ప్రీతి చెందుతారని భావిస్తారు.

👉వసంతఋతువులో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం వల్ల స్వామివారికి వసంత వల్లభుడు అనే పేరుతో కూడా పిలుస్తారు.

👉వైఖాసన ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ ప్రతిరోజు స్వామి వారికి పూజలు నివేదన,  సర్వదర్శనం, సాయంకాల నివేదన, తర్వాత మళ్ళీ సర్వదర్శనం ... ఈ క్రమంలో ఆలయల్లో ప్రతిరోజు కార్యక్రమాలు జరుగుతాయి.

👉అన్ని మతాలవారూ కదిరి నరసింహస్వామిని ఆరాధించడం ఈ ఆలయం వైశిష్ట్యం హిందూ, ముస్లీం, క్రైస్తవులందరూ మతాలకతీకంగా ఇక్కడ జరిగే బ్రహెర్మాత్సవాల్లో పాల్గొని, పూజలు నిర్వహించడం విశేషం.

No comments: