Adsense

Thursday, October 27, 2022

38వ మహర్షి.. దక్ష మహర్షి

 మన మహర్షుల చరిత్రలు..
38వ దక్ష మహర్షి గురించి తెలుసుకుందాం


🌿దక్షమహర్షి  పరమేశ్వరుడి మావగారు . ఇంతకన్నా గొప్పతనం ఏముందీ ....

🌸బ్రహ్మ మానసపుత్రులు తొమ్మండుగురు . భృగువు , మరీచి , అంగిరసుడు , వసిష్ఠుడు , దక్షుడు , అత్రి . పులస్త్యుడు , పులహుడు , క్రతువు
వీళ్ళంతా బ్రహ్మ మానస పుత్రులు .

🌸బ్రహ్మ కుడి బొటన వ్రేలి నుంచి మన దక్షమహర్షి పుట్టాడు . దక్షుడు మనువు కూతురు ప్రసూతిని పెళ్ళి చేసుకున్నాడు .

🌿అతనికి పదహారు మంది కూతుళ్ళు కలిగారు . వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ వల్ల మనవల్ని కూడ పొందాడు

🌸దక్షుడికి యాభయిమంది కూతుళ్ళని కూడా చెప్తారు . అందరినీ గొప్పవాళ్లకిచ్చి పెళ్ళి చేశాడు . ఇప్పుడు దక్షుడి గురించి తెలుసుకుందాం .

🌿దక్షమహర్షి విష్ణుమూర్తి గురించి తపస్సు చేసి సృష్టి చెయ్యడానికి తగిన శక్తి నిమ్మని ఎన్నో రకాల జీవరాసుల్ని సృష్టించాడు .

🌸కాని వాటి వంశాలు పెరగలేదు . బ్రహ్మని అడిగాడు వంశాలు వృద్ధి పొందట్లేదు , ఏం చెయ్యాలని . బ్రహ్మ దక్షుణ్ణి పెళ్ళి చేసుకోమన్నాడు .

🌿దక్షుడు వరుణ ప్రజాపతి కూతురు అసిక్నిని పెళ్ళి చేసుకున్నాక అయిదువేల మంది కొడుకులు కలిగారు .

🌸దక్షుడు కొడుకులందర్నీ పిలిచి మీరందరూ పెళ్ళి చేసుకుని వంశాన్ని వృద్ధి చెయ్యమన్నాడు . వాళ్ళు సరేనని వెళ్ళారు కానీ , ఏమయ్యారో దక్షుడికి తెలియలేదు .

🌿దక్షుడు మళ్ళీ వైతరణిని పెళ్ళి చేసుకుని వెయ్యిమంది కొడుకుల్ని పొంది వాళ్ళకి కూడ వాళ్ళ అన్నలకి చెప్పినట్లే చెప్పి పంపాడు .

🌸వాళ్ళు కూడా తిరిగి రాలేదు . దక్షుడికి మళ్ళీ వైతరణి వల్ల అరవై మంది కూతుళ్ళు పుట్టారు .

🌿వాళ్ళందరికి పెళ్ళి చేసి సృష్టి పెంచాడు . తన కొడుకుల్ని తపస్సు చేసికొని గొప్పవాళ్ళె పెళ్ళి చేసుకుని సృష్టి చెయ్యమంటే కనిపించకుండా అయిపోడానికి కారణం

🌸నారద మహర్షినని తెలిసి నారదుడ్ని కీర్తి నాశనమవుతుంది , నువ్వు అందరితో కలహ భోజనుడని పిలిపించుకుంటావు .

🌿నువ్వు ఏ లోకానికెళ్ళినా ఉండే చోటు లేక నిత్య సంచారిగా ఉంటావని శపించాడు దక్షుడు .

🌸ఈ రోజునుండి వురుషుడు విషయ సుఖాన్ని అనుభవిస్తేనే కానీ జ్ఞానాన్ని పొందలేడు అని కూడా చెప్పాడు దక్షుడు .

🌿దక్షుడి కూతుళ్ళని పెళ్ళి చేసుకున్న చంద్రుడు అందర్ని సమానంగా చూడకుండా రోహిణిని మాత్రమే ప్రేమగా చూస్తున్నాడని మిగిలిన కూతుళ్ళ వలన తెలుసుకుని చంద్రుణ్ణి

🌸క్షయరోగివి , పిల్లలు లేనివాడివి అవమని శపించాడు దక్షుడు . దక్షుణ్ణి క్షమించమని అడిగాడు చంద్రుడు .

🌿దక్షుడు మళ్ళీ చంద్రుడి కళలన్నీ ఉండేటట్లు అనుగ్రహించాడు . తన భార్యలవల్ల పిల్లలు పుట్టలేదు కానీ , తార వల్ల బుధమహర్షి పుట్టాడు చంద్రుడికి .

🌸బ్రహ్మ ఒకసారి సత్రయాగం చెయ్యాలనుకుని అందర్నీ పిలిచాడు . విష్ణు మహేశ్వరులు , ఇంద్రుడు మిగిలిన దేవతలు , ఋషులు అందరూ వచ్చి కూర్చున్నారు .

🌿దక్షుడు కూడ యజ్ఞం చూడ్డానికి వచ్చాడు . అతడు రాగానే అందరూ లేచి నుంచున్నారు కానీ , బ్రహ్మ , ఈశ్వరుడు లేవలేదు .

🌸దక్షుడికి తగిన సత్కారాలు , పూజలు అన్నీ అయ్యాక లేచి నన్ను చూసి కూడ శివుడు లేవలేదు . శివుడికి పొగరెక్కువ ,

🌿అల్లుడినన్న గర్వం , శూద్రుడికి వేదాలిచ్చినట్లు వీడికి నాపిల్లనిచ్చాను . కనీసం పలకరించలేదు కాబట్టి ఇంద్రాదుల్లో వున్నా కూడా ఇతనికి యాగభాగం అందకుండా ఉండాలని శపించాడు .

🌸సభలో వాళ్ళు దక్షుణ్ణి ఇది తప్పనివారిస్తే దక్షుడు లేచి వెళ్ళిపోయాడు . నందికేశ్వరుడు దక్షుణ్ణి శపించాడు .

🌿భృగుమహర్షి లేచి నందిని శపించాడు . ఇలా ఒకళ్ళ నొకళ్ళు శపించుకున్నారు . కాకపోతే అందరూ గొప్పవాళ్ళే కదా ఎవరికీ ఏమీ జరక్కుండా అందరూ బాగానే ఉన్నారు .

🌸ఇవన్నీ చూసిన విష్ణుమూర్తికి మాత్రం బాధనిపించి వెళ్ళిపోయాడు . అయినా ఒకళ్ళనొకళ్ళు ఇలా శపించేసుకుంటే వాళ్ళ పెద్దరికం ఏమయినట్లు .....

🌿దక్షుడికి శివుడికి మధ్య మాత్రం శతృత్వం పెరుగుతూనే ఉంది . పరమేశ్వరుడు లేకుండా యాగం ఉండదని తెలిసికూడా

🌿దక్షుడు వెంటనే బృహస్పతి యాగం ప్రారంభించాడు .
దాన్ని చూడ్డానికి మునులు , ప్రజాపతులు , దేవతలు , అందరూ వెడుతూ ఆకాశమార్గంలో ఆ యాగం గురించే చెప్పుకుంటున్నారు .

🌸దక్షుడి కూతురు , శివుడి భార్య అయిన " సతీదేవి ” భర్తని చూసి మనమూ వెడదాం అంది . సతీ ! నువ్వు దక్షుడి కూతురివే అయినా నా భార్యవి కనుక నిన్ను అవమానిస్తారు .

🌿ఆ అవమానం భరించడం కంటే చావడమే మంచిదనిపిస్తుంది , వెళ్ళద్దు అన్నాడు శివుడు . కాని సతి తల్లిదండ్రుల్ని , అక్క చెల్లెళ్ళని చూడాలని దక్షుడి యజ్ఞశాలకి వెళ్ళింది .

🌸తల్లి అక్క చెల్లెళ్ళు ఆమెని పలకరించారు . దక్షుడు మాత్రం అవమానపరిచాడు . తండ్రీ ! లోకంలో జీవులందరికీ ఇష్టుడైన ఈశ్వరుడికి ఇష్టమైన వాళ్ళు , ఎక్కువయినవాళ్ళు అని ఉండరు .

🌿అలాంటి పరమేశ్వరుణ్ణి నువ్వు నిర్లక్ష్యం చేశావు కనుక నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తున్నానని యోగమార్గంలో అగ్నిని సృష్టించుకుని దగ్ధమయిపోయింది సతీదేవి .

🌸దేవతల ప్రార్థనలు విన్న
శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి..

🌿శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.
శ్రీ మహావిష్ణువు ఖండించగా సతీదేవి శరీర భాగాలు మహా శక్తిపీఠా ప్రదేశాలే
దక్షుడు వల్ల శక్తి పీఠాలు ఏర్పడటానికి కారణం చెబుతారు

🌸శివ భక్తులు కోపంతో దక్షుణ్ణి చంపబోతే భృగు మహాముని వాళ్ళందర్ని తరిమి కొట్టించాడు .

🌿ఈ సంగతి విన్న శివుడు కోపంతో తన జటాజూటం నుంచి ఒక వెంట్రుక తీసి వీరభద్రుడ్ని సృష్టించి దక్షయజ్ఞం నాశనం చెయ్యమన్నాడు .

🌸వీరభద్రుడు వీరావేశంతో వెళ్ళి దక్షుణ్ణి అతని అనుచరుల్ని చంపి , యజ్ఞం నాశనం చేసి దక్షుడి తల నరికి కైలాసానికి వెళ్ళాడు .

🌿బ్రహ్మ విష్ణు దేవతలు కైలాసానికి వెళ్ళి శివుడితో దక్షుణ్ణి బ్రతికించ మన్నారు . మేక ముఖం కలవాడుగా దక్షుణ్ణి బ్రతికించాడు శివుడు .

🌸దక్ష మహర్షి పరమేశ్వరుణ్ణి చూసి క్షమాపణ అడిగాడు . అందరూ కలిసి యజ్ఞం పూర్తి చేయించి దక్షుణ్ణి దీవించి వెళ్ళిపోయారు .

🌿దాక్షాయణి అయిన సతీదేవి మళ్ళీ హిమవంతుడికి మేనక వలన పుట్టి శివుణ్ణి పెళ్ళి చేసుకుంది . దక్షుడు రాసిన ధర్మశాస్త్ర గ్రంధానికి ' దక్షస్మృతి ' అని పేరు దాంట్లో ఏడు అధ్యాయాలున్నాయి .

🌸మొదటి అధ్యాయం చతురాశ్రమ వర్ణన గురించి , రెండవ అధ్యాయం ఉదయాన్నే లేచి చెయ్యాల్సిన కార్యక్రమాల గురించి , మూడవ అధ్యాయం గృహస్థాశ్రమం గురించి , నాలుగవది భార్యభర్తల ధర్మాల గురించి ,

🌿అయిదవది చెయ్యవలసిన పన్లు చెయ్యకూడని పన్లు , ఆరవది పుట్టుకకి మృత్యువుకి సంబంధించిన మైలల గురించి , ఏడవ అధ్యాయం యోగం గురించి చెప్పబడింది .

🌸దక్షుడు బ్రహ్మమానసపుత్రుడై సృష్టికార్యంలో బ్రహ్మకి సహాయం చేసి అన్ని జీవరాసుల సృష్టిని పెంచాడు . మనిషి గర్వంతో పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో మనకి తెలియచెప్పాడు .

🌿దక్షస్మ్మతి అనే పేరు గల గ్రంథం మనిషి జీవితాన్ని ఎలా గడపాలి అన్నది ప్రతి అధ్యాయంలోనూ ప్రతి విషయం ప్రజలకి తెలిసేలా వ్రాసి మనకి అందుబాటులోకి తెచ్చాడు .

🌸ఇదండీ దక్ష మహర్షి గురించి  స్వస్తి.

No comments: