Adsense

Sunday, May 14, 2023

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ....!!

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత ....!!


🌿హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా,

🌸 మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.

🌿పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు... అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు...

🌸వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించ గలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి.

🌿 భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు.

🌸ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని పూజించాలి

🌿హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు.

🌸లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు.

🌿 దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.

🌹హనుమంతుని నైజం🌹

🌷
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
🌷

🌸శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.

🌿కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు.

🌸 ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు.

🌿హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

🌸 చైత్ర పౌర్ణిమ నుండి  వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

🌿ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది.

🌸 సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజు స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీకరించడం వలన చక్కటి సంతానం హనుమ అనుగ్రహంతో కలిగి తీరుతుంది
...స్వస్తీ..

No comments: