Adsense

Monday, May 15, 2023

శ్రీ జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా

శ్రీ  జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా

💠 శివుడు సాగర మథనంలో ఎగజిమ్మిన గరళాన్ని మింగి గరళకంఠుడయ్యాడు.
భూలోక వాసుల దాహార్తిని తీర్చేందుకు గంగమ్మను తలమీద ధరించి గంగాధరుడని పిలిపించు కున్నాడు.
సకల జనులకు ముక్తినొసగుతూ ముక్తేశ్వరుడయ్యాడు… ఇలా ఒకటా రెండా భక్తుల పాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్న బోళా శంకరుడికి నామాలు అనేకం.
మహిమలు అనంతం.
అంతటి మహిమకల స్వామి భక్తుడి ప్రాణాలు రక్షించడానికి స్వయంగా పహారా కాసిన క్షేత్రం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో కొలువైన జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయం.

💠 ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి మీదకు అనేకసార్లు దండెత్తిన జరాసంధుడు ఒకానొక యుద్ధంలో కిట్టయ్య చేతిలో మరణాన్ని తప్పించుకుని పారిపోయి హేలాపురి( ప్రస్తుత ఏలూరు)  చేరుకుంటాడు.
అక్కడే ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని శివుడి కోసం తపస్సు చేస్తాడు.
అతడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు జరాసంధుడు తనకి శ్రీకృష్ణుడి చేతిలో మరణం సంభవించకుండా ఎప్పుడూ తన దగ్గరే ఉండి తనను రక్షించమని వేడుకుంటాడు. దీంతో శివుడు లింగరూపంలోనే ఉంటూ జరాసంధుడికి పహారా కాయడం వల్ల ఈ క్షేత్రానికి జ్వాలాపహరేశ్వర ఆలయం అనే పేరు వచ్చింది.
కాలక్రమంలో హేలాపురి ఏలూరుగా స్థిరపడిపోయింది.

💠 జ్వాలాపహరేశ్వరస్వామి ఆలయాన్ని పదో శతాబ్దంలో వేంగి చాళుక్యులు నిర్మించారని ఆలయ శాసనాలు తెలియజేస్తున్నాయి.
వేంగీ రాజుల కాలంలో నిర్మించిన నూట ఎనిమిది శివాలయాల్లో జ్వాలాపహరేశ్వర ఆలయం ఒకటి. నాటి నుంచి నేటి వరకూ స్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా పూజలందుకోవడం విశేషం.

💠 ఈ క్షేత్రంలో కొలువైన జ్వాలాపహరేశ్వర స్వామిని జరా పహరేశ్వరస్వామి,
జలా పహరేశ్వరస్వామి అని కూడా పిలుస్తారు.

💠 ఈ అంతరాలయంలోని శరభసాళ్వం అనే కుడ్యశిల్పం విశేష ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. శరభ సాళ్వం దర్శనంతో కాలసర్పదోషాలు తొలగిపోతాయని ప్రతీతి. కాకతీయుల కాలంలో శివాచార్యులు అనే శివభక్తుడు స్వామిని సేవించారని చెబుతారు.

💠 ఆలయంలోని నందిని వేంగి చాళుక్య రాజనందిగా పిలుస్తారు. సంతానంలేని వారు నంది మెడలో శనగల మూట కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఏ శివాలయంలోనైనా నంది తలమీద నుంచి శివయ్యను దర్శించుకోవడం ఆచారం.
కానీ ఈ ఆలయంలో మాత్రం ఆలయం వెనక గర్భాలయం గోడకు ఉన్న రంధ్రం నుంచి శివుడినీ, ఆ తర్వాత రాజనందినీ దర్శించుకోవడం విశేషం.

🔅 ఇతర ఆలయాలు 🔅

💠 ఆలయ ప్రాంగణంలోనే వందల ఏళ్ల చరిత్రగల మహిషాసురమర్దని అమ్మవారి ఆలయం ఉంది. అమ్మవారు ఇక్కడ పెద్దమ్మగా పూజలందుకుంటోంది. అమ్మవారి విగ్రహాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు ప్రతిష్ఠించారని చెబుతారు.

💠 శరన్నవరాత్రులు, కల్యాణోత్సవం, కార్తికమాసం, మహాశివరాత్రి పర్వదినాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు.

💠 పెద్దమ్మ ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోర్కెలు తప్పక నెరవేరతాయని భక్తుల నమ్మకం.
ఈ ప్రాంగణంలోనే సీతారామస్వామి ఆలయం కూడా ఉంది.
ఆలయ ప్రదక్షిణ మార్గంలో ప్రతిష్ఠించిన గణపతిని సకల కార్యసిద్ధికి ప్రతీకగా కొలుస్తారు.

💠 ఏలూరుకి మూడు కి.మీ. దూరంలో ఉందీ ఆలయం.

No comments: