Adsense

Wednesday, December 3, 2025

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర - 25వ అధ్యాయం

🎻🌹🙏 ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప...

శ్రీ అయ్యప్ప స్వామి దివ్య చరిత్ర 25 ,వ భాగం ప్రారంభం...!!🌹
🙏

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

🌿జ్యేష్ఠాదేవి పాల సముద్రునికి మహాలక్ష్మికి పూర్వమే జన్మించింది ! ఈమెను శనీశ్వరుడు వివాహం చేసకున్నాడు ! జ్యేష్ఠాదేవి చూపు సోకితే కష్టాలు , దారిద్య్రం సంభవిస్తాయి. శని వక్రదృష్టి సోకినా కష్టాల పరంపర , అనారోగ్యం , ఆపదలు సంభవిస్తాయి !

🌸మానవులు శని భగవానుని తైలాభిషేకాలతో , పూజార్చనలతో సేవించసాగారు వక్రదృష్టిని ప్రసరించవద్దని ప్రార్థిస్తూ !
జ్యేష్ఠాదేవికి ప్రత్యేక పూజార్చనలు చెప్పబడలేదు ! ఆమె విచారంతో తన సోదరి మహాలక్ష్మిని , ఆమె భర్త మహావిష్ణువును దర్శించి తనకు కూడా పూజార్చనలు లభించేలా వరం ప్రసాదించమని కోరింది !

🌿 మహాలక్ష్మి కూడా ఆమె కోర్కెను తీర్చమని భర్తను ప్రార్థించటంతో మహావిష్ణువు జ్యేష్ఠాదేవికి తన రూపమైన అశ్వత్థవృక్ష మూలంలో కూర్చుని వుండమనీ , శనివారాలు ఆ మూలంలో అర్పించే పూజాదికాలు ఆమెకూ చెందుతాయనీ , అందువల్ల శనీశ్వరుని అనుగ్రహం భక్తులకు లభిస్తుందనీ వరం ప్రసాదిస్తాడు !

🌸ఆ కారణగా అశ్వత్థ వృక్ష మూలంలో జ్యేష్ఠాదేవి కూడా వున్నా ఏ విధమైన అశుభాలు జరగవని మహావిష్ణువు సెలవివ్వడంతో ఆందోళన దూరమైంది భక్తులకు !

🌹
శనిశ్వరదేవుని మంత్రం🌹

🌿‘‘కోణస్థః పింగళో బ్రభ్రుః కృష్ణో రౌద్రాంతకో యమః శౌరిశ్చనైశ్వరో మందః పిపలాదేవ సంస్తుతః "అని పఠించడంవల్ల శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది ! అభీష్ట సిద్ధి లభిస్తుంది ! రావిచెట్టు నీడలో కార్తీకమాసంలో బ్రాహ్మణులకు భోజనం పెడితే అనంతమైన పుణ్యం లభిస్తుంది !

🌸 రావిచెట్టును నాటడం వల్ల నలబై రెండు తరాలవారికి స్వర్గం లభిస్తుంది ! 
  పురాణాలలో చెప్పబడ్డ విషయాలను మాకుతెలిసినంతవరకు తెలియజెప్పాము ! మీరందరూ అశ్వత్థ వృక్ష మహిమను గ్రహించి , పూజించి శుభాలు పొందాలన్నదే ఆ స్వామి సంకల్పం ! వృక్షాన్ని పూజించి మీరందరూ ధన్యులవండి !  అంటూ పూజారులు చెప్పిన విషయాలు విని భక్తిభూరి హృదయాలతో నమస్కరించారందరూ ! 

🌿ఆయుధాలు తీసుకుని సైనికులు , పందల , పాండ్య రాజుల వెంట తిరిగి తమ స్వస్థానాలకు చేరుకున్నారు ! అయ్యప్ప దయతో సుఖ , శాంతులతో జీవించసాగారు ! పంబలరాజు తమ రాజ్యంలోని అయ్యప్పస్వామి ఆలయంలో తిరిగి పూజార్చనలు యధావిధిగా జరిగేట్లు చేశాడు ! 

🌸 ఇతర ప్రాంతాలలో కూడా అయ్యప్ప ఆలయాలు వెలిశాయి !  ప్రజలు భక్తి విశ్వాసాలతో స్వామిని కొలుచుకోసాగారు ! వావర్ మొదలైనవారికి కూడా గుడులు ఏర్పాటు చేసి వాళ్లను చిరస్మరణీయులు కావించారు !

🌿‘‘ అయ్యప్పస్వామి తిరిగి అవతరించి దుర్మార్గులను వధించి జనాలను రక్షించి ధర్మాన్ని స్థాపన చేసిన జానపదగాథ !  ఒక విషయం గమనించాలి ? పురాణాలలో మహావిష్ణువు వేరు వేరు రూపాలతో , పేర్లతో అవతరిస్తుంటాడు ! అయ్యప్ప చరితంలో మహిషి సంహారానికి హరిహరుల అంశతో జన్మించిన పుత్రునికి మహావిష్ణువు మణికంఠుడు అనీ , ధర్మశాస్తా అనీ పేర్లు ప్రసాదిస్తే , పరమేశ్వరుడు భూతనాథుడనే పేరుతో భూతగణాలకన్నిటికి నాయకుడిని చేశాడు !

🌸ఆ పుత్రుడు భూలోకంలో మణికంఠుడనే పేరుతో పెరిగి మహిషిని సంహరించాడు ! మణికంఠుడు అవతార లక్ష్యం పూర్తయ్యాక శబరిగిరిమీద శిలారూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు ! అయ్యప్ప అనే పేరుతో ఆ ప్రాంత ప్రజలు మణికంఠుని వెళ్లవద్దంటూ ఆర్తిగా వేడుకున్నప్పుడు మణికంఠుడు తాను ఆ పేరుతోనే ప్రసిద్ధుడినౌతానంటూ వరం ప్రసాదించి సంతోషం కలిగించాడు !

🌿అందుకే అయ్యప్ప స్వామిగానే ప్రఖ్యాతి చెందాడు ! ఈ పేరు ప్రజలు పెట్టినది ! మహిషి సంహారం కృతయుగాంతంలో జరిగినట్లు గ్రహించాలి ! తరువాతి యుగాలు గడిచి , కలియుగారంభంలో తిరిగి అరాచకం పంబల దేశ ప్రాంతంలో తలఎత్తినపుడు మణికంఠుడు అయ్యప్ప అనే పేరుతోనే అవతరించి వాళ్లను సంహరించాడు !

🌸తిరిగి తన విగ్రహంలోనే విలీనం చెందాడు ! ఇదే ఈ స్వామిలోని ప్రత్యేకత ! అవతార రూపం , మూల రూపం ఒకే విధంగా , ఒకే పేరుతో వుండటంవల్ల ఎక్కడ వెలసినా ఆ రూపంలోనే ఆ పేరుతోనే ఆరాధింపబడుతున్నాడు ! దేవుడైన విష్ణుమూర్తి భూలోకంలో మానవుడిగా

🌿అవతరించినపుడు రాముడుగా కృష్ణుడుగా వేరే రూపాలతో , పేర్లతో జన్మించడం జరిగింది ! కాని అయ్యప్పస్వామి మణికంఠుడు , ధర్మశాస్తా అనే దైవపరమైన పేర్లకన్నా ప్రజలు పెట్టిన పేరుతోనే పూజింపబడుతున్నాడు ,

‘🌹‘
పంబలరాజ్యం , శబరిగిరి 🌹

🌸 వీటిలోనేగాక అయ్యప్పస్వామికి సంబంధించిన పుణ్యక్షేత్రాలింకా ఉన్నాయి ! పంబల రాజ్యం ఇప్పటి కేరళ రాష్ట్రంలోనిది ! కేరళలోనే పురాణ ప్రసిద్ధమైన అయ్యప్పస్వామి ఆలయాలు ఎక్కువగా ఉన్నాయి.

🌿 వాటిలో శబరిమలతోపాటు మరో నాలుగు చోట్ల వెలసిఉన్న అయ్యప్పస్వామి క్షేత్రాలు మహిమాన్వితమైనవిగా చెప్పబడ్డాయి.

🌸ఈ నాలుగు స్థలాలలో మాత్రం వేరు వేరు రూపాలలో అయ్యప్పస్వామి వెలసి వుండటం ప్రత్యేకతగా చెప్పబడుతున్నది !

🌿  ఆ ప్రాంతాలు , అక్కడ వెలసి వున్న మూర్తులను శబరిమలమీద వెలసి వున్న మూలమూర్తిని కలిపి ‘పంచ అయ్యప్పలు’ గా వ్యవహరిస్తారు ఆ ప్రాంతాలవాళ్లు ! వాటి వివరాలు..

🌷పంచ అయ్యప్పలు:
పంచతత్వ క్షేత్రాలు
🌷
🌹కుళత్తుపుల - అనే క్షేత్రంలో🌹
🌸అయ్యప్పస్వామి విగ్రహం బాలుని రూపంలో వుంటుంది ! అందాలు చిందే పసిబాలుడుగా సాలగ్రామ శిలారూపంలో ‘కుళత్తూర్ అయ్యన్’ అనే పేరుతో పూజింపబడుతున్నాడు.

🌿ఆలయ సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించడంవల్ల చర్మరోగాలు నయమవుతాయని ప్రజల నమ్మకం ! ఈ క్షేత్రం జీవి హృదయస్థానంలో వుండే వాయుతత్త్వంతో కూడిన అనాహత చక్రానికి ప్రతీకగా స్థల పురాణంలో చెప్పబడింది !

🌹ఆర్యన్‌గావ్ - కుళత్తపుల 🌹
🌸క్షేత్రానికి
సుమారు పద్ధెనిమిది మైళ్ల దూరంలో వున్న ఈ క్షేత్రంలో కళ్యాణమూర్తిగా పూర్ణా , పుష్కళా దేవేరుల సహితంగా దర్శనమిస్తాడు అయ్యప్పస్వామి ! ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామి , దేవేరుల కళ్యాణం వైభవంగా జరుపుతారు ! జీవి నాభి స్థానంలో వుండే అగ్నితత్వం గల మణిపూరక చక్రానికి ఈ క్షేత్రం ప్రతీకగా చెప్పబడింది !

🌹
అచ్చన్ కోవిల్ :🌹

🌿 జలతత్త్వమైన , నాభికి క్రిందగా వుండే స్వాధిష్టాన చక్రానికి ప్రతీకగా వెలసి వున్న ఈ క్షేత్రంలో రుద్రాక్ష శిలారూపంలో వెలసి వున్న అయ్యప్పస్వామి గృహస్థుగా పూజింపబడుతున్నాడు !

🌹
ఎరుమేలి :  🌹

🌸ఇక్కడ ఆలయంలో ధర్మశాస్తా కిరాత పురుషునిగా (వేటగాడు)గా దర్శనమిస్తాడు. ఈ ఎరుమేలిలోనే అయ్యప్పస్వామి మిత్రుడైన వావరు గుడి వున్నది ! శబరిమల యాత్రలో భక్తులందరూ ఎరుమేలి చేరి అయ్యప్ప ఆటవిక పురుషుని రూపంలో వున్నందువల్ల తాము కూడా ఆటవిక వేషాలు ధరించి , తాము తీసుకువెళుతున్న ఆయుధాలను చేతబట్టి (కత్తి , గద , బాణం మొదలైనవి) అయ్యప్ప భజన చేస్తూ నాట్యం చేస్తుంటారు.

🌿  దీన్ని ‘వేటతుళ్లి’  అంటారు ! ఈ విధంగా చేయడంవల్ల స్వామి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం ! జీవి శరీరంలోని పృథ్వీతత్వమైన మూలాధార చక్రానికి ప్రతీకగా ఈ స్థానం చెప్పబడింది !

🌹
శబరిమల :🌹

🌸జీవి కనుబొమ్మల మధ్య వుండే ఆజ్ఞా చక్రానికి ప్రతీకగా శబరిమల ! ఇక్కడ స్వామి జ్యోతి రూపంలో మకర సంక్రాంతినాడు దర్శనం ప్రసాదిస్తాడు ! ఈ ఐదు క్షేత్రాలేగాక పంబల రాజ్యంలోని ధర్మశాస్తా ఆలయం వెలసి వున్న ప్రాంతం జీవి కంఠ ప్రదేశంలో వుండే ఆకాశ తత్వాన్ని గల విశుద్ధి చక్రానికి ప్రతీకలా చెప్పబడింది.

🌿 ఇక్కడ స్వామిని బాలశాస్తాగా పూజించడం ఆనవాయితీ ! కేరళ రాష్ట్రంలో ప్రధానమైన అయ్యప్ప క్షేత్రాలు అవి ! ఇక ఇప్పుడు దక్షిణాపథంలోని ఇతర రాష్ట్రాలో గూడా అయ్యప్పస్వామికి ఎన్నో గుడులు నిర్మించబడ్డాయి. భక్తులు కూడా ఎక్కువైనారు ! దీక్షాధారులే కాక అయ్యప్పస్వామి దర్శనానికి వెళ్లే భక్తులతో కార్తీకమాసం నుండి శబరిమలకు వెళ్ళేదారులంతా జన సందోహంతో నిండి వుంటుంది !

🌹
శబరిమల యాత్ర విషయాలు🌹

🌸పూర్వకాలంలో శబరిమల యాత్ర చేయడం చాలా కష్టంగా వుండేది ! క్రూరమృగాలతో నిండిన ఘోరారణ్యాల మధ్య , ముళ్లతో నిండిన సన్నని కాలిబాటల వెంట కాలినడకన సుమారు 50 కి.మీ ప్రయాణం చేయాల్సి వచ్చేది !

🌿 అయినా ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని పలుకుతూ , మార్గాయాసాన్ని లెక్కచేయకుండా మూడు రోజులు నడిచి శబరిమలను చేరుకునేవాళ్లు భక్తులు ! ఈ మార్గాన్ని ‘పెద్దపాదం’ అని వ్యవహరిస్తారు ! యాత్రకు పురుషులకు వయస్సు పరిమితి లేదు ! పిల్లలను కూడా తీసుకువెళ్లవచ్చును.

🌸 స్త్రీలు మాత్రం 12 నుండి 50 సంవత్సరాల వయస్సు వారు యాత్ర చేయరాదన్న నియమం వున్నది ! (ఆడపిల్లలు వ్యక్తులవ్వడానికి ముందు , స్త్రీలు బహిష్టు ఆగిన తర్వాత మాత్రమే యాత్రకు అర్హులు)

🌹
యాత్ర ఆరంభం: 🌹

🌿ఇరుముడి తలమీద పెట్టుకుని గురుస్వామి వెంట భక్తులు శరణుఘోష చేస్తూ మొదటి మజిలీ ఎరుమేలి చేరుకుంటారు !

🌹
మొదటిరోజు మజిలీ ఎరుమేలి:🌹

🌸ఈ క్షేత్రాన్ని చేరగానే అందరిలో ఉత్సాహం పొంగులువారుతుంది. ఇక్కడ కిరాత వేషంలో వున్న వేట శాస్తా గుడి , స్వామి మిత్రుడైన వావరు సమాధి ఉన్నాయి. ఇక్కడ అందరూ ఇరుముడులు శుభ్రమైన స్థలంలో భద్రపరిచి , వేటగాళ్లలా వేషాలు వేసుకుని , అయ్యప్ప భజన చేస్తూ తమ వెంట తెచ్చిన ఆయుధాలు పట్టుకుని కొంతసేపు నాట్యం చేస్తారు ! ఈ కార్యక్రమాన్ని ‘వేటతుళ్లి’ అంటారు. ఈ విధంగా ఆడి పాడటంవల్ల స్వామి ఆనందిస్తాడన్నది ప్రజల విశ్వాసం ! 

 🌿 ఆ కార్యక్రమం ముగిసాక గుడిలో స్వామిని దర్శించి కొబ్బరికాయలు కొట్టి , వావరు గుడికి ప్రదక్షిణలు చేస్తారు ! స్వామి ఆదేశం ప్రకారం వావర్ తమ వెంట అరణ్యమార్గంలో తోడుగా వుండి ప్రమాదాలు సంభవించకుండా చూస్తాడన్న విశ్వాసంతో అక్కడనుండి ముందుకు సాగి ‘పేరూరు తోడు’ అనే నదీ ప్రాంతాన్ని చేరుకుంటారు ! ఆ నది భక్తులు స్నానం ఆచరించడానికి వీలుగా కొండలమీది నుండి క్రిందకు ప్రవహిస్తూ ఉంటుంది ! ఇక్కడ స్నానాలు చేసి శుభ్ర వస్త్రాలు ధరించి భక్తులు ‘కాళైకట్టె’ ప్రాంతాన్ని చేరుకుంటారు !

🌹
కాళైకట్టె: 🌹

🌸 ఆ ప్రాంత భాష అయిన మలయాళంలో ‘కాళై’ అంటే వృషభం అనీ , కట్టె అంటే కట్టివేయటం అనీ అర్థం ! మణికంఠుడు మహిషిని మర్దించే సమయంలో చూడటానికి వచ్చిన పరమేశ్వరుడు ఈ స్థలంలోనే తన నంది వాహనాన్ని కట్టివేసినట్లు ఇక్కడి స్థల పురాణం తెలుపుతున్నది !


🌿ఇక్కడ వున్న పార్వతీ పరమేశ్వరులు , గణపతి , సుబ్రహ్మణ్యస్వామి , నాగరాజుల గుడులను దర్శించుకుని భక్తులు అక్కడికి దగ్గరలో వున్న అళుదానది దగ్గరకు చేరుకుని రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు ! వంట చేసుకుని తిని రాత్రంతా భజన చేస్తూ గడుపుతారు !

🌹
అళుదానది: 🌹

🌸ఇది ఒక చిన్న జలప్రవాహం ! మహిషిని సంహరించడానికి మణికంఠుడు ఆమె శరీరాన్ని మర్దిస్తున్నపుడు జ్ఞానోదయమై తనకు క్షమాభిక్ష ప్రసాదించమని వేడుకుంటూ విషాదంతో కన్నీరు కారుస్తుంది మహిషి ! ఆ కన్నీరే అళుదా (కన్నీళ్ళు) నదిగా ఏర్పడిందని స్థల పురాణం తెలిజేస్తున్నది.

🌿 వనమూలికలు , ఔషధాల సారం గల ఈ అళుదానది నీటిలో స్నానం దేహానికి ఆరోగ్యాన్ని , మనస్సుకు శాంతిని ప్రసాదిస్తాయి. ఈ నదీ ప్రాంతంలోనే ఉదయనుడనే గజదొంగను చంపడానికి సైన్యాలతో బయలుదేరిన అయ్యప్ప విడిది చేసినట్లు కూడా జానపదగాథలలో తెలుపబడింది. మర్నాడు పొద్దున అళుదా నదిలో స్నానం చేసి ఆ నదిలో నుండి రెండు రాళ్లను తీసుకుని వాటితో రెండవ రోజు ప్రయాణం మొదలుపెడతారు భక్తులు !

🌹
రెండవ రోజు ప్రయాణం: 🌹

🌸అళుదానదీ స్నానం ముగించుకుని , అందులో నుండి రెండు రాళ్లు ఏరుకుని భద్రపరచుకుని అళుదామేడు అనే కొండ ప్రాంతాన్ని చేరుకుంటారు యాత్రికులు ! 

🌹
అళుదామేడు: 🌹

🌿మేడు అంటే కొండ ! సుమారు 5 కి.మీ ఎతైన గుండ్రని రాళ్ళతో కూడిన ఈ కొండను శరణుఘోష చెప్పుకుంటూ ఎక్కుతారు యాత్రికులు.  ఈ కొండ శిఖరానికి కొంచెం క్రిందగా ‘కళ్లడుంకుండ్రు’  అనే ప్రదేశం ఉన్నది !

🌹
కళ్లడుంకుండ్రు: 🌹

🌸మహిషిని వధించి , ఆ శరీరాన్ని ఆకాశంపైకి విసురుతాడు మణికంఠుడు ! ఆ కళేబరం వచ్చి భూమిపై పడ్డ స్థలమే ఈ ‘కళ్లడుంకుండ్రు’గా* స్థల పురాణంలో తెలుపబడింది ! దేవతలు మహిషి కళేబరం మీద అళుదానది నుండి తీసిన రాళ్ళు విసిరి ఆ స్థలంలో సమాధి గావించారట. అందుకు గుర్తుగా భక్తులు అళుదానది నుండి ఏరుకుని తెచ్చిన రెండేసి రాళ్లను ఆ ప్రదేశంలో వుంచడం ఆచారంగా మారింది ! అక్కడ కర్పూర హారతులు ఇచ్చి నమస్కరించి ముందుకు సాగుతారు !

🌹
ఇంజిపారకోట:🌹

🌿అళుదామేడు శిఖరాన్ని ఇంజిపారకోట అంటారు! పూర్వం ఉదయనుడి కోట వుండిన స్థలంగా ఈ ప్రదేశం చెప్పబడింది ! ఇక్కడే అయ్యప్పస్వామి ఉదయనుడిని హతమార్చటం జరిగింది ! ఇక్కడ నీరు చిన్న కాలువగా ప్రవహిస్తూ ఉండటంవల్ల భక్తులు కొంతసేపు విశ్రమించి కొండదిగటం ప్రారంభిస్తారు ! శరణుఘోష చెప్పుకుంటూ ‘కరిమలతోడు’ అనే ప్రదేశాన్ని చేరుకుంటారు !

🌹
కరిమలత్తోడు: 🌹

🌸కరి అంటే ఏనుగు , మల అంటే కొండ , తోడు అంటే నీరు ! ఈ ప్రాంతమంతా ఏనుగులతో నిండి వుండటంవల్ల ఈ కొండ ప్రాంతానికి ‘కరిమల’ అనే పేరు వచ్చింది ! ఇక్కడి పిల్లకాలువలలో నీరు ప్రవహిస్తూ వుండటంవల్ల ఏనుగులు ఈ కాలవల దగ్గరకు వస్తుంటాయి.

🌿ఇక్కడ నీరు పాత్రలతో నింపుకుని నిటారుగా వున్న కొండను ఎక్కటం ప్రారంభిస్తారు భక్తులు ! సుమారు పది కి.మీ పైకి ఎక్కి వెళ్లి కొండ శిఖరం చేరుకుంటారు ! ఈ కొండ శిఖరాన్ని ‘కరిమల ఉచ్చ’ అని పిలుస్తారు.

🌸ఇక్కడ ఒక దివ్యమైన బావి , జలపాతం దర్శనమిస్తాయి ! బావిలో నీరు ఎప్పుడూ వూరుతూనే వుండటం ఆశ్చర్యకరంగా భావించబడుతున్నది ! వాటికి పసుపు , కుంకుమలు సమర్పించి , కొబ్బరికాయలు కొట్టి హారతి ఇచ్చి నమస్కరించి అక్కడ ఏర్పరచిన హుండీలో డబ్బులు సమర్పించి నమస్కరిస్తారు. ఆ రాత్రి అక్కడే బస చేస్తారు ! బస చేసే స్థలాలను ‘తావళం’ అంటారు !

🌹
మూడవ రోజు ప్రయాణం: 🌹

🌿మూడవ రోజు ఉదయాన్నే భక్తులు కరిమలఉచ్ఛ నుండి దిగటం ప్రారంభిస్తారు. ఈ కొండ దిగటం కూడా ఎంతో కష్టం ! అయినా అయ్యప్ప శరణు ఘోష చెప్పుకుంటూ దిగి పెరియాన పట్టం అనే ప్రదేశాన్ని చేరుతారు.

🌹
పెరియాన పట్టం: 🌹

🌸పెరి అంటే పెద్ద , యాన అంటే ఏనుగు , పట్టం అంటే స్థలం అని అర్థం మలయాళ భాషలో ! ఇక్కడ ఒక కాలువలో నీరు ప్రవహిస్తుంటుంది. ఆ నీరు త్రాగి దాహం తీర్చుకోవటానికి పెద్ద పెద్ద ఏనుగులు , ఇతర వన్యమృగాలు వస్తుంటాయి కనుక భక్తులు ఇక్కడ ఎక్కువసేపు ఆగరు ! రాత్రుళ్లు బస చేయరు !

🌿ఇక్కడ నుండి కొద్ది దూరంలో ప్రవహిస్తున్న పంబానది కనిపిస్తుంటుంది ! భక్తులు ఉత్సాహంగా ఆ వైపు నడక సాగిస్తారు ! అడవి మార్గాన కాలినడకన వచ్చే యాత్రికులు పంబానది చేరడంతో మార్గంలో పడిన కష్టాలను మరిచి తృప్తిగా ఊపిరి పీల్చుకుంటారు ! కష్టంతో
....సశేషం...

🌹తరువాయి భాగం రేపటి శీర్షికలో  తెలుసుకుందాం...🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸
🌿🌸🌿

No comments: