Adsense

Showing posts with label రామాయణం. Show all posts
Showing posts with label రామాయణం. Show all posts

Monday, June 2, 2025

వాల్మీకి రామాయణం -15

పాయస విభాగం రామ లక్ష్మణ భరత శత్రుఘ్న జననం. శ్రీ మహావిష్ణువులో అర్ధాంశ-రాముడు,
అతనిలో చతుర్థాంశ (1/8)- భరతుడు,
అర్ధాంశ (1/4) లక్ష్మణుడు, మరొక చతుర్థాంశ (1/8) - శత్రుఘ్నుడు, పాయసం పంచిన పరిమాణంలోనే అవతారాంశలు.


తనకు ఇచ్చిన పాయసభాగాన్ని కౌసల్య అందరికంటే ముందు భుజించింది. అందుకని అందరికంటే పెద్దవాడు రాముడు జన్మించాడు.

సుమిత్ర తనకు ఇచ్చిన పాయసభాగాన్ని (1/4) వెంటనే భుజించకుండా, మిగిలినదాన్ని మహారాజు ఎవరికి ఎలా ఇస్తాడో అని క్షణకాలం వేచిచూచింది.

ఈ లోగా తనకు అందిన భాగాన్ని (1/ 8) కైక భుజించింది అప్పుడు మిగిలిన భాగాన్ని కూడా (1/8) దశరథుడు సుమిత్రకు ఇవ్వగా రెండూ కలిపి చివరగా భుజించింది అందుకని ఇదే క్రమంలో భరతుడు (1/8) లక్ష్మణ (1/4) శత్రుఘ్నులు (1/8) జన్మించారు.
ఇదీ సాంప్రదాయికుల సమన్వయం)

రాముని జనన కాలం లో
అయోధ్యలో ప్రజలందరికీ మహోత్సవం అయ్యింది. పండుగ చేసుకున్నారు.

వీథులన్నీ నటనర్తక గాయక గాయనీమణులతో నిండిపోయాయి. గాన వాద్య ఘోషలతో పెద్ద కోలాహలం చెలరేగింది.

సూత వందిమాగధులకూ బ్రాహ్మణులకూ గోవిత్తసహస్రాలను దశరథుడు పంచిపెట్టాడు.

ఇంకా చాలామందికి చాలా బహుమతులు అందించాడు. ఆనందోత్సాహాలతో పదకొండు రోజులు గడిచాయి. పన్నెండవనాడు నామకరణ మహోత్సవం జరిగింది.

జ్యేష్ఠునికి రాముడని, కైకేయీపుత్రునికి భరతుడని, సుమిత్ర కొడుకులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడూ అని వసిష్ఠులవారు నామకరణం చేసారు. జాతకర్మాదులు జరిపించారు.

పౌరజానపదులకూ బ్రాహ్మణులకూ దశరథుడు బ్రహ్మాండమైన విందు చేసాడు. రత్నరాశులు పంచిపెట్టాడు.

వీరిలో జ్యేష్ఠుణ్ని చూస్తే తండ్రికి చెప్పరాని ఆనందం కలుగుతోంది.
సర్వ ప్రకృతి ఆనందపరవశం అవుతోంది

నలుగురూ వేదవేదాంగాలను అభ్యసించారు.
ధనుర్వేదంలో నిష్ణాతులయ్యారు. సకలనీతిశాస్రాలూ అభ్యసించారు.

గజాశ్వరథ విద్యలు నేర్చారు. గురు శుశ్రూషారతులు,
పితృ శుశ్రూషారతులుగా దినదిన ప్రవర్ధమానులు అయ్యారు..

( స‌శేష‌ము )..

Saturday, May 31, 2025

వాల్మీకి రామాయణం - 14

ఆరు ఋతువులు గడిచిపోయాయి.
పన్నెండవనెల. చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమినాడు పునర్వసు నక్షత్రయుక్త (చతుర్ధపాదం) కర్కాటక లగ్నంలో సూర్య గురు శుక్రాంగారక శనిగ్రహాలు అయిదూ స్వోచ్చస్థానంలో ఉండగా

బృహస్పతి చంద్రులు కలిసి ఉన్న ముహూర్తంలో కౌసల్యాదేవి శ్రీరామచంద్రుణ్ని ప్రసవించింది. జగన్నాథుడు సర్వలోక నమస్కృతుడు జన్మించాడు

తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రేఽదితిదైవత్యే స్వోచ్చ సంస్థషు పంచసు॥

గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతమ్||

కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సంయుతమ్ |
విష్ణోరర్ధం మహాభాగం పుత్ర మైక్ష్వాకువర్ధనమ్ ||..

మర్నాడు దశమి. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు మీనలగ్నంలో పుష్య నక్షత్రయుక్త శుభముహూర్తంలో సూర్యాంగారకాది పంచగ్రహాలూ స్వోచ్చస్థానాల్లో ఉండగా కైకేయి భరతుణ్ని ప్రసవించింది

భరతో నామ కై కేయ్యాం జజ్జే సత్యపరాక్రమః సాక్షాద్విష్ణోశ్చతుర్చాగ స్సముదితో గుణైః

అదేరోజున సూర్యోదయం అయ్యాక ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటకలగ్నంలో సూర్యాంగారకాది పంచగ్రహాలు స్వోచ్చస్థానాలలో ఉండగా సుమిత్ర లక్ష్మణశత్రుఘ్నులను కవలను ప్రసవించింది

అథ లక్ష్మణశత్రుఘ్నౌ సుమిత్రాజనయత్సుతౌ
వీరౌ సర్వాస్త్ర కుశలౌ విష్ణో రర్ద సమన్వితా

పుష్యే జాతస్తు భరతో మీనలగ్నే ప్రసన్నధీః సార్పే జాతా తు సౌమిత్రీ కుళీరేఽభ్యుదితే రవౌ|

ఆ సమయంలో గంధర్వులు అవ్యక్త మధురంగా గానం చేసారు. అప్సరసలు ఆనందంతో నృత్యం చేసారు దేవ దుందుభులు మ్రోగాయి. ఆకాశంనుంచి పుష్పవృష్టి కురిసింది.

అయోధ్యలో ప్రజలందరికీ మహోత్సవం అయ్యింది. పండుగ చేసుకున్నారు.

వీథులన్నీ నటనర్తక గాయక గాయనీమణులతో నిండిపోయాయి.
గాన వాద్య ఘోషలతో పెద్ద కోలాహలం చెలరేగింది...

( స‌శేష‌ము )..