Adsense

Showing posts with label Warangal. Show all posts
Showing posts with label Warangal. Show all posts

Tuesday, April 4, 2023

శ్రీ కోటగుళ్ళు, గణపురం Sri Kotagullu, Ganapuram



💠 కోటగుళ్లు లో గణపయ్య, ఈశ్వరుడు ఇద్దరూ కొలువై ఉన్నారు. వాళ్ల పేర్ల మీదుగా ఈ ఆలయం  "గణపేశ్వరాలయం" గా పిలవబడుతున్నది.
ఆ కాలంలో ఈ గణపేశ్వర ఆలయం చుట్టూ ఒక పెద్ద మట్టికోట ఉండి దాని లో 22 చిన్న గుడులు ఉండేవట. అందువల్లనే దీనికి "కోట గుళ్ళు" అనే పేరు వచ్చిందట. ఈ కోటగుల్లు ప్రాంతాన్ని కాకతీయ గణపతిదేవుడు ఒక సామంతునికి వరం(కానుక) గా ఇవ్వడం వలన "గణపతివరం" అనే పేరు వచ్చింది. క్రమేణా ఇది 'గణపవరం', 'గణపురం' గా స్థిరపడింది.

💠 దక్షిణ భారతదేశాన్ని ఓరుగల్లును రాజధానిగా చేసుకొని ఘనంగా పాలించిన కాకతీయ చక్రవర్తుల్లో అగ్రగణ్యుడైన గణపతిదేవ చక్రవర్తి పేరున క్రీ.శ. 1234లో జయ సంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి బహస్పతి వారం రోజున గణపురం(గణపవరం), గణపేశ్వరాలయం(కోటగుళ్లు), గణపసముద్రం(చెరువు) నిర్మితమయ్యాయి. రామప్ప దేవాలయాన్ని నిర్మించిన కాకతీయ సర్వ సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కుమారుడు గణపురం సామంతుడు గణపతి రెడ్డి ఆధ్వర్యంలో ఆ నిర్మాణాలు జరిగాయి.

💠 దక్షణ భారతదేశానికే తలమానికగా,
ప్రపంచాన్ని అబ్బురపరిచే శిల్ప కళా సంపద వైభవంతో, అద్భుత కట్టడాలతో ఒకప్పుడు తులతూగిన ఈ  ఆలయాలు ఇప్పుడు శిథిలమై దర్శనమిస్తున్నాయి.

💠 గణపేశ్వర ఆలయానికి పై కప్పు లేదు.
బహుశా ఆలయ నిర్మాణ సమయంలో ఏదైనా సంక్షోభం కారణంగా నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోయి ఉండవచ్చు. లేదా ముస్లిం దండయాత్రల వల్ల పైకప్పు ధ్వంసం అయి ఉండవచ్చు.

💠 ఇక్కడ ప్రధాన దైవం శివుడు.
శివాలయానికి కుడివైపున అరలో చిన్న వినాయకుడి విగ్రహం ఉంటుంది.
ఇక్కడ కూడా శివలింగం కొంత పక్కకు ఒరిగి నట్టే ఉన్నాకూడా లింగం పైన ఒక తోరణం లాగా ఉండి దానిపై నాగుపాము చిత్రాలు ముద్రించబడి ఉంటాయి.

💠 కోట గోడల చుట్టూ చిన్న చిన్నవి 9 గుడులు ఉన్నాయి. ఒకప్పుడు ఇవి 22 ఉండేవట.
కానీ ముస్లిం రాజైన మహ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రలతో ఆలయము, విగ్రహాలు, శిల్ప కళాకృతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అయితే ప్రస్తుతం ఉన్న 9 గుడులలోనూ దైవ విగ్రహాలు ఉంచే చోట లోతైన గుంతలు తవ్వ బడి ఉన్నాయి. ఈ తవ్వకాలకు ఒక కారణం ఉంది. కాకతీయుల ఆచారం ప్రకారం " ఏదైనా ధ్వజస్తంభం లేదా విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు వాటి పునాదులలో వెండి, బంగారంవంటి విలువైన సొమ్ములు ఉంచి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు" అని ఒక నమ్మకం ఉంది. అందువల్లనే ఇక్కడ ప్రాంగణం చుట్టూ ఉన్న అన్ని గుళ్లలో గుప్తనిధుల తవ్వకాలు జరిగాయి.

💠 గణపేశ్వర ఆలయంలోని స్తంభాల మీద పడగవిప్పిన నాగులు, ఏనుగులు, నెమళ్లు, నాట్యకత్తెలు, పుష్పాలు ఇంకా వివిధ రకాల కళాకృతులు చెక్కబడి మనలను ఎంతో ఆకట్టుకుంటాయి.

💠 శివలింగo నక్షత్రకారం పానఘట్టంపై కొలువై ఉన్నట్లు కనపడడంతోపాటు ఆలయ గుర్భగుడి ముఖద్వారంపైన చండిక, త్రిముఖ బ్రహ్మ, పంచముఖ గరుత్మంతుడు, నందీశ్వరుడు, గిరిజా కళ్యాణం, మహావిష్ణువు ఉట్టిపడేట్లు చిత్రీకరించారు. దీని కింద లక్ష్మిదేవి తామర పువ్వు పై కూర్చోగా రెండువైపులా ఏనుగులు తొండాలతో సంయుక్తంగా కలశం పట్టుకుని ఉన్న ఈ విగ్రహం కళానైపుణ్యంతో కాంతులీనుతుంటుంది.

💠 ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున దాదాపు 60 స్తంభాలుగల మండపం నిర్మించబడింది. దీనిని స్తంభాల గుడి అని పిలుస్తారు. డంగుసున్నం, కరక్కాయ మిశ్రమంతో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ కిన్నెర, కింపురుష, మందాకిని శిల్పాలు.. ఆలయ గోడలమీద జంతుజీవాలు, రాతి స్తంభం, చతురస్రం, దీర్ఘచతురాస్ర, వృత్తాకార శిల్పాలున్నాయి.
ఈ మండపంలో ప్రతిరోజూ ఒక నర్తకి, 16మంది వాయిద్య కళాకారులచే నాట్య ప్రదర్శనలు జరిగేవి అంటారు.

💠 మహాశివరాత్రి, కార్తీకమాసంలో ఇక్కడున్న గణపేశ్వరాలయానికి భక్తులు వచ్చి పూజలు నిర్వహిస్తారు.

💠 కాకతీయ చక్రవర్తులు తమ సామ్రాజ్య పాలనను ప్రజలకు అందుబాటులోకి తేవడానికి ఇప్పటి మండలాల మాదిరిగా సామంత రాజ్యాలను ఏర్పర్చారు.
ఆ క్రమంలో ట్రిపుల్ టీ విధానంలో సామంత రాజ్య కేంద్రాన్ని నిర్మించారు.
ట్రిపుల్ టీ విధానం అనగా టీ (టౌన్) నగరం,
టీ (టెంపుల్)ఆలయం,
టీ(ట్యాంక్) చెరువు ఈ విధంగా సామంత రాజ్య కేంద్ర నిర్మాణ క్రమంలో నగరాన్ని నిర్మించారు.
ఆ నగరంలో ఒక దేవాలయాన్ని, ఒక చెరువును నిర్మించే వారు.
ట్రిపుల్ టీ విధానం అంటే ఇదే.
ఈ ట్రిపుల్ టీ విధానంలోనే అప్పుడు గణపురం సామంత రాజ్య కేంద్రంగా ఏర్పాటు చేసి, గణపవరం పేరుతో నగరం, గణపేశ్వరాలయం పేరున ఆలయం, గణపసముద్రం పేరున పెద్ద చెరువును నిర్మించారు.

💠 ఓరుగల్లుపై దాడి చేసిన దేవగిరి మహారాజును 15రోజులు యుద్ధం చేసి ఓడిచినందుకు గుర్తుగా గణపేశ్వరాలయంలో కాకతీయ అష్టమ చక్రవర్తి రాణి రుద్రమదేవి మత్తగజం(ఏనుగు) కుంభ స్థలంపై లంఘించి, సింహం దాన్ని నిర్జిస్తున్నట్లుగా ఉన్న గజకేసరి శిల్పాన్ని తన యుద్ధ విజయ చిహ్నాలుగా ప్రతిష్ఠింపజేసింది. అనగా ఏనుగులాంటి మహాదేవులను, సింహంలాంటి తాను(రుద్రమదేవి) అణచివేసినట్లుగా ఉన్నవి విగ్రహాలు.

💠 వరంగల్ నుండి 60 కిమీ దూరం.

Sunday, March 26, 2023

శ్రీ పద్మాక్షి మందిరం, వరంగల్ జిల్లా : హనుకొండ

💠 సాధారణంగా దేవాలయాల్లో వెలసిన దేవతల విగ్రహాలు ఏ రూపంలో ప్రతిష్టిస్తే ఆ రూపంలోనే భక్తులకు దర్శనం ఇస్తారు.
కానీ అక్కడ పూజలు అందుకుంటున్న అమ్మవారు మాత్రం మూడు పూటల్లో మూడు రూపాల్లో దర్శనం ఇస్తుంటారు.
ఇది ఎలా జరుగుతుందన్నది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యంగానే ఉంది.

💠 12వ శతాబ్దం ప్రథమార్థంలో కాకతీయుల కాలంలో నిర్మితమైన పద్మాక్షి అమ్మవారి ఆలయం ఈ ప్రత్యేకత సంతరించుకుని భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది.
మొదట జైన మందిరంగా ఉన్న దీన్ని కాకతీయ రాజులు హిందూ ఆలయంగా అభివృద్ధి చేసి తమ ఇలవేల్పు అయిన పద్మావతి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఆ అమ్మవారే పద్మాక్షి దేవిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు.


💠 తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హన్మకొండ పట్టణంలో ఒక గుట్ట అంటే కొండపై ఈ ఆలయం నిర్మించారు. అప్పటినుంచీ అమ్మవారి పేరుతోనే అది పద్మాక్షి గుట్టగా ప్రసిద్ధి పొందింది.

💠 కొన్ని శతాబ్దాల క్రితం ఈ గుట్టపై బసది పేరుతో ఒక జైన మందిరం ఉండేది. ఓరుగల్లును ఏలిన కాకతీయ రాజులు ఈ మందిరాన్ని 12వ శతాబ్దంలో హిందూ ఆలయంగా తీర్చిదిద్ది తమ ఇలవేల్పు అయిన పద్మావతి అమ్మవారిని ప్రతిష్టింపజేశారు. అయితే ఇప్పటికీ అక్కడ జైన మత ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి. గర్భగుడిలో రాతిపై ప్రముఖ జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడు ఆయనకు కుడివైపు యక్ష ధరణింద్రుడు, ఎడమవైపు పద్మాక్షి దేవి భారీ చిత్రాలు కనిపిస్తాయి.

🔅 స్థల పురాణం 🔅

💠 సిద్ధులకు మోక్షాన్ని ప్రసాదించడానికి ఈశ్వరుడు అవతరించిన ప్రాంతమే పద్మాక్షీ ఆలయం.
పూర్వం ఇక్కడ సిద్ధులు మోక్ష సాధనకై ఈశ్వరుడికోసం తపస్సు చేశారు.
శివుడు ప్రత్యక్షమై, శక్తి లేనిదే మోక్షంలేదని, ఆవిడకోసం తపస్సు చెయ్యమని చెప్పగా మునులు అలాగే చేశారు.
శక్తి ప్రత్యక్షమై తన పాదాల దగ్గర ఈశ్వరుడు వుంటే అలాగే సిద్ధుల అభీష్టం మేరకు అక్కడ వెలుస్తానన్నది.
ఈశ్వరుడు దానికి ఒప్పుకుని కొండ దిగువను సిద్ధేశ్వరస్వామిగా వెలిశాడు.
అమ్మవారు కొండపైన చిన్న గుహలో పద్మాక్షీదేవిగా వెలిసింది. ఆ చిన్న గుహనే గర్భాలయంగా మలిచారు.

💠 కాకతీయ వంశానికి ‘కాకతీయులు’ అనే పేరుకూడా అమ్మవారే పెట్టిందట.
5వ శతాబ్దంలో కాకతీయ రాజుకి ఖడ్గాన్నిచ్చి, ఆ ఖడ్గం ఆయన దగ్గరున్నంతవరకూ విజయం లభిస్తుందని ఆశీర్వదించింది.

💠 కాకతీయ రాజులలో జైనమతావలంబులున్నారు.
అందుకే కొన్ని జైన శిల్పాలను కూడా కొండమీద చూడవచ్చు.
కాకతీయ సామ్రాజ్య అవతరణకు చాలా ఏళ్లకు ముందే గుట్టపై పద్మాక్షి ఆలయం ఉందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.
పద్మాక్షీ అమ్మవారు ఓరుగల్లువాసుల ఇలవేల్పు. కొండముందు కాకతీయులకాలంనాటి చెరువు. ఈ చెరువులో బతుకమ్మల నిమజ్జనం చాలా వైభవంగా జరుగుతుంది.

💠 కాకతీయుల రాజులు అమ్మవారని దర్శించి పూజలు నిర్వహించిన అనంతరం యుద్థముహుర్తాలకు, శుభగడియలుగా భావించి శత్రువులపై యుద్దం ప్రకటించి విజయం సాధించేవారట.

💠 ఈ ఆలయం ఎత్తైన గుట్టమీద ఉన్న ఓ కొండను తొలిచి నిర్మించారు.
ఈ గుట్టను పద్మాక్షి గుట్టగా పిలుస్తుంటారు. గుట్ట కింది భాగం నుండి ఆలయాన్ని చేరుకోవకోవడానికి గుట్టనే తొలిచి మెట్లుగా రూపొందించారు.
ఆలయ ప్రవేశద్వారం వద్ద నలుపు గ్రానైట్ రాతితో నిర్మించిన మూడు జట్ల నిలువు వరుసలను చూడవొచ్చు. దీనిని అన్నకొండ స్తంభం అంటారు.
దీనిమీద ఉన్న చెక్కడాలు మరియు శాసనాలు చూసే ఇది జైనుల యొక్క స్తూపం అని, జైనుల దేవతలకు అంకితం చేసారని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.


💠 వరంగల్‌ జిల్లాలోని ఇతర పురాతన ఆలయాలతో పోల్చుకుంటే పద్మాక్షీ దేవాలయం అభివృద్ధికి ఆమడదూరంలో ఉందనే చెప్పాలి. బతుకమ్మ పండుగ వస్తే తప్ప పాలకులకు పద్మాక్షీ అమ్మవారు గుర్తుకురారు.
ఇంతటి చారిత్రక ఆలయంలో తాగునీటి సౌకర్యం లేకపోవడం ఈ ఆలయం పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరి స్పష్టం అవుతోంది.

💠 గుట్ట పైకి వెళ్ళడానికి సీసీ రోడ్డు వేయాలన్న డిమాండ్‌ ఆచరణకు నోచుకోలేదు. గుండం ఇప్పటికే మురికి కూపంగా మారిపోయింది. బతుకమ్మ, వినాయక విగ్రహాల నిమజ్జనాల వల్ల పూడిక పేరుకు పోతోంది. ఈ పండుగల అనంతరం పూడిక తీయడం వల్ల మరిన్ని సంవత్సరాలు ఈ పండుగల నిర్వహణకు అవకాశ ముంటుంది. లేదంటే కొద్ది సంవత్సరాల్లోనే పూడికతతో నిండిపోయి ఏ నిమజ్జనాలకు పనికి రాకుండా పోయే అవకాశాలు ఉన్నాయి.
కనీస వసతులు కల్పిస్తే సంఖ్య పెరిగే అవకాశముంటుంది.
గుట్ట పైన ఇతర విగ్రహాలు, వింతలు, విశేషాలు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అత్యంత ప్రాచీనమెన ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఓరుగల్లు ప్రజల పై ఉంది.


💠 పద్మాక్షి దేవాలయం వరంగల్ జిల్లా హన్మకొండ నగరం నడిబొడ్డున వేయి స్తంభాల గుడి కి అతి దగ్గరలో పద్మాక్షి దేవాలయం ఉంది.

Saturday, March 25, 2023

శ్రీ రామప్ప దేవాలయం, వరంగల్ జిల్లా : పాలంపేట



💠 సహజంగా ఏవైనా  ఆలయాలకు గుళ్లో ఏ దేవుడిని ప్రతిష్టించారో ఆ ఆలయం పేరు పెడతారు. లేకపోతే ఫలానా రాజు హయాంలో కట్టించారని తెలిసేందుకు గానూ.. రాజుల పేర్లు  కలసి వచ్చేలా పేర్లు పెడతారు.
కానీ, ఇక్కడ మాత్రం 40 ఏళ్ల పాటు శ్రమించిన శిల్పి రామప్ప పేరు పెట్టడం అప్పటి రాజుల గొప్పదనం.

💠 హోయసలనాడు (ఈనాటి కర్ణాటక రాష్ట్రం)
కి చెందిన రామప్ప  అనే శిల్పి నాయకత్వం లో ప్రణాళిక ప్రకారం 14 సంవత్సరాలలో కట్టబడిన శివాలయం యిది.
కానీ ఈ ఆలయంలో కొలువున్న ఈశ్వరుని పేరు మీద కాకుండా  శిల్పి పేరు మీద 'రామప్ప' దేవాలయంగా జగత్ప్రసిధ్ధి చెందినది.

💠 కాకతీయుల పాలన శిల్ప కళకు స్వర్ణయుగం, అందులోనూ త్రికూటాలయాలు ప్రసిద్ధి చెందాయి. అయితే, రామప్ప గుడి త్రికూటాలయం కాదు.
కానీ, ఈ ఆలయానికి మూడు ప్రవేశ ద్వారాలున్నాయి.
ఎత్తయిన పీఠంపై నక్షత్ర ఆకారంలో, తూర్పునకు అభిముఖంగా గుడిని నిర్మించారు.

💠 ఈ ఆలయాన్ని  రామలింగేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం  ప్రక్కనే రామప్ప చెరువు వున్నది. ఈ చెరువు కాకతీయుల కాలం నాటిది.
ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడని తెలుస్తున్నది. రామప్పగుడిగా ప్రఖ్యాతి చెందిన ఈ రుద్రేశ్వరాలయం కాకతీయ వాస్తు, శిల్పకళకు నిదర్శనం.

💠 రామప్ప ఆలయ గోపురం తేలికైన ఇటుకలతో రూపొందించారు. ఈ ఇటుకలను ప్రత్యేకమైన మట్టితోపాటు ఏనుగులద్దె, అడవి మొక్కల జిగురు, ఊకపొట్టు, మరికొన్ని పదార్థాలు కలిపి తయారు చేశారు.
ఈ పదార్థాలన్నీ సరైన మోతాదులో ఉపయోగించి గట్టిదనం ఉంటూనే, తేలికగా ఉండే ఇటుకలను రూపొందించారు. ఇవి నీటిలో తేలుతాయి.

💠 ఈ దేవాలయం నక్షత్రాకారంలో వుంది. మూడు దిక్కులా ప్రవేశద్వారాలున్నాయి.
కర్ణాటలోని హోయసల సామ్రాజ్యానికి చెందిన బేలూరు, హళేబేడు దేవాలయాల తర్వాత అంతగొప్ప శిల్పకళాసౌందర్యం రుద్రేశ్వరాలయంలో వుంది.

💠 రామప్ప గుడిలో  పెద్దస్తంభాలు, విశాల రంగమండపము దూలముల , అందమైన పై కప్పులు, శిఖరములు వున్నాయి. రంగమండపస్తంభాల మీద పురాణ, ఇతిహాస గాథలతో శిల్పాలను సుమనోహరంగా చెక్కారు. అంతరాళం, గర్భగృహం, ముఖమండప ప్రవేశ ద్వారాల మీద యవ్వన స్త్రీలను, చెట్లు, పద్మములు, గజలక్ష్మి తదితర శిల్పాలను చెక్కారు.
ఆలయంలోని వివిధ భంగిమల్లోని శిల్పాలు ఆకర్షణీయంగా వున్నాయి.
అందులో పురుష-స్త్రీ దేవతలు, యుద్ధవీరులు, గారడీవిద్య చేస్తున్నవారు, సంగీత, నృత్యకారులు, యక్షిణిలు, బూతుబొమ్మలు చూపురులను కట్టిపడేస్తాయి.

💠 ముఖ్యంగా వివిధ నృత్యభంగిమల్లో గల 12 మంది స్త్రీలు పొడుగ్గా యున్న సాలభంజికలు, దేవనర్తకీమణులు (అప్సరసలు), నాగకన్యలు కడు శిల్పాలు ప్రత్యేక ఆకర్షణగా వున్నాయి.

💠 ప్రఖ్యాత నాట్యాచార్యుడు డాక్టర్ నటరాజ రామకృష్ణ 45 సార్లు రామప్పగుడిని సందర్శించి కాకతీయ శిల్పంలోని నృత్యమును పరిశోధించి “పేరిణి శివతాండం” అనే నృత్యరీతిని రూపొందించారు.

💠 రామప్పగుడి చుట్టూ ఎర్రని రాతితో వాత్సాయన కామసూత్రాలను మలిచారు. కామిగానివాడు మోక్షగామికాడు అని మన పూర్వీకులు ఊరకే అనలేదు. ధర్మార్థకామములను పాటించినవానికి మోక్షం లభిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. మనస్సును స్థిమితంగా వుంచినవారే ఆధ్యాత్మిక శాంతిని పొంది భగవంతుని దర్శించగలరు.

💠 ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది.
ఒక కాలు కొంచెం పైకి ఎత్తి పట్టుకొని, చెవులు రిక్కించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడా అన్నట్లుంటుంది.
ముందు నుంచి ఏ దిశనుంచి చూసినా నంది మన వైపే చూస్తున్నట్లుంటుంది.

🔅 శిల్ప కళా చాతుర్యం 🔅

💠 రామప్పగుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవికానివి.

⚜ ముఖ్యమైన శిల్పాలు ⚜

🔅 ధనుర్బానం పట్టిన యువతికి చెందిన అరికాలి నుండి ముల్లు తీస్తున్న సేవకురాలు.

🔅 నర్తకీమణి :
అల్పరూపాల్లో వున్న వాయిద్యకులు, వారి ముఖ కవళికలు, శరీర సౌష్టవం, అందంగా మలచిన వెంట్రుకలు, ఆభరణాలను గమనించాలి. నర్తకీలో నాట్యభంగిమ, సున్నితమైన అంగసౌష్టవము, ఆభరణములు కలవు. రూప సౌందర్యాన్ని ప్రదర్శించే నర్తకి “హైహీల్స్”తో కూడిన పాదరక్షణలు.

🔅 క్షీరసాగర మధన దృశ్యం కనువిందుగా వుంది. మేరుపర్వతమును కవ్వంగా, వాసుకి సర్పమును తాడుగా చేసుకొని తలదిక్కులో రాక్షసులు, తోకవైపు దేవతలు, సాగరమధనం చేస్తున్నట్టుగా చెక్కిన శిల్పాలు.

🔅 గోపికలు స్నానం చేస్తుండగా శ్రీకృష్ణుడు వారి వస్త్రాలను దొంగిలించి చెట్టుపై కూర్చొని వుండగా నగ్నంగా వున్న గోపికలు శ్రీకృష్ణున్ని ప్రార్థిస్తున్న శిల్పాలు.

🔅 త్రిపురసంహారం, దక్ష సంహారం, గిరిజాకళ్యాణం.

💠 తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడంగా రామప్ప రికార్డు సృష్టించింది.
యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఒక్కటి కూడా లేదు. తాజాగా రామప్ప ఆలయానికి ఈ ఖ్యాతి దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది.

💠 రామప్ప దేవాలయం వరంగల్ 70కి.మీ. దూరంలో వుంది.